- భగీరథ ప్రయత్నంతో 30 ఏళ్ల కల సాకారం..
- వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన ముఖ్యమంత్రి
- నల్లమల కొండల్ని చీల్చుకుని నల్లమల సాగరు కృష్ణమ్మ పరుగు
- తొలిదశతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు.. 4 లక్షలమందికి తాగునీరు
- జలహారతి అనంతరం కృష్ణా జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం
- దోర్నాల బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం
మార్కాపురం (చైతన్య రథం): మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చి స్వాగతించారు. అనంతరం ప్రాజెక్టు తొలిదశ ప్రారంభోత్సవానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కరవునేలను తాకిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీశైలం జలాశయంలోని కొల్లంవాగు నుంచి గ్రావిటీ ద్వారా తరలించిన కృష్ణా జలాలు వెలిగొండ జంట సొరంగాల మీదుగా గంటవానిపల్లె ఆక్విడెక్టుకు చేరుకుని నల్లమల సాగర్ వైపు పరుగులు తీశాయి. నల్లమల కొండలను చీల్చుకుని కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మకు స్థానిక మహిళలు, ప్రజలు పుష్పాలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పవిత్ర జలాలను సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులపై స్వయంగా చల్లారు. అక్విడెక్టు వద్ద రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్విచ్ నొక్కి జలాలను దిగువకు వదిలారు.
30 ఏళ్ల క్రితం భూమిపూజ.. నేడు ప్రారంభం
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తన జీవితంలో భావోద్వేగ సందర్భమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా తానే ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత 2026 ఆగస్టు
31న ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభిస్తున్నానని చెప్పారు. సీఎం మాట్లాడుతూ.. “ఆ రోజు చేసిన సంకల్పం.. ఈరోజు నల్లమల సాగర్ జలసిరిగా మారింది. ఇది భగీరథ ప్రయత్నం. కొండలు అడ్డు వచ్చినా తొలిచి ముందుకు వెళ్లాం. కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చాం. శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయలుదేరిన కృష్ణమ్మ.. మార్కాపురం చెన్న
కేశవుడు కొలువైన నేలకు జలహారతి ఇస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించుకుని జల సిరులతో ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడిగాం. వెలిగొండ బంగారు కొండ అవుతుంది. ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. మాట ఇచ్చాం.. ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణమ్మను తరలించాం. ఇక సంపద సృష్టిస్తాం. మార్కాపురం గడ్డకు, కరువుతో పోరాడిన రైతన్నలకు, ఫ్లోరైడ్ బాధలు భరించిన కుటుంబాలకు, నీటి కోసం ఎదురు చూసి అలసిపోయిన తరాలకు కృష్ణా జలాలతో కొత్త ఊపిరి ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి భావోద్వేగంతో ప్రకటించారు.
నిర్వాసితుల త్యాగాలకు పాదాభివందనం
వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని సీఎం ప్రకటించారు. రైతుల త్యాగం లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. “ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందేవారు ఎంత సంతోషంగా ఉంటారో.. నిర్వాసితులు కూడా అంతే సంతోషంగా ఉండాలి. కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్వాసితుల బాధలు, అవసరాలను గుర్తించి అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లిస్తున్నాం. కటాఫ్ తేదీని పెంచి 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందించాం. రూ.10,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.7,983 కోట్లు ఖర్చు చేసి మొదటి దశను పూర్తి చేశాం. 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి అయ్యాయి. తొలిదశలో భాగంగా నల్లమల సాగర్కు 10.70 టీఎంసీ నీటిని తరలిస్తాం. 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు
అందుతుంది. వెలిగొండ పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలు, కడప జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తీగలేరు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపడియ కాలువ కింద 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాల్వ కింద 3.70 లక్షల ఎకరాల ఆయకట్టు సుస్థిరం అవుతుంది. కృష్ణమ్మ రాకతో పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ అనే పదం గత చరిత్రగా మిగిలిపోతుంది. వెలిగొండ అంటే ఫ్లోరైడ్ కష్టాలకు ముగింపు. కరువు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్సాహంగా ప్రకటించారు.












