Telugu Desam

శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్... ఈ మూడక్షరాల పదం వింటే ప్రతి తెలుగు హృదయంలో తెలియని భావోద్వేగం ఉప్పొంగుతుంది. మిలీనియం తరానికి కూడా ఎన్టీఆర్ అన్న పేరు విన్నప్పుడల్లా... ఆ పేరుతో ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కారణం... వాళ్ళ ఇళ్లల్లోని సినీ అభిమానం కలిగిన ఒక తరం ఎన్టీఆర్ సినిమాల గురించి పరవశిస్తూ మాట్లాడుతుంది. పురాణం పురుషుల పాత్రల్లో దైవత్వం, సౌజన్యం, రాజసం, పరాక్రమం... వీటన్నిటినీ కనబరచిన ఎన్టీఆర్ తేజోమయ రూపాన్ని వర్ణిస్తూ మాట్లాడుతుంది. రాజకీయ చైతన్యం కలిగిన ఇంకో తరం ఎన్టీఆర్ రాజకీయ సంచలనాల గురించి... తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ పరిరక్షించిన తీరు గురించి మాట్లాడుతుంది. పిల్లలకు స్ఫూర్తి పాఠాలు చెప్పాలనుకున్న మరో తరం
ఎన్టీఆర్ క్రమశిక్షణ, పట్టుదల, శ్రమ, నిజాయితీల గురించి వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పినట్టుగా చెబుతుంది. ఇలా తెలుగునాట ప్రతి ఇంటా నిత్యం ఏదో ఒక రూపేణా వినిపించే పేరు ఎన్టీఆర్. ఇక రాజకీయాల్లో అయితే 90 ఏళ్ళ రాజకీయ కురువృద్ధుల నుండి ముప్పై ఏళ్ళ యువనేత వరకు పలవరించే మాట 'అన్నగారు'. అన్ని తరాలకు ఆయన అన్నగారే.
ఎన్టీఆర్ అని పిలువబడిన శ్రీ నందమూరి తారక రామారావుగారు 1923 మే 28 సోమవారం సాయంత్రం 4.40 నిమిషాలకు తెలుగు నేలపై గుడివాడ దగ్గర ఒక కుగ్రామమైన నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ, శ్రీ లక్ష్మయ్యలకు జన్మించారు.
ఎవరైనా తన జీవితంలో ఏదో ఒక రంగంలో విజయవంతమవుతారు. కానీ మన ఎన్టీఆర్ ముప్పై మూడేళ్ళ సినీ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. ప్రశంసలు అందుకున్నారు. వెండితెర వేలుపుగా పూజలు అందుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా కీర్తించబడ్డారు.
అటు తర్వాత తనను ఆదరించి అభిమానించిన తెలుగు ప్రజలకు సేవ చేసి వారి ఋణం తీర్చుకోడానికి ఆరుపదుల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఈ రంగంలోనూ అనితరసాధ్యమైన విజయాలను అందుకున్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం రగిలించారు. బడుగులకు రాజ్యాధికారం ఇచ్చారు. మహిళలకు హక్కులు పంచారు. పేదలకు సంక్షేమం అందించారు. అందరికీ ఆప్తుడైన "అన్నగారు" అయ్యారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ అనే తెలుగు వెలుగు అస్తమించింది. అప్పటికి ఆయన వయసు 73 ఏళ్ళు మాత్రమే. ఈ వ్యవధిలోనే ఎన్టీఆర్ రెండు సంచలన జీవితాలు జీవించారు. తెలుగు వారు ఉన్నంత కాలం, తెలుగువారి చరిత్ర చెప్పుకున్నంత కాలం తన గురించి చెప్పుకునేలా తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న 'శక పురుషుడు' ఎన్టీఆర్.
ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది 1982 మార్చి 29న అయినప్పటికీ... 'మహానాడు' పేరుతో పార్టీ పండుగ చేసుకునేది మాత్రం ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28న. పార్టీ శ్రేణులకు తమ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పుట్టిన రోజే అసలైన పండుగ. 2023 మే 28 నాటికి ఎన్టీఆర్ అనే కారణజన్ముని అవతరణకు వందేళ్లు నిండుతాయి. అందుకే 2022 మే 28 నుండి ఒక ఏడాది పాటు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ... ఎన్టీఆర్ ఘన చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా... ప్రపంచవ్యాప్త తెలుగువారంతా 'ఎన్టీఆర్ శతజయంతి' ఉత్సవాలు నిర్వహించాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అద్వర్యంలో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఆ ఉత్సవ విశేషాలను... ఎన్టీఆర్ జీవిత విశేషాలను... ఎన్టీఆర్ భావజాలాన్ని.. ఈ పేజీలో చూద్దాం.

