యువతతో మాట్లాడటానికి ఒకప్పుడు సభలు, సమావేశాలు, ఉద్యోగ మేళాలు వేదికలైతే.. ఇప్పుడు ఆ స్థానాన్ని సోషల్ మీడియా ఆక్రమించింది. చేతిలోని స్మార్ట్ఫోన్లోనే సమాచారం, అవకాశాలు, కెరీర్ మార్గాలు, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పును గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. యువతతో కమ్యూనికేషన్ ను కూడా కొత్త తరానికి అనుగుణంగా మార్చే దిశగా అడుగులేస్తోంది. మంత్రులు జెన్ జెడ్తో సోషల్ మీడియా ద్వారా మరింతగా అనుసంధానం కావాలని సీఎం చంద్రబాబు సూచించడం ఇందులో భాగమే. యువత రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని, సమకాలీన అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉందని పేర్కొన్న సీఎం.. ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలు, అభివృద్ధి పనులను వారికి సమర్థంగా చేరవేయాలని సూచించారు. జెన్ జెడ్ కోరుకునే అవకాశాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది ముందుకు తెస్తోంది.
యువతకు ప్రభుత్వం ఎంత దగ్గరగా ఉందన్నదానికంటే.. వారి భవిష్యత్తుకు ఎన్ని తలుపులు తెరుస్తుందన్నదే అసలు కొలమానం. ఉద్యోగం, నైపుణ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్లు, పరిశ్రమలు, స్వయం ఉపాధి.. ఇలా యువత జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి రంగంలో అవకాశాలను పెంచగలిగితేనే ఈ కనెక్ట్ అర్థవంతంగా మారుతుంది. ‘యూత్ అవుట్డోచ్’ మాత్రమే కాదు.. ‘యూత్ ఆపర్చునిటీ ఎకానమీ’ మరింత అవసరమని గ్రహించిన విజనరీ లీడర్ చంద్రబాబు -కూటమి పాలన ఆరంభంనుంచీ అందుకు అనుగుణంగా అడుగులేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకోవడం.. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం.. పరీక్షలు, ఫలితాలు, నియామకాల చుట్టూ తిరగడం.. ఇది తెలుగు రాష్ట్రాల యువతలో అనాదిగా కనిపిస్తున్న దృశ్యం. ప్రభుత్వ ఉద్యోగాలకు ఉండే భద్రత, సామాజిక గౌరవం దృష్ట్యా ఆ ఆకాంక్ష సహజమే. అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రతి యువకుడికీ ప్రభుత్వోద్యోగం సాధ్యం కాదు కనుకే.. ప్రైవేట్ సెక్టార్, పరిశ్రమలు, స్టార్టర్లు, ఫ్రీలాన్స్, స్వయం ఉపాధి వంటి అనేక మార్గాలకు తలుపులు తెరుస్తోంది కూటమి ప్రభుత్వం.
ఈ దిశలో 2026 ఉద్యోగ క్యాలెండర్ ఒక ముఖ్యమైన అడుగునే చెప్పాలి. మొత్తం 10,060 ప్రత్యక్ష ప్రభుత్వోద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించగా, దశలవారీగా నియామక ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 15న రెండోదశలో 3,168 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే చేసిన ప్రకటన అందులో భాగాంగానే చూడాలి. ఇది కేవలం ఖాళీల భర్తీగా కాకుండా.. యువతలో ‘నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు’ అనే అనిశ్చితిని తగ్గించే ప్రయత్నం. ఏటా స్పష్టమైన ఉద్యోగ క్యాలెండర్ ఉండటం వల్ల విద్యార్థులు తమ ప్రిపరేషన న్ను ముందుగానే ప్రణాళిక చేసుకోగలరు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వోద్యోగాల సంఖ్యకు మించి ప్రైవేట్రంగంలో అవకాశాలు సృష్టించడం మరింత కీలకం.
డిగ్రీ ఒక అర్హత.. స్కిల్ ఒక ఆయుధం
రాబోయే దశాబ్దంలో ఉద్యోగ మార్కెట్లో డిగ్రీకంటే నైపుణ్యానికి ప్రాధాన్యమన్నది ఇప్పటికే కనిపిస్తున్న దృశ్యం. ముఖ్యంగా ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వంటి రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ మార్పును ముందుగానే గుర్తించి యువతను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడం రాష్ట్రం నిశ్శబ్ధంగా నిర్దుష్ట ప్రణాళికనే సిద్ధం చేస్తోంది. ఆ ప్రయాణంలో భాగమే-పరిశ్రమలతో భాగస్వామ్యాలను పెంచడం. ఒరాకిల్తో కలిసి 4 లక్షల మంది విద్యార్థులకు ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ తదితర ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణనిస్తోన్న కార్యక్రమాన్నీ ఈ కోణంనుంచే చూడాలి. ఇలాంటి కార్యక్రమాల అసలు విలువ -శిక్షణ పొందిన వారి సంఖ్యలో కాదు.. శిక్షణ తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పులో కనిపిస్తుంది. ఒక విద్యార్థి ఏఐ నేర్చుకున్నాడా? డేటాను విశ్లేషించగలుగుతున్నాడా? కంపెనీ అవసరాలకు అనుగుణంగా పని చేయగలుగుతున్నాడా? ఉద్యోగం పొందాడా? లేక స్వయంగా ఒక సేవ లేదా సంస్థను ప్రారంభించాడా? ఇవే భవిష్యత్తులో స్కిల్ ఎకానమీ విజయాన్ని కొలిచే ప్రమాణాలు. అలాంటి దృశ్యాల ఆవిష్కరణకే ఏపీ ఉరకలేస్తోంది.
