- ఏపీ సంస్కృతి ప్రతిబింబించేలా ఆధునిక నిర్మాణం
- సరైన పేరు ప్రతిపాదించాలన్న సీఎం చంద్రబాబు
- భూ కేటాయింపులపై కేబినెట్ కీలక నిర్ణయాలు
- మÖడున్నర గంటలపాటు సుదీర్ఘంగా మంత్రిమండలి భేటీ
- అజెండాలో దాదాపు 40 అంశాలపై చర్చ, ఆమోదం
- మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి పయ్యావుల
అమరావతి (చైతన్య రథం): ఉద్యోగ, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులవంటి అంశాలపై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 48వ క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరించారు. దాదాపు మూడున్నర గంటలపాటు సమావేశమైన మంత్రివర్గం.. 40కిపైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 11.5 ఎకరాల్లో రూ.124.5 కోట్లతో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు.
దీనిని ఎన్బీసీసీకి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. భవన నిర్మాణం ఏపీ సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని.. అందులో సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి పయ్యావుల వెల్లడించారు. కొత్త ఏపీ భవనానికి ఏదైనా మంచి పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు కోరారన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మేనేజర్ పోస్టు కొత్తగా క్రియేట్ చేశామని ఆయన వివరించారు. పంచాయితీ రాజ్ శాఖలో 20 పోస్టులు సప్రస్ చేసి.. అవసరం ఉన్న చోట ఆ పోస్టులను క్రియేట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు అదనంగా నిధులు కేటాయింపులు చేయాల్సి వచ్చిందని మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రకాశం జిల్లా రామాయపట్నంలోని గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం త్వరగా పూర్తవుతుంది మరియు ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మరింత పెంపొందిస్తుందని భావిస్తున్నారు.
మున్సిపాలిటీల్లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి పయ్యావుల తెలిపారు. లోకల్ బాడీలలో షాపింగ్ కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్లలో యూనిఫాం రేటుపెట్టి 7శాతం పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. మున్సిపాలిటీల్లో మ్యుటేషన్ ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయని.. వాటన్నింటినీ యూనిఫాం పాలసీ కిందకి తీసుకురావాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కృష్ణానది కరకట్టను ఆధునీకరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రూ.443 కోట్లతో కరకట్ట విస్తరించాలని నిర్ణయించామన్నారు. రాజధాని అమరావతిలో ఆఫీసుల కాంప్లెక్స్లకు సంబంధించి సెక్రటేరియట్, జీఏడీ టవర్స్, గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ ఏర్పాటుకు రూ.2,540 కోట్ల కేటాయించినట్లు మంత్రి పయ్యావుల వివరించారు. సెల్ అండ్ కోర్ స్ట్రక్చర్ కోసం రూ.1,200 కోట్లు, క్వాంటం వ్యాలీకి 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఉంటుందన్నారు. ఒక్కొక్కటి 43 టవర్స్ ఉంటాయని.. రెండు టవర్స్లోనే అన్ని ఫెసిలిటీలు ఉంటాయని చెప్పారు. అసెంబ్లీ బిల్డింగ్కు సంబంధించి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ తదితర సౌకర్యాల కోసం నిధులు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు వివరించారు.
