- ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం
- తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- యువత భవిష్యత్తుపై కుట్రలు, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలి
- కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నవశకంలోకి అడుగుపెట్టి, అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కడప శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు తీస్తున్నాయి, రాజధాని అమరావతి నిర్మాణం వేగవంతమయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్గా రూపుదిద్దుకుంటోంది. భారీ ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే, యువతకు భవిష్యత్తు దక్కుతుంటే చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దాకా వెళ్లి రాష్ట్రాన్ని భయపెట్టే యత్నాలు చేసినా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పనితీరుపై నమ్మకంతో ముందుకు వస్తున్నారు. అమరావతిని, పోలవరాన్ని, పెట్టుబడులను గానీ ఆపే సత్తా వైకాపాకు లేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు.
రాజకీయ ఉనికిపై భయంతోనే..
భవిష్యత్తులో తమకు రాజకీయ ఉనికి ఉండదన్న భయంతో డీఎస్సీ పరీక్షల మీద వైకాపా అసత్య ఆరోపణలు చేస్తోంది. 1995కు ముందు ఇంటర్వ్యూల పేరుతో అవకతవకలు జరిగే పద్ధతిని రద్దు చేసి, ప్రతిభ ఆధారంగా నియామకాలు జరగాలని 1998లో పారదర్శకమైన పరీక్షా విధానాన్ని తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన 10 డీఎస్సీలలో 7 డీఎస్సీలను తెలుగుదేశం ప్రభుత్వమే విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న సుమారు 1.80 లక్షల మంది ఉపాధ్యాయుల్లో దాదాపు 70 శాతం మంది టీడీపీ హయాంలోనే మెరిట్ ఆధారంగా ఎంపికైనవారే. గతంలోలాగే మెగా డీఎస్సీ 2025ని కూడా ఎంతో పారదర్శకంగా, నిక్కచ్చిగా నిర్వహించాం.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని బయటి ప్రపంచానికి చిత్రీకరించేందుకు వైకాపా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. గంజాయి బ్యాచ్లను, రోడ్డు ప్రమాదాల్లో పేదల ప్రాణాలు తీసే నేరగాళ్లను పరామర్శిస్తూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ‘పేటీఎం బ్యాచ’లను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రిపై, మంత్రి నారా లోకేష్పై సొంత మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేయిస్తున్నారు. ప్రజలను ఎల్లకాలం మభ్యపెట్టలేరని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అబద్ధాలతో అడ్డుకోలేరని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ప్రజలే వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
హాయ్ల్యాండ్ పాపాలు దాచలేకే ఈ డైవర్షన్ డ్రామాలు
ఐదేళ్ల తమ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా తీయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈరోజు పారదర్శకంగా పూర్తయిన మెగా డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాధవిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల్లో చేసిన ఘోరమైన అక్రమాలు సీఐడీ విచారణలో బయటపడుతుండటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే డీఎస్సీపై నిరాధారమైన వైసీపీ రాద్ధాంతం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఐదేళ్లలో వైసీపీ ఒక్క పరీక్ష పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిని కించపరుస్తూ స్కూళ్లలో బాత్రూమ్ల ఫోటోలు తీయించారు, మద్యం షాపుల ముందు క్యూలైన్లలో నిలబెట్టి మరీ డ్యూటీలు వేయించిన ఘనత వైసీపీదే.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారు. కేవలం 148 రోజుల్లోనే నోటిఫికేషన్ నుంచి పరీక్షలు, కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, రిజర్వేషన్లు, స్పోర్ట్స్-మిలిటరీ కోటాల అమలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు అన్నీ పూర్తి చేసి 16 వేల మందికి పైగా నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. తద్వారా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో సాగిన భారీ కుంభకోణంపై సీఐడీ విచారణ జరుగుతోంది. హైదరాబాద్లోని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఆన్సర్ షీట్లు ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, కోర్టు మొట్టికాయలు వేసినా హాయ్ల్యాండ్ రిసార్ట్లో సరైన సెక్యూరిటీ లేకుండా దాదాపు 60 రోజులు ఉంచారు. ఇళ్లలోని డ్రైవర్లు, అటెండర్లతో పేపర్లు దిద్దించి 160 మందికి పైగా గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేసిన పాపం వైసీపీది. ఈ దారుణాలు బయటపడుతుండటంతోనే ఇప్పుడు డీఎస్సీపై తప్పుడు కూతలు కూస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నియామకాలు ఆపడానికి వైసీపీ దాదాపు 300 కేసులు వేయగా, కోర్టులు మొట్టికాయలు వేశాయి.