ఏఐ వస్తోంది.. యువత సిద్ధమా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కేవలం టెక్నాలజీ రంగానికి పరిమితం చేయలేం. వ్యవసాయం నుంచి వైద్యం వరకు, బ్యాంకింగ్ నుంచి తయారీ పరిశ్రమ వరకు, విద్య నుంచి పరిపాలన వరకు ప్రతి రంగంలో ఏఐ ప్రభావం పెరగబోతోంది. అందువల్ల భవిష్యత్ యువతకు ‘కంప్యూటర్ పరిజ్ఞానం’ మాత్రమే సరిపోదు. ఏఐతో కలిసి పనిచేయగల సామర్థ్యం అవసరం. ఇక్కడే విద్యా వ్యవస్థలో మార్పు కీలకం. పాఠ్యపుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని పరీక్షల్లో రాయడం మాత్రమే కాకుండా.. సమస్యను గుర్తించడం, పరిష్కారం కనుగొనడం, టెక్నాలజీని ఉపయోగించడం, టీమ్ పనిచేయడం, కమ్యూనికేట్ చేయడంవంటి నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచాలి. ఏపీ విద్యారంగంలో స్పష్టంగా కనిపిస్తోన్న మార్పులివే. రాష్ట్ర అక్షరాస్యత రేటు 2024లో 72.6 శాతం నుంచి 2026లో 82.1 శాతానికి పెరిగిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. 2027 సెప్టెంబర్ నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. అక్షరాస్యత నుంచి నైపుణ్యానికి.. నైపుణ్యం నుంచి ఉపాధికి వెళ్లే ప్రయాణమే తదుపరి దశ!
స్టార్టప్.. ఉద్యోగం కోసం మరో మార్గం
జెన్ జెడ్కి ఉన్న మరో ప్రత్యేకత ‘ఉద్యోగం కావాలి’ అన్న ఆలోచనతో పాటు ‘ఏదైనా కొత్తగా చేయాలి’ అనే ఆలోచన కూడా బలంగా ఉండటం. డిజిటల్ ప్లాట్ఫారము, ఏఐ టూల్స్, ఈ-కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఫిన్స్టక్, అగ్రిటెక్వంటి రంగాలు చిన్న పట్టణాల యువతకూ కొత్త అవకాశాలను తెచ్చాయి. ఏపీలో పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ స్థానిక యువతకు ఉద్యోగాలు మాత్రమే కాకుండా.. చిన్న వ్యాపారాలు, సప్లయర్ నెట్వర్లు, సర్వీస్ సంస్థలు, స్టార్టప్లకు కూడా అవకాశాలు పెరుగుతాయి. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 21 వేలకుపైగా ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం నమ్మకంగానే చెబుతోంది. పెద్ద పరిశ్రమ వచ్చినచోట కేవలం ఆ పరిశ్రమలోనే ఉద్యోగాలు రావు. రవాణా, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, మెయింటెనెన్స్, సెక్యూరిటీ, ఫుడ్ సర్వీసెస్, డిజిటల్ సేవలు, చిన్న పరిశ్రమలు.. అనేక అనుబంధ 1 రంగాలు అభివృద్ధి చెందుతాయి. అంటే ఒక పెట్టుబడి వెనుక అనేక ఉపాధి అవకాశాల గొలుసు సహజం. ఈ గొలుసులో స్థానిక యువతను భాగస్వాములను చేయడంపైనే కూటమి సర్కారు ఫోకస్ కనిపిస్తోంది.
గ్రామీణ యువతకూ అదే ఛాన్స్
స్కిల్ ఎకానమీ అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతివంటి నగరాల్లోని యువతకు మాత్రమే పరిమితం కాకూడదు. గ్రామీణ ప్రాంతాల యువతకూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యముండాలి. ఈ ఆలోచనతోనే డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయ సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ-కామర్స్ వంటి రంగాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. మరోపక్క -స్కిల్ సెంటర్లను కేవలం శిక్షణ కేంద్రాలుగా కాకుండా.. ‘ట్రైనింగ్ టు ఎంటర్ప్రైజ్’ కేంద్రాలుగా మార్చాల్సిన ప్రణాళికలపైనా దృష్టి పెట్టింది. శిక్షణతో పాటు బ్యాంకు రుణం, మెంటరింగ్, మార్కెట్ యాక్సెస్, డిజిటల్ మార్కెటింగ్, పరిశ్రమలతో అనుసంధానిస్తే.. -యువత స్వయం ఉపాధి దిశగా దూసుకెళ్లగలదన్నది ప్రభుత్వ యోచన. ఆ దిశగానూ రాష్ట్రం బలమైన అడుగులేస్తోంది. ఇటీవల బీసీ యువతలో బీ. ఫారమ్, డీ. ఫారమ్ పూర్తిచేసిన వారికి జనరిక్ ఫార్మసీ దుకాణాల ఏర్పాటుకు రూ.4 లక్షల వరకు సబ్సిడీ అందించే పథకాన్ని రాష్ట్రం ప్రకటించడం కూడా స్వయం ఉపాధివైపు తలుపులు తెరుస్తున్నట్టే.
