- వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం..
- జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం
- 40 ఏళ్ల నాటి భూమిపై కబ్జాదారుల కన్ను… దొంగ పట్టాలతో దౌర్జన్యం
- అర్జీలు స్వీకరించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్కుమార్
- సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు
మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజా వినతుల పరిష్కార వేదిక నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన వారి నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్కుమార్ వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి కషి చేశారు. సత్యసాయి జిల్లా ఎన్పీ కుంట మండలం ఎదురుదొన గ్రామానికి చెందిన రమణప్ప వినతి… నాకున్న ఒక్క ఎకరం భూమిని నా తమ్ముడు చిన్న రమణప్ప మధ్యవర్తిత్వంతో వైసీపీ నాయకుడైన మాచర్ల గుంసలప్ప వద్ద రూ.లక్షకు 2 రూపాయల వడ్డీ చొప్పున మూడు సంవత్సరాల గడువుతో తనఖా రిజిస్ట్రేషన్ చేశాను. రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించాము. అయితే అప్పుల భారం పెరిగిపోవడంతో నా పెద్ద కుమారుడు శివశంకర్ తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు మానవత్వంతో సాయం చేయాల్సింది పోయి గడువు ముగిసిందనే నెపంతో గుంసలప్ప నాకు భూమిని తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని బెదిరిస్తున్నాడÁT. గ్రామ పెద్దల ద్వారా పంచాయితీ పెట్టినా ఆ నాయకుడు ససేమిరా అనడమే కాకుండా, భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఉన్న ఒక్క ఎకరం భూమి పోతే నా కుటుంబం వీధిన పడాల్సిందే. వారిపై చర్యలు తీసుకోని నా సమస్యను పరిష్కరించండి.
వైఎస్సార్ కడప జిల్లా అట్లూరు మండలం కోనరాచపల్లి గ్రామానికి చెందిన అయ్యవారయ్య అర్జీ… నా తండ్రి పునగాని గంగయ్య పేరు మీద 1998లోనే సర్వే నెం. 1022, ప్లాట్ నెం.11లో 2 సెంట్ల స్థలానికి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. అప్పటి నుంచి ఆ స్థలం నా ఆధీనంలోనే ఉంది. టీడీపీ సభ్యుడనే నెపంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2-2-2024న ఎటువంటి నోటీసులు లేకుండా జేసీబీతో నా ఇంటి పునాదులను అక్రమంగా తొలగించారు. ఈ అన్యా యంపై హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కంటిచూపు లేని వ్యక్తి అని కూడా చూడకుండా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలు, నలుగురు చిన్న పిల్లలు ఉన్న కుటుంబాన్ని రోడ్డున పడేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం కొండామారేపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ వినతి… సర్వే నెం.235/3లో నాకు 2.05 ఎకరాల భూమి ఉంది. ఇది గత 40 ఏళ్లుగా మా కుటుంబ ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించి 40 ఏళ్ల క్రితం నాటి ఆర్డీఆర్, అడంగల్, బుక్-4 పట్టా, ఇతర రెవెన్యూ రికార్డులన్నీ మా పేరిటే ఉన్నాయి. మదనపల్లి మండల సర్వేయర్ సుబ్రమణ్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తున్నారు. రికార్డులు మార్చేందుకు ప్రయత్నిస్తూ సబ్ డివిజన్ పేరుతో మమ్మల్ని మానసికంగా ఇబ్బందిపెడుతున్నారు. సర్వేయర్ అండతో ప్రైవేట్ వ్యక్తులు, గూండాలు మా భూమిపైకి వచ్చి మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. దొంగ పట్టాలు సృష్టించి మా భూమిని లాక్కోవాలని చూస్తున్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన మాణిక్యాలరావు వినతి… నాకు ఆ గ్రామంలోని సర్వే నెం.156/1, 179/1, 179/2(, 179/2L లో మొత్తం 5.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 8 ఏళ్లుగా పామాయిల్ తోట సాగు చేస్తున్నాను. మా కుటుంబ వాటాల పరిష్కారం కోసం భూమి విలువ తెలుసుకోవడానికి కానుమోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాను. నా వ్యవసాయ భూమి రికార్డుల్లో ‘ఎకరాల్లో కాకుండా ‘చదరపు గజాల్లో ఉన్నట్టు చూపిస్తోందని అధికారులు చెప్పారు. మేము వ్యవసాయం చేసుకుంటున్నామని మొరపెట్టుకున్నా వారు స్పందించలేదు. దీనిపై ఫిర్యాదు చేయగా స్పందించిన సబ్ రిజిస్ట్రార్, తహసీల్దారు స్వయంగా మా పొలానికి వచ్చి పరిశీలించారు. అక్కడ పామాయిల్ తోట ఉన్నట్టు ధ్రువీకరిస్తూ… అది వ్యవసాయ భూమేనని రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టులు పంపి ఐదు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు రికార్డుల్లో మార్పు జరగలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయట్లేదు.