1923 మే 28

సోమవారం సాయంత్రం 4.40 నిమిషాలకు తెలుగు నేలపై గుడివాడ దగ్గర ఒక కుగ్రామమైన నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ , శ్రీ లక్ష్మయ్య చౌదరి దంపతులకు ఎన్‌టీఆర్‌ జన్మించారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కాగా మొదటి సంతానం నందమూరి తారక రామారావు, రెండో సంతానం నందమూరి త్రివిక్రమరావు.

1940

విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన ఎన్టీఆర్... విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరారు. కాలేజీలో తెలుగు శాఖాధిపతిగా 'కవి సామ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ పనిచేసేవారు. ఆయన రాసిన 'రాచమల్లుని దౌత్యం' నాటకంలో కథానాయిక పాత్ర పోషించారు ఎన్‌టీఆర్. అదే ఆయన తొలి నటన.. పోషించిన తొలి పాత్ర. ఆ నాటక పోటీల్లో ఎన్‌టీఆర్‌కి ప్రథమ బహుమతి లభించింది.

1942 మే 2

రాత్రి 3.23 నిమిషాలకు... కొమరవోలు గ్రామంలో మేనమామ కాట్రగడ్డ చెంచయ్య కూతురు బసవరామతారకం గారితో ఎన్టీఆర్ వివాహం జరిగింది.

1947

నాటకాల మీద ఇష్టంతో కళాశాల స్నేహితులతో కలిసి 'నేషనల్ ఆర్ట్ థియేటర్' అనే నాటక సంస్థను స్థాపించారు ఎన్‌టీఆర్

1947 మే 21

మదరాసు శోభనాచల స్టూడియో (తర్వాతి కాలంలో వీనస్ స్టూడియో అయ్యింది) ఎన్టీఆర్ కు మేకప్ టెస్ట్ జరిగింది. మేకప్ మెన్ మంగయ్య గారు మేకప్ చేయగా, జైహింద్ సత్యం (మన సత్యం) గారు స్టిల్స్ తీశారు.

1947

ఎన్టీఆర్ బి.ఎ. పట్టభద్రులయ్యారు. అదే సమయంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర సర్వీస్ కమిషన్ వారు సబ్ రిజిస్ట్రార్ పోస్టుల కోసం ప్రకటన ఇచ్చారు. 7,000 మంది దరఖాస్తు చేసుకోగా కమిషన్ ఎంపిక చేసిన 14 మందిలో ఎన్టీఆర్ ఒకరు. గుంటూరులో సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగంలో చేరారు

1949 నవంబర్ 24

దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ సినిమా 'మనదేశం' విడుదలైంది. ఈ సినిమాలో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాత్రతో నటునిగా ఎన్టీఆర్ సినీరంగ ప్రస్థానం మొదలైంది. 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు కలిపి మొత్తం 298 సినిమాలు చేసారు ఎన్టీఆర్. వీటిల్లో 16 తమిళ సినిమాలు, 3 హిందీ సినిమాలు ఉన్నాయి

1950 ఏప్రిల్ 27

ఎన్టీఆర్ కి హీరో గుర్తింపును ఇచ్చిన చిత్రం 'పల్లెటూరి పిల్ల' విడుదల. మరో అగ్ర కథానాయకుడు ఏఎన్నార్ తో కలిసి నటించిన తొలి చిత్రం ఇదే

1951 మార్చి 15

ఎన్టీఆర్ ని అగ్రశ్రేణి కథానాయకునిగా నిలబెట్టి, అశేష అభిమానులను సంపాదించి పెట్టిన చిత్రం 'పాతాళభైరవి' విడుదల. ద్విశత దినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే

1952

రాయలసీమలో కరువు సంభవిస్తే... తోటి నటీనటులతో నెల రోజుల పాటు పలుచోట్ల ప్రదర్శనలిచ్చి, వీదుల్లో జోలెపట్టి లక్షా 50 వేల రూపాయలు (ద్రవ్యోల్బణం ప్రకారం లెక్కేస్తే 2022 నాటి విలువ ప్రకారం సుమారు రూ.1 కోటి 33 లక్షల 10వేలు... కొనుగోలు సామర్థ్యాన్ని జోడిస్తే రూ.4 కోట్ల 24 లక్షల 50వేలు ) సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా సహాయ కార్యక్రమాలకు అందజేశారు.