సోషల్ మీడియా.. ప్రచార వేదిక కాదు, అవకాశాల వేదిక కావాలి
ఇక్కడే ముఖ్యమంత్రి సూచనకు అసలు ప్రాధాన్యం కనిపిస్తుంది. జెడ్ జెడ్ ఉన్న చోట ప్రభుత్వం ఉండాలి. కానీ ప్రభుత్వం అక్కడ కనిపించడం మాత్రమే కాదు.. యువతకు ఉపయోగపడే సమాచారాన్ని అందించాలి. ఏ జిల్లాలో ఏ కంపెనీ పెట్టుబడి పెడుతోంది? ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? ఏ స్కిల్ నేర్చుకుంటే ఆ ఉద్యోగానికి అర్హత వస్తుంది? ఏ కోర్సులు ఉచితం? ఎక్కడ శిక్షణ లభిస్తుంది? స్టార్టప్ ప్రారంభించడానికి ఏ పథకాలున్నాయి? రుణం ఎలా పొందాలి? విదేశీ ఉద్యోగాలకు ఏ నైపుణ్యాలు అవసరం? ఏఐలో ఉచితంగా నేర్చుకునే అవకాశాలు ఏమిటి? ఇలాంటి సమాచారం ఒక యువకుడి మొబైల్లోకి చేరితే.. సోషల్ మీడియా నిజమైన ప్రజా సేవా వేదికగా మారుతుంది. మంత్రులు, ప్రభుత్వ శాఖలు కూడా తమతమ రంగాల్లో ‘యూత్ డ్యాష్బోర్డ్’ తరహాలో అవకాశాలను అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం, స్కిల్, ఇంటర్న్షిప్, అప్రెంటిస్క్రిప్, స్టార్టప్, స్కాలర్షిప్.. అన్నీ ఒకే డిజిటల్ వేదికపై కనిపించేలా చేసి.. యువతకు ప్రభుత్వ వ్యవస్థను మరింత చేరువ చేయాలన్నది ముఖ్యమంత్రి దిశానిర్దేశంలోని అంత:స్సూత్రం!
ఇదే నిజమైన స్కిల్ ఎకానమీ.
ఏపీ ఇప్పటికే పెట్టుబడులు, పరిశ్రమలు, టెక్నాలజీ, విద్య, ఉద్యోగాల దిశగా పలు అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఆ అడుగులన్నింటినీ ఒకే లక్ష్యంతో అనుసంధానం చేయాల్సిన సమయం. ‘ఏపీకి పెట్టుబడులు రావాలి’ అన్న లక్ష్యానికి పక్కనే ‘ఏపీ యువతకు అవకాశాలూ రావాలి’ అనే లక్ష్యాన్నీ నెరవేర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధిని కొత్త రోడ్లు, కొత్త భవనాలు, కొత్త పరిశ్రమలతో మాత్రమే కొలవలేం. ఆ రాష్ట్ర యువకుడు తన స్వగ్రామంలోనే తన భవిష్యత్తును నిర్మించుకోగలుగుతున్నాడా? ఒక యువతి తన నైపుణ్యంతో ప్రపంచ మార్కెట్కు సేవలు అందించగలుగుతున్నదా? ఒక విద్యార్థి చదువు పూర్తయ్యేలోపే తన కెరీర్ దిశను నిర్ణయించుకోగలుగుతున్నాడా? ఒక యువ పారిశ్రామికవేత్తకు తొలి అడుగు వేయడానికి అవసరమైన సహాయం లభిస్తున్నదా? ఈ ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానం వచ్చిన రోజే నిజమైన సాధికారత సాధించినట్టు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాలలో వ్యక్తం చేసిన, చేస్తున్న ఆకాంక్ష కూడా ఇదే. రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకురావాలన్న తపనను అనేక సందర్భాలలో వ్యక్తం చేయాడాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఆ దిశగానే పాలనా అడుగులు, ప్రణాళికలూ సాగుతున్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. ఉద్యోగం కోసం యువత ప్రభుత్వాన్ని వెతకడం కాదు.. అవకాశాల కల్పనకు యువతతో ప్రభుత్వమే కనెక్టవ్వాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంలోని లోతైన అంశంగా కనిపిస్తోంది. విజనరీ లీడర్ సూచిస్తోన్న దిశగా ఏపీ వేస్తున్న ప్రతి అడుగూ.. రేపటి యువ ఆంధ్రప్రదేశ్కు కొత్త పునాది కాకపోదు!