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం కొండయ్య గారిపల్లి గ్రామానికి చెందిన కె.శ్రీనాథ్ అర్జీ… నాకు పిత్రార్జితంగా వచ్చిన భూమికి సంబంధించి ఇప్పటివరకు పట్టా పాసుపుస్తకాలు మంజూరు కాలేదు. దీని కోసం మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోతోంది. గతంలో గ్రామ సర్వేయర్లు సర్వే నెం. 1656-5 లో ఉన్న నా 0.19 సెంట్ల భూమిని పొరపాటున లేదా అక్రమంగా వేరే వారి పేరు మీద రికార్డులో మార్చారు. ఈ భూమి నాకు రిజిస్టర్డ్ వీలునామా ద్వారా సంక్రమించింది. దీనికి సంబంధించిన రిజిస్టర్డ్ అగ్రిమెంటు, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ భూమిని నా పేరిట మార్చడానికి అవసరమైన ప్రభుత్వ రుసుము కూడా ఇదివరకే చెల్లించాను.
వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం లక్ష్మీ బాలాజీనగర్ గ్రామానికి చెందిన వీరయ్య వినతి… జంగంరాజు పల్లి గ్రామ పరిధిలో సర్వే నెం.1240/7,1240/10లో రెండు ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలు నా వద్దు ఉన్నాయి. కానీ ఈ సర్వే నెంబర్లు దాదిబోయిన సురేష్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం చేసే ఈయన తన తల్లి, భార్య పేరున అప్పటి తహసీల్దార్, వీఆర్వోతో కుమ్మక్కు అయ్యి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆక్రమంగా ఆన్లైన్ చేశారు. దీనిపై వారిని ప్రశ్నించగా నీకు దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు.
అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన కురుబ రాజన్న విజ్ఞప్తి… ఎనుమలదొడ్డి గ్రామ పరిధిలోని సర్వే నెం. 93-10లో నాకు 4.50 ఎకరాల పొలం ఉంది. ఇందులో 3 బోర్లు, 2 మోటార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమిలో కాపునకు వచ్చిన 300 మామిడి చెట్లు ఉన్నాయి. గత 7 ఏళ్లుగా నా భార్య కె. లలితమ్మ, కుమారులు కె.శ్రావణ్కుమార్, కె.అజయ్, కుమార్తెలు సోనియా, చిట్టి, కోడళ్లు అందరూ కలిసి నా భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశారు. తన భూమిలో పండిన పంటను తనకు దక్కకుండా చేసి, నన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టి, కనీసం పూట గడవని స్థితిలోకి నెట్టారు. 75 ఏళ్ల వయస్సులో తన సొంత భూమిపై హక్కు లేకుండా చేశారు.
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం నాగులూరుతండాకు చెందిన వనజ అర్జీ… మా గ్రామంలోని సర్వే నెం. 571-4లో గల 1.67 ఎకరాల భూమిని ప్రభుత్వం నాకు 2005లో మంజూరు చేశారు. నా దగ్గర పట్టా పాసుపుస్తకాలు, సర్వే రికార్డులు అన్నీ ఉన్నాయి. అందులోనే మామిడి తోట సాగు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన బోరు సదుపాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. గత రెండేళ్లుగా ఆ భూమిని అడంగల్, 1-బి రికార్డుల్లో ఆన్లైన్ చేయమని రెడ్డిగూడెం తహసీల్దారు చుట్టూ తిరుగుతున్నాను. కానీ ఆయన పట్టించుకోకుండా “నీకు భూమి లేదు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని గ్రామానికి చెందిన బాబావతు రమేష్, చిన్న వెంకటేష్, లక్ష్మి, సరస్వతి, వారి అనుచరులు గోపి, చందావతు నాగులు, ధూక్సా బాల అనే వ్యక్తులు నా భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు.
వారు నా పొలంలోని మామిడి కాయలను అక్రమంగా కోసుకుపోవడమే కాకుండా, మొక్కలకు నీరు పెట్టనివ్వకుండా మోటారు వైర్లు కట్ చేస్తున్నారు. మినుము పంటపై గడ్డి మందు కొట్టి మొత్తం నాశనం చేశారు. ఇటీవల తహసీల్దారు నోటీసు ఇవ్వగా నా భూమి వద్దకు వెళ్లాను. వారందరూ గుంపుగా చేరి నన్ను అసభ్య పదజాలంతో దూషించారు. కిందపడేసి కాళ్లతో, చేతులతో విచక్షణారహితంగా కొట్టి జుట్టు పట్టుకుని బయటకు గెంటేశారు. “మళ్ళీ భూమి వద్దకు వస్తే చంపేస్తాం” అని ప్రాణహాని తలపెట్టేలా బెదిరిస్తున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన పద్మావతి విజ్ఞప్తి… మా గ్రామంలో సర్వే నెం.500, దాఖలా 2-163 డోరు నెంబరు గల 211 గజాల స్థలానికి ప్రభుత్వం తన పేరుతో సంపూర్ణ హక్కులతో కూడిన పట్టా మంజూరు చేసింది. గతంలో కుమారుడు మరణించిన తర్వాత కోడలు ముతికేపల్లి శ్రీదేవి తనను ఇంటి నుండి అక్రమంగా గెంటేసిందని, బినామీ పత్రాలు సృష్టించి కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు తన పేరుతో పొందుతోంది. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్థిక తోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.