1953 జూలై 17

ఎన్టీఆర్ నిర్మాతగా మారి సొంత నిర్మాణ సంస్థ NAT (నేషనల్ ఆర్ట్ థియేటర్) ద్వారా నిర్మించిన 'పిచ్చి పుల్లయ్య' విడుదలైంది

1954 ఏప్రిల్ 15

ఎన్టీఆర్ కు మొదటి జాతీయ అవార్డు (రాష్ట్రపతి ప్రశంసా పత్రం) తెచ్చిపెట్టిన 'తోడు దొంగలు' చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి నిర్మాత ఎన్టీఆరే

1954 అక్టోబర్ 6

ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణ పాత్రలో (అంతర్నాటకం) కనిపించిన 'ఇద్దరు పెళ్ళాలు' సినిమా విడుదల

1956 డిసెంబర్ 20

ఎన్టీఆర్ తొలిసారిగా రాముని వేషధారణలో కనిపించిన సాంఘిక చిత్రం 'చరణదాసి' విడుదల. 1958లో విడుదలైన 'సంపూర్ణ రామాయణం' చిత్రంలో ఎన్టీఆర్ రాముడిగా నటించారు. రాముడుగా ఎన్టీఆర్ నటించిన తొలి పూర్తి నిడివి చిత్రం ఇదే

1957 మార్చి 27

ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఆబాలగోపాలాన్ని సమ్మోహన పరచిన అద్భుత చిత్రం 'మాయాబజార్' విడుదల. ఎన్టీఆర్ ను కథానాయకుడి స్థాయి నుంచి వెండితెర వేలుపుగా మార్చిన చిత్రం ఇది. ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఉన్న క్యాలెండర్ లను ముద్రించగా ఆ రోజుల్లో 5 లక్షల కాపీలు అమ్ముడు పోవడం ఒక రికార్డు. అది మొదలు తన నటనా జీవితంలో 18 చిత్రాల్లో కృష్ణునిగా నటించారు ఎన్టీఆర్. సాంఘిక చిత్రాల్లో వ‌చ్చే అంత‌ర్నాట‌కాల‌తో క‌లిపితే 33 సార్లు కృష్ణునిగా క‌నిపించారు

1960 జనవరి 9

ఎన్టీఆర్ తొలిసారిగా శ్రీనివాసుని పాత్రలో నటించిన 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం' చిత్రం విడుదల. అఖండ విజయం సాధించిన ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ ను సాక్షాత్తు శ్రీనివాసుడిగా భావించారు ప్రేక్షకులు. అప్పట్లో భక్తులు కానుకలు సమర్పించుకోడానికి థియేటర్ల వద్ద ప్రత్యేకంగా హుండీలను పెట్టాల్సి వచ్చింది. తిరుపతికి వెళ్లిన భక్తులు అట్నుంచి అటే మదరాసులో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన దర్శనం కోరడం ఆనవాయితీగా మారింది.

1961 జనవరి 6

ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం 'సీతారామ కళ్యాణం' విడుదల. ఎన్టీఆర్ నటనకు ముగ్ధులైన కంచి పీఠాదిపతి చంద్రశేఖర స్వామి వారు ఆయనను సహపంక్తి భోజనానికి ఆహ్వానించారు

1962 మే 10

ఎన్టీఆర్ తొలిసారిగా శివుని వేషం కట్టిన 'దక్షయజ్ఞం' విడుదల

1962

పుత్ర శోకం తీరకుండానే భారత-చైనా యుద్ధ సమయంలో జాతీయ రక్షణ నిధికి రూ.10 లక్షల విరాళాల సేకరించి నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారికి అందజేశారు ఎన్టీఆర్