రూ.580 కోట్లతో ఉండవల్లిలో చేపడుతున్న ట్రంక్, అధర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. ఎన్ 10నుంచి ఎన్ 13 వరకూ జంక్షన్కు అండర్ గ్రౌండ్ కేబుల్లో రీ రూటింగ్కు రూ.100 కోట్లు అదనంగా పెంచామన్నారు. గతంలో సీఆర్డీఏ భూములను ఆర్ 5 జోన్ పేరుతో రెవెన్యూ శాఖకు ఇచ్చామని గుర్తు చేశారు. ఆ భూములను వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. యాన్యుటీ విలువ పెంచాలని రైతులు గతంలో ప్రభుత్వాన్ని కోరారని.. అందుకు కేబినెట్ అంగీకరించిందన్నారు. సీఆర్డీఏకు కొత్త కేటాయింపులు ఇవ్వడానికి అనుమతివ్వడం జరిగిందన్నారు. సెబీ, స్వామి నారాయణ్, డీఏవీ పబ్లిక్ స్కూల్కు భూములు ఇవ్వాలని సీఆర్డీఏ చేసిన సిఫార్సుకు ఓకే చెప్పామన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3.57 లక్షలు ఇవ్వనుండగా… ఆర్ అండ్ ఆర్ కాలనీలో కాక బయట కట్టుకుంటామంటే.. భూమికి రూ.లక్ష అదనంగా చెల్లించాలని మంత్రి మండలిలో ఆమోదం తెలిపినట్టు మంత్రి
పయ్యావుల కేశవ్ వివరించారు. మంత్రిమండలి ఆమోదించిన అంశాల పూర్తి వివరాలు:
ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్లో 385 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అప్గ్రేడ్ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందుకు సమానమైన సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులు రద్దవుతాయి. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జిల్లా న్యాయవ్యవస్థ, రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 నూతన పోస్టుల (1 చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్ట్ మేనేజర్లు, 15 కోర్ట్ మేనేజర్లు) కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతి జోన్-11 పరిధిలోని ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఔట్లలో రోడ్లు, నీటి కాలువలు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ, పవర్ అండ్ ఐసీటీ యుటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్లైన్, ఎస్టీపీ, అవెన్యూ ప్లాంటేషన్ పనులకు రూ.580.00 కోట్ల పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రెండేళ్లలో కాంట్రాక్ట్ పద్ధతిలో టెండర్లు పిలవడానికి అనుమతి ఇచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలో హంద్రి నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ – ఫేజ్-2 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ను సిమెంట్ కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించే పనికి సవరించిన అంచనా పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
హంద్రి నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొత్తం పొదుపుల నుండి అదనపు మొత్తం సమకూరుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్డీవో ఆధ్వర్యంలో చేపడుతున్న డిఫెన్సు పరిశ్రమకు దాదాపు 600 ఎకరాల భూమి కేటాయింపుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, అనకాపల్లి జిల్లాలోని పుడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సవరించిన పరిపాలనా ఆమోదం మొత్తం రూ.1586.69 కోట్లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా మత్స్యకారులకు ఆధునిక ల్యాండింగ్, బెర్తింగ్ సౌకర్యాలు లభించడంతో పాటు చేపల ఉత్పత్తి మెరుగుపడుతుంది. దాదాపు 12,700 మందికి పైగా మత్స్యకారులకు జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి మరియు ఈ హార్బర్లు సుమారు 2,530 ఫిషింగ్ నౌకలకు మద్దతు ఇస్తాయి. వీటిలో అదనంగా పుడిమడక ఫిషింగ్ హార్బర్ను సమీప పారిశ్రామిక క్లస్టర్లకు ఉపయోగపడేలా కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు.
దీనివల్ల తీరప్రాంత లాజిస్టిక్స్ మెరుగుపడటమే కాకుండా ప్రధాన పోర్టులపై ఆధారపడటం, రోడ్ల రద్దీ తగ్గుతాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధి వేగవంతం అవ్వడంతో పాటు, మత్స్యరంగ మౌలిక సదుపాయాల బలోపేతం మరియు సమగ్ర తీరప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుంది. 2024-25లో ఏర్పాటు చేసిన ఏజెన్సీలతో కిసాన్ డ్రోన్లతో కూడిన విలేజ్-లెవల్ ఫార్మ్ మెషినరీ బ్యాంకులను 2025-26కు కూడా అదే నిబంధనలు, సాంకేతిక వివరాలు, 2024-25కు వర్తించే షరతులతో కొనసాగించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2025-26కు నిధులు కేటాయించడానికి అనుమతిస్తూ, “భారత ప్రభుత్వం వద్ద లాప్స్ అయిన నిధులను తిరిగి పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టుటకు” శాఖకు అనుమతి ఇచ్చింది. ఏపీపీసీ/ డిస్కాంలకు ఎంఎస్ ఆరఈసి నుంచి తీసుకున్న ఎంటీఎల్ రుణాలు రూ.7000 కోట్లకు కొన్ని షరతులతో ప్రభుత్వ హామీ పొడిగింపుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మీడియా సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ పాల్గొన్నారు.