చివరికి ఆ పార్టీ ఎమ్మెల్సీకే న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది. మొదట పేపర్ లీక్ అన్నారని, తర్వాత అధికారులు కుమ్మక్కయ్యారని, ఇప్పుడు స్పోర్ట్స్ కోటా అంటూ ఒక్కోసారి ఒక్కో మాట మారుస్తూ వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. మీడియా ముందుకు తీసుకొచ్చి వీడియోలు పెట్టిస్తున్న వ్యక్తులంతా బోగస్ అభ్యర్థులని తేలిపోతోంది. ఎంతో కష్టపడి మెరిట్ సాధించి ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా బతుకుతున్న టీచర్లపై వైసీపీ నాయకులు, వారి అనుకూల మీడియా విచక్షణారహితంగా వేధింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకరి వ్యక్తిగత వివరాలను ప్రశ్నించడానికి, వారిపై దాడి చేయడానికి వీరికి ఏ అధికారముంది? ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షణలో, గ్రీవెన్స్ సెల్ ద్వారా ప్రతి అభ్యంతరం పరిష్కరించి నూటికి నూరు శాతం పారదర్శకంగా పూర్తి చేసిన డీఎస్సీపై ప్రజల్లో తప్పుడు అపోహలు సృష్టించాలని చూస్తే ఉపేక్షించేది లేదని, వైసీపీ చేస్తున్న ఈ తప్పుడు డ్రామాలను ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని మాధవిరెడ్డి హెచ్చరించారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
మెగా డీఎస్సీపై లేనిపోని అపోహలు సృష్టిస్తూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వైసీపీ తీవ్రస్థాయిలో దిగజారి ప్రవర్తిస్తోందని మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా బోగస్ వ్యక్తులతో వీడియోలు సృష్టించి ప్రభుత్వాన్ని, వ్యవస్థలను అస్థిరపరచాలని చూస్తున్న వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పోటీ పరీక్షలు రాయాలనుకుంటున్న యువతను మానసికంగా కుంగదీయడమే లక్ష్యంగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోంది. రేపు 2029 ఎన్నికల్లో ఒకవేళ వైకాపా వస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోనని డీఎస్సీ రాసిన అభ్యర్థులు, యావత్ ప్రజానీకం ఇప్పటికే స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి విధ్వంసకర ఆలోచనలు ఉన్న పార్టీ రాష్ట్రానికి అవసరమా అని ప్రజలే రేపటి ఎన్నికల్లో నిలదీయడం ఖాయం.
ఎవరెవరికో డబ్బులు ఇచ్చి కెమెరాల ముందుకు తీసుకువచ్చి అసత్యాలు మాట్లాడే సంస్కృతికి వైసీపీ తెరతీసింది. అసలు ఉద్యోగం రాని వ్యక్తికి జాబ్ వచ్చిందని, ఎవరో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మార్కులు వేశారని, ఎవరో తనను సంప్రదించారని ఏ సంబంధం లేని కథలను ప్రచారం చేస్తున్నారు. రాధిక అనే అమ్మాయి ఒకరి పేరు ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ కోటాలో అక్రమంగా ఉద్యోగం వచ్చిందని ఎలాంటి నిబద్ధత, ప్రాథమిక ఆధారాలు లేకుండా వీడియోలు వదలడం ఎంతవరకు సమంజసం? నిజానిజాలు సరిచూసుకోకుండా, కనీస ఆధారాలు లేని ఇలాంటి కల్పిత కథనాలను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలకు, వాటి వెనుక ఉండి నడిపిస్తున్న వైసీపీ నాయకులకు అసలు ఇంగితజ్ఞానం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. ఆడ, మగ అనే తేడా లేకుండా నిరాధార ఆరోపణలతో వ్యవస్థలను అస్థిరపరుస్తున్న వ్యక్తులపై తక్షణమే కేసులు నమోదు చేయాలి. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, పారదర్శకంగా జరిగిన నియామక ప్రక్రియపై విషం చిమ్ముతున్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టే వరకు కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయదని మాధవిరెడ్డి స్పష్టం చేశారు.
అబద్ధాలు బట్టబయలు
మెగా డీఎస్సీపై పనిగట్టుకుని చేస్తున్న గోబెల్స్ ప్రచారం బట్టబయలవుతోందని, అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన అది నిజం అయిపోదని మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో వేముల రామకృష్ణ అనే వ్యక్తి ఇంగ్లీష్ టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడని, ఫేక్ ఐడీలతో అక్రమంగా మార్కులు వేయించుకుని జాబ్ కొట్టాడని ఒక అమ్మాయి స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడిన వీడియోలను సదరు మీడియా సంస్థ ప్రసారం చేసింది. తీరా చూస్తే స్వయంగా ఆ వ్యక్తే మీడియా ముందుకు వచ్చి “నేనే వేముల రామకృష్ణని, నేను అసలు డీఎస్సీలోనే సెలెక్ట్ కాలేదు, నేను టీచర్ ఉద్యోగమే చేయట్లేదు” అని స్పష్టం చేశారు. అసలు ఉద్యోగమే రాని వ్యక్తి పేరును తెరపైకి తెచ్చి ఇంతటి దారుణమైన అబద్ధాలను ప్రచారం చేస్తారా? గత ఐదేళ్ల వైకాపా పాలనలో “జగన్ మామయ్య లేకపోతే బతకలేం, చచ్చిపోతాం” అంటూ కెమెరాల ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ డ్రామాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు.