1963 మార్చి 29

ఉగాది కానుకగా తొలి తెలుగు రంగుల చిత్రం 'లవకుశ' విడుదల. నందమూరి తారక రాముని అవతార పురుషునిగా, వెండితెర వేలుపుగా ప్రతి తెలుగు హృదయంలో నిలిపిన చిత్రం ఇది. అంతేకాదు రాబట్టిన వసూళ్లను పత్రికల్లో ప్రకటించిన తొలి తెలుగు చిత్రం కూడా ఇదే

1963 అక్టోబర్ 11

ఎన్టీఆర్ వైవిధ్య నటనకు నిదర్శనంగా 'నర్తనశాల' చిత్రం విడుదల. ఈ చిత్రంలో బృహన్నల పాత్ర కోసం నలభై ఏళ్ళ వయసులో వెంపటి చినసత్యం గారి దగ్గర మూడు నెలలపాటు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న ఎన్టీఆర్

1964 మే 21

ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన 'రాముడు భీముడు' విడుదల

1964

హైదరాబాద్ నిజాం కళాశాల ఆవరణలో నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ కు 'నటరత్న' బిరుదు ప్రదానం

1964 జూన్ 24

విజయవాడ కృష్ణలంక అగ్నిప్రమాద బాధితుల సహాయార్థం 'ఎన్టీఆర్ దాతృత్వ సంస్థ' ద్వారా లక్ష రూపాయల విరాళం సేకరించి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి అందచేశారు ఎన్టీఆర్

1964

నర్తనశాల, లవకుశ, కర్ణ చిత్రాలకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా జాతీయ అవార్డులు

1965

పలు ప్రదర్శనలు ఇచ్చి "పోలీసు కానిస్టేబుళ్ల రక్షణ నిధి"కి 3 లక్షల రూపాయల విరాళం అందజేత

1965 డిసెంబర్ 16

భారత-పాకిస్థాన్ యుద్ధ సమయంలో జాతీయ రక్షణ నిధికి భారీ విరాళాలు సేకరించి నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో అందజేత

1968 ఏప్రిల్ 16

నందమూరి కీర్తి కిరీటానికి మరో కలికితురాయి. భారత ప్రభుత్వంచే 'పద్మశ్రీ' అవార్దు ప్రదానం

1969

కోస్తాలో భీకర తుఫాను బాధితుల కోసం రూ.5 లక్షల విరాళాల సేకరణ

1969

సామాజిక దురాచార నిర్మూలన ముఖ్యోద్దేశంగా ఎన్టీఆర్ నిర్మించి, దర్శకత్వం వహించిన 'వరకట్నం' చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వంచే 'ఉత్తమ దర్శకుడు' అవార్డు అందుకున్న ఎన్టీఆర్

1972 నవంబర్ 30

ఎన్టీఆర్ కు 'ఉత్తమ తెలుగు నటుడు' ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టిన 'బడిపంతులు' చిత్రం విడుదల

1973 ఫిబ్రవరి 2

భారతదేశంలో 1972లో ఏర్పడిన కరవు సహాయ నిధి కోసం నాటక ప్రదర్శనల ద్వారా సేకరించిన రూ.7 లక్షలకు పైగా నిధులను నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారికి అందజేసారు ఎన్టీఆర్

1975

నవరసాలను అద్భుతంగా పోషించగల అసమాన నటుడవు నీవంటూ... ఎన్టీఆర్ కు 'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ' బిరుదును ఇచ్చి ఆశీర్వదించిన శ్రీశైల జగద్గురు పీఠాదిపతులు వాగీశ పండితారాధ్య శివాచార్యులు

1977 జనవరి 14

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ... స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందించిన అజరామర చిత్రం 'దానవీరశూరకర్ణ' విడుదల

1977 ఏప్రిల్ 28

తెలుగు చలన చిత్రసీమలో కలెక్షన్ల రికార్డులను తిరగరాసి, సరికొత్త చరిత్ర సృష్టించిన 'అడవిరాముడు' చిత్రం విడుదల

1977 నవంబర్ 19

దివిసీమ ఉప్పెన తెలుగునేలపై కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ ను తీవ్రంగా కదిలించి, పేదల కోసం ఏదైనా చేయాలని తపించేలా చేసిన ప్రకృతి ప్రకోపం అది. తోటి కళాకారులతో కలిసి జోలె పట్టి రూ.15 లక్షల నిధులను రామకృష్ణ మిషన్ ద్వారా బాధితులకు అందచేశారు ఎన్టీఆర్

