- రెండురోజుల ఎన్నికల ప్రచారంతో ఊపునిచ్చిన ఏపీ మఖ్యమంత్రి
- అభివృద్ధి మంత్రం… సుపరిపాలనే లక్ష్యంగా ప్రచారం
- డబుల్ ఇంజిన్ సర్కారుగా ఏపీని ఉదహరించిన వైనం..
- మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై డీఎంకే తీరుపై నిప్పులు
- కర్ణాటక-తమిళనాడు వివాదాలకు చెక్ పెట్టేలా గంగా-కావేరి అనుసంధానంపై ప్రస్తావన
- తమిళనాడు పునర్వైభవం ఎన్డీఏతోనే సాధ్యమంటూ సభల్లో స్పష్టత
తమిళనాడు (చైతన్య రథం): తమిళనాడులో రెండు రోజులపాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్తో పలు కీలక ప్రాంతాలను ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. సోమ, మంగళవారాల్లో కోయంబత్తూర్, కృష్ణగిరి, విరుధ్నగర్, మధురై, చెన్నై జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు, రోడ్ షోలు, స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు కూడగట్టారు. కోయంబత్తూర్ నార్త్, కోయంబత్తూర్ సౌత్, సింగనల్లూర్, కౌండం పాలాయం, సూలూర్, థలి, అన్నానగర్, టీ.నగర్, విల్లివాక్కం, సాత్తూర్, కోవెల్పట్టి నియోజకవర్గాల ఎన్డీఏ అభ్యర్థులు ఏపీ సీఎం నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ముఖ్యంగా అభివృద్ధిలో తమిళనాడు వెనుకబాటు, అవినీతి, క్షీణించిన శాంతి భద్రతలువంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. అలాగే తమిళనాడుకు ఎన్డీయే అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధిస్తున్నామని, అదేవిధంగా ఎన్డీయేకు అవకాశం ఇస్తే తమిళనాడు కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి ఆయా సభల్లో వివరించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ సహా వివిధ ప్రముఖ కంపెనీలనుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం ఇస్తున్న చేయూతే కారణమని ముఖ్యమంత్రి వివరించారు. తమిళనాడుకు పునర్వైభవం రావాలంటే ఎన్డీయేతోనే సాధ్యమవుతుందని ప్రతీసభలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాల మధ్య నిత్యం ఉండే నీటి తగాదాలకు ఫుల్స్టాప్ పెట్టాలంటే నదుల అనుసంధానమే మార్గమనే అంశాన్ని ఏపీ సీఎం వివరించారు. దీనికి గంగా-కావేరి నదుల అనుసంధానమే మార్గమని… ఇది జరగాలంటే ఎన్డీయేకు ఓటేయాలని కోరారు. తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి వస్తే.. అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టవచ్చని… అలాగే చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం కూడా లభిస్తుందని సీఎం వివిధ సభల్లో వివరించారు.
ఇక చెన్నైకు తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా తాగునీటి సరఫరావంటి అంశాలను గుర్తుచేస్తూ రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని ప్రస్తావించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని… కలిసి అభివృద్ధి చెందుదామని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే తెలుగు- తమిళ ప్రజల అనుబంధం, ఎన్టీఆర్-ఎంజీఆర్ స్నేహం, దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని సీఎం చంద్రబాబు ప్రచార సభల్లో వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ అంశాలపై డీఎంకే వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఏపీ సీఎం… మహిళలకు అన్యాయం చేసిన పార్టీలను ప్రజలు తిరస్కరించాలన్నారు. మహిళలను ఓడించిన డీఎంకేను ఓడించాలంటూ తమిళ ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇక డిలిమిటేషన్ ప్రక్రియలో జనాభాతో సంబంధం లేకుండా 50 శాతం సీట్ల పెంచుతామన్న కేంద్ర ప్రతిపాదనను తమిళులకు అర్థమయ్యేలా వివరించారు. జనాభా ఆధారంగా జరిగే డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని కూడా వివరిస్తూ మాట్లాడారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల విధానాల వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లిందని ప్రతి సభలోనూ సీఎం ప్రస్తావించారు. ప్రతి సభలోనూ తమిళంలో మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్న సీఎం చంద్రబాబు…. స్థానిక భావోద్వేగాలను గౌరవిస్తూ ప్రచారం నిర్వహించారు.
సాంతూర్లో దుమ్ములేపిన చంద్రబాబు
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు సాతూర్ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు `సాత్తూర్లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశమై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “ఎన్డీఏ పాలన వస్తేనే తమిళనాడు అభివృద్ధి చెందుతుంది. ఏపీలో 2019-24 మధ్య విధ్వంసం జరిగింది. మేం అధికారంలోకి వచ్చాక కేంద్రం సహకారంతో రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుతోంది. తమిళనాడుకు ఉజ్వల భవిష్యత్ కావాలంటే ఎన్డీఏ అభ్యర్ధులు గెలిచి తీరాలి. మధురై.. ఏపీలోని రాయలసీమ తరహా ప్రాంతం. చాలా అభివృద్ధి జరగాల్సి ఉంది. అభివృద్ధికి మారుపేరు ఎన్డీఏ ప్రభుత్వమే. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎన్డీఏ పాలన రావాలి. తమిళ, తెలుగు, కన్నడ, కేరళ అంతా ద్రవిడ ప్రాంతానికి చెందిన వారమే. చెన్నైకి తెలుగు గంగ ద్వారా తాగునీటిని ఇచ్చిన నేతగా ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. ప్రజలు తమ ఓటు ద్వారా తమిళనాడు భవిష్యత్తును మార్చాల్సి ఉంది. గతంలో చెన్నై దక్షిణ భారతదేశానికి అత్యంత కీలకమైన ప్రాంతం. ఇప్పుడు చెన్నై అభివృద్ధి శూన్యం. ఇప్పుడు మళ్లీ దానిని పునరుద్ధరించే బాధ్యతను ఎన్డీఏ తీసుకుంటుంది. ఎన్డీఏ అభ్యర్ధులను గెలిపిస్తే తమిళనాడు ప్రజలు గెలిచినట్టే” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.














