రంపచోడవరం (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట తమ ఆకాంక్షలు, ఆశయాలను ప్రకటించుకున్న పిల్లలను ప్రశంసించి ప్రోత్సహించారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రికి విద్యార్థులు తమ లక్ష్యాలు, ఆశయాలను వెల్లడించారు. ఉన్నత ఆశయాలను ప్రకటించిన పిల్లలను చూసి మురిసిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలుపుతూ.. సంకల్పం నెరవేరుతుందని ఆశీర్వదించారు. తాను భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిగా మారి ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తానని చెప్పిన విద్యార్థి సాత్విక్ను సీఎం ప్రత్యేకంగా అభినందిస్తూ, అతని సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని ఆకాంక్షించారు. “డేర్ టు డ్రీమ్… స్ట్రెవ్ టు అచీవ్” అనేది తాను ఎప్పుడూ చెప్పే సందేశమని పేర్కొన్న సీఎం… పిల్లలను ప్రోత్సహించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతని అన్నారు. విద్యార్థుల ఆలోచనలు, అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వారితో నిరంతరం సంభాషించాలని సూచించారు. పోలవరం ప్రాంతం నుంచి ప్రపంచానికి సేవలందించే స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాఠశాల విద్యాశాఖ రూపొందించిన “డ్రగ్స్ వద్దు బ్రో” హ్యాండ్బుక్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం “బడి కోసం డోనర్” వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. పోర్టల్ ప్రారంభమైన వెంటనే మీ సేవ ఆపరేటర్ చిట్టిబోయిన ఉదయ్కుమార్ రంపచోడవరం హైస్కూల్కు రూ. లక్ష విరాళం ప్రకటించారు. నెల్లూరు జిల్లా జెడ్పీ హైస్కూల్కు పారిశ్రామికవేత్త పూర్ణచంద్రరావు రూ.4 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. వీరిద్దరిని సీఎం చంద్రబాబు అభినందించారు. అలాగే సభా వేదిక మీదనుంచి పోలవరం జిల్లాలో వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి వివరించారు. పనితీరు బాగా కనబరిచిన అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి… సభికులతోనూ చప్పట్లు కొట్టించారు.
పేరెంట్స్, టీచర్లతో ముఖాముఖి
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా రంపచోడవరం ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు, మార్కులు, హాజరు, ఆరోగ్య వివరాలను స్వయంగా పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల రిపోర్టు కార్డులను వారి ఇళ్లకే పంపేలా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మరో తరగతి గదిలో స్మార్ట్ బోర్డు ద్వారా బోధనా విధానాన్ని పరిశీలించిన సీఎం.. కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని ఉత్సాహపరిచారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు నాటిన మొక్కలను పరిశీలించిన సీఎం.. గ్రీన్ పాస్పోర్టు, క్యూఆర్ కోడ్ ఆధారంగా మొక్కల వివరాలు తెలుసుకునే విధానాన్ని అభినందిస్తూ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మెగా పీటీఎం ఫొటో ఫ్రేమ్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఫొటో దిగారు.
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉందని విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషకాహారం మరింత మెరుగ్గా అందించాలని సీఎం సూచించారు. విటమిన్ లోపాలు రాకుండా పోషకాహారం అందిస్తున్నామని, కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనంతో పాటు చిక్కి, ఉదయం రాగిమాల్ట్ అందిస్తున్నామని చెప్పగా, ఇంటికి వెళ్లే ముందు కూడా చిక్కిలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అనంతరం విద్యార్థుల కోరిక మేరకు వారితో కలిసి ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ ఆప్యాయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.