1978

విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రదానం చేసే ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్... 'కళాప్రపూర్ణ' బిరుదును అందుకున్నారు ఎన్టీఆర్

1980 అక్టోబర్ 30

తనను ఎంతగానో అభిమానించి, ఆరాధించే తెలుగువారి రుణం ఎలా తీర్చుకోవాలి అన్న ఎన్టీఆర్ ఆలోచనకు ప్రేరణ ఇచ్చిన చిత్రం 'సర్దార్ పాపారాయుడు' విడుదల.
ఇకపై నెలకు 15 రోజులు తెలుగుప్రజల సేవకు కేటాయిస్తానని ఎన్టీఆర్ విలేఖరుల సమావేశం పెట్టి ఊటీలో వెల్లడించారు.

1982 మార్చి 21 (సా 6.15 ని.లకు)

రామకృష్ణ స్టూడియోలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించారు ఎన్టీఆర్

1982 మార్చి 29 (మధ్యాహ్నం గం.2.30 ని.లకు)

హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 'తెలుగుదేశం' పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్

1982 ఏప్రిల్ 10,11 తేదీలు

హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ మొదటి బహిరంగ సభలు

1982 మే 27, 28 తేదీలు

తిరుపతిలోని త్యాగరాయ మండపంలో యావద్భారతావని దృష్టిని ఆకర్షించిన మహానాడు తరహా సభలు

1982 జూన్ 14

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ప్రజలను చైతన్య పరచడానికి ఎన్టీఆర్ మొదటి ప్రచార యాత్ర ప్రారంభమైంది
పాత చెవ్రొలెట్ వ్యానును రిపేరు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించి 'చైతన్య రథం' అని నామకరణం చేసారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ చైతన్య రథానికి నందమూరి హరికృష్ణే సారథి. ఎన్టీఆర్ ఓ శ్రామికుడిలా ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ తన ఉపన్యాసాలతో ప్రజల హృదయాలను దోచుకుంటే... ఆ వాహనాన్ని కొడుకు హరికృష్ణ నడుపుతూ తండ్రి ఆశయాలకు చేదోడుగా నిలిచాడు
రాత్రి లేదు పగలు లేదు. నటుడిగా తాను సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, వైభవం అన్నిటినీ మరిచి... సామాన్యుడి కోసం నడిరోడ్డుపై నిలిచాడు రామన్న. ఆ రోడ్డే ఆయనకు ఇల్లయ్యింది. తల్లి అయ్యింది. చెట్టు నీడే పడకగది అయ్యింది. "తెలుగుదేశం పిలుస్తోంది రా! కదలిరా!!" అన్న ఎన్టీఆర్ పిలుపు ప్రతి తెలుగు హృదయాన్ని తట్టి లేపింది

1982 అక్టోబర్ 3

ఎన్టీఆర్ రెండవ ప్రచార యాత్ర ప్రారంభం. నవంబర్ 26, 1982 వరకూ 55 రోజుల పాటు సాగిన ఈ 25 వేల కిలోమీటర్ల ప్రచార యాత్ర నభూతో- నభవిష్యతి.
"చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా" అంటూ చైతన్య రథం కదిలి వస్తుంటే జనం పులకరించి పూనకమెత్తారు. సాగర తరంగాలై పోటెత్తారు

1982 డిసెంబర్ 21

రాత్రి - "ప్రపంచంలో ఇంతవరకూ ఎవ్వరూ ఇంత తక్కువ సమయంలో ఇన్ని చోట్ల, ఇన్ని లక్షల ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించ లేదు" అంటూ ఎన్టీఆర్ గురించి BBC తన వార్తాప్రసారంలో గొప్పగా చెప్పింది. తెలుగు జాతి గురించి ప్రపంచానికి గొప్పగా వినిపించిన రోజది

1983 జనవరి 5

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం

1983 జనవరి 9

ప్రజాస్వామ్య చరిత్రలోనే ప్రప్రథమంగా... తనను ఎన్నుకున్న ప్రజల మధ్య ప్రజానేత ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా బహిరంగ ప్రమాణ స్వీకారం
తెలుగునాట రామరాజ్య పాలన ప్రారంభం

1983 ఏప్రిల్ 14

ఉగాది నాడు తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో కాషాయ వస్త్రధారణతో రాజయోగిగా మారిన ఎన్టీఆర్

1983 ఏప్రిల్ 14

తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపన

1983 ఏప్రిల్ 14

దేశంలోనే మొదటిసారిగా కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రారంభం

1983 ఏప్రిల్ 27

ప్రతిష్టాత్మక తెలుగుగంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన

1984 మార్చి 23

దేశ ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి విజయవాడలో దూరదర్శన్ కేంద్రానికి ప్రారంభోత్సవం

1984 ఆగస్టు 16

ఎన్టీఆర్ ను తప్పించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్.