ఇప్పుడు అధికారం పోయేసరికి అదే పేటీఎం బ్యాచ్తో డబ్బులు ఇచ్చి కుట్రపూరితంగా వీడియోలు చేయిస్తూ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. ఈ అసత్యాలను ప్రసారం చేస్తున్న టీవీ ఛానెల్ను ఆ పార్టీకి చెందిన సలహాదారులే భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో, పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్నాయి. బాధిత వ్యక్తే స్వయంగా తనకు ఉద్యోగం రాలేదని మొరపెట్టుకుంటున్నా, ఇంకా ఫేక్ న్యూస్ను ప్రసారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న మీడియా తీరు అత్యంత గర్హనీయం. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు సాగిస్తున్న ఈ దుష్ప్రచారాలను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తున్నారని, తప్పుడు వీడియోల వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టే వరకు ఉపేక్షించేది లేదని మాధవిరెడ్డి హెచ్చరించారు.
ఓర్వలేకపోతున్న వైసీపీ
మెగా డీఎస్సీలో ప్రతిభతో ఎంపికై విధుల్లో చేరిన పేద, మధ్యతరగతి వర్గాల అభ్యర్థులపై బురదజల్లుతూ ఫేక్ వీడియోలతో కుట్రలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై మాధవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్లో ప్రభుత్వం మరోమారు ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించాలన్న పట్టుదలతో చదువుకుంటున్న నిరుద్యోగ యువత మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఇలాంటి ఫేక్ వీడియోలు మళ్లీ ప్రసారం చేయడానికి భయపడేలా చట్టాలు, శిక్షలు ఉండాలి. ఉద్యోగాలు సాధించిన వారికి అసలు టెట్ అర్హతే లేదని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఉదాహరణకు కళ్యాణి అనే అభ్యర్థి 2018లోనే టెట్ క్వాలిఫైయింగ్ మార్కులు 75 సాధించారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల వైసీపీ పాలనలో డీఎస్సీ వేయకపోవడంతో కూలి పనులు చేసుకునేవారు, ఆటో కార్మికుల కుటుంబాలు తినితినక పిల్లల కోచింగ్ల కోసం అప్పులు చేసి ఎదురుచూశాయి.
కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకంతో 148 రోజుల్లో 16 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసి ఆ కుటుంబాల్లో ఆనందం నింపితే, ఆ ఆనందాన్ని ఓర్వలేక వైకాపా విషం చిమ్ముతోంది. ఒకే కేటగిరీ కింద లేదా స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన టీచర్లు ఒకే పాఠశాలలో పనిచేయకూడదనే నిబంధన ఎక్కడా లేదు. కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన కర్ణాటక సరిహద్దు మండలాలైన కౌతాళం, హాలహర్వి, హోళగుంద, కోసిగి ప్రాంతాల్లో తీవ్ర ఉపాధ్యాయ కొరత ఉంది. అందుకే అక్కడ స్కూళ్లలో విద్యార్థుల చదువు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రాధాన్యతనిచ్చి, స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఎస్జీటీలను ఆ వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించడం జరిగింది. వెనుకబడిన రాయలసీమ, కర్నూలు, కడప ప్రాంతాల పిల్లలు ఉద్యోగాలు సాధించి నిలదొక్కుకోవడం వైసీపీకి ఇష్టం లేదా? వీరంతా ఎప్పటికీ పేదరికంలోనే ఉంటూ కేవలం బటన్లు నొక్కితే వచ్చే దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి బతకాలా?
గతంలో 2006 డీఎస్సీ పరీక్షల సమయంలో కడప జిల్లాలో పేపర్లు ట్యాంపరింగ్ చేసి అవకతవకలకు పాల్పడటంతో ఫలితాలు రెండేళ్లు ఆలస్యమై, కోర్టు కేసులు, క్రిమినల్ కేసులతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం కేవలం 148 రోజుల్లోనే ఏ కోర్టు వివాదాలు లేకుండా, బడుగు, బలహీన వర్గాలకు, వెనుకబడిన ప్రాంతాల వారికి న్యాయం చేస్తూ పారదర్శకంగా నియామకాలు పూర్తి చేసింది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ, వెనుకబడిన జిల్లాల యువత ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్న వైకాపా కుట్రలను ప్రజలంతా స్పష్టంగా గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించాలని చూస్తే చట్టం ఊరుకోదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి హెచ్చరించారు.