1984 ఆగస్టు

'ప్రజాస్వామ్య పరిరక్షణ' పేరిట ఎన్టీఆర్ ప్రజాయాత్ర. ప్రజాస్వామ్యంలో జరిగిన అతిగొప్ప ప్రజావిప్లవంగా రూపొందింది.

1984 సెప్టెంబర్ 15

ముఖ్యమంత్రిగా మరోసారి పదవిని చేపట్టిన ఎన్టీఆర్

1984 సెప్టెంబర్ 19

ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో మొదటి అవిశ్వాస తీర్మాన బలపరీక్షలో 161 సభ్యుల మద్దతుతో ఎన్టీఆర్ విజయం

1984 నవంబర్

60 ఏళ్ళు పైబడిన భూమిలేని రైతులకు, రైతు కూలీలకు 'తెలుగు వ్యవసాయ కార్మిక సాదర సంక్షేమం' పథకం పేరిట... దేశంలో మొదటిసారిగా నెలకు రూ.35 పింఛను.

1984 నవంబర్ 23

ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు

1984 డిసెంబర్ 27

ప్రధాని ఇందిరా గాంధీ హత్యతో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు. దేశమంతా సానుభూతి పవనాలు వీచినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగింది. తెలుగుదేశం పార్టీకి 30 పార్లమెంటు స్థానాలు దక్కాయి. భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం స్థాయిని దక్కించుకుని ఈ ఘనతను సాధించిన మొదటి ప్రాంతీయ పార్టీగా రికార్డు సృష్టించింది తెలుగుదేశం.

1984

రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా కరణం, మునసబు, పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి, మండల వ్యవస్థ ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణకు బాటలు వేశారు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల రాజకీయ బానిస సంకెళ్లను తెంపి, వారి చేతికి అధికార కరవాలం అందించిన సమసమాజవాది ఎన్టీఆర్

1985 మార్చి 5

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం

1985 మార్చి 9

ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన ఎన్టీఆర్

1985 ఏప్రిల్ 6

తిరుపతి తిరుమల దేవస్థానం వారిచే నిత్యాన్నదాన మహత్కార్యానికి శ్రీకారం

1985

శాసనమండలి రద్దు

1985 సెప్టెంబర్‌ 9

దేశంలో మొదటిసారిగా తండ్రి ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం

1985 అక్టోబర్

హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసేందుకు బుద్ధ విగ్రహ పనులు ప్రారంభం

1985

డిసెంబర్‌ స్థానికేతరులను వారివారి ప్రాంతాలకు పంపడానికి 610 జీఓ జారీ

1985 డిసెంబర్ 2

హైదరాబాద్‌లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు

1987

హర్యానా ఎన్నికల్లో దేవీలాల్ కు మద్దతుగా ప్రచారం. ఆ ఎన్నికల్లో భారీ విజయం సాధించి హర్యానా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన దేవీలాల్

1988 సెప్టెంబర్ 17

మద్రాసు మెరీనా బీచ్ లో నేషనల్ ఫ్రంట్ మొదటి సమావేశం... చైర్మన్ గా ఎన్టీఆర్ ను ఎన్నుకున్న నాయకులు

1988 అక్టోబర్ 3

ముంబైలో ఫ్రంట్ నేతల భారీ సభ. హర్యానా తలపాగా చుట్టుకుని ప్రసంగించిన ఎన్టీఆర్

1989 జూన్ 18

'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్ర నిర్మాణం ప్రారంభం. ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నటన ప్రారంభించిన ఎన్టీఆర్

1994 డిసెంబర్ 12

ఎన్‌టీఆర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు

1996 జనవరి 18

నందమూరి తారక రాముని అస్తమయం

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist