- ఈ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయాలి
- ప్రత్యేకమైన కాలపరిమితి, కార్యాచరణ అవసరం
- రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా చూడాలి
- ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు చేరాలి
- అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు
పలమనేరు (చైతన్యరథం): మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడంతో పాటు సరికొత్త సాంకేతికతతో అటవీ జంతువుల సంరక్షణ చేపట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ రూపొందించిన ‘హనుమాన్’ (నవaశ్రీఱఅస్త్ర Aఅస చీబత్ీబతీఱఅస్త్ర ఖఅఱ్ం టశీతీ వీశీఅఱ్శీతీఱఅస్త్ర, Aఱస డ చీబతీంఱఅస్త్ర శీట ఔఱశ్రీసశ్రీఱటవ) ప్రాజెక్ట్ వివరాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, ముసలమడుగు వద్ద ఉన్న కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రానికి విచ్చేసిన పవన్కు 11 అంశాలతో కూడిన హనుమాన్ ప్రాజెక్ట్ ను అటవీశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హనుమాన్ ప్రాజెక్ట్ లోని ప్రతి అంశాన్ని ఆసక్తిగా విన్న పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లడానికి అంశాల వారీగా నిర్దిష్ట కాలపరిమితి అవసరం అన్నారు. జంతువుల సంచారానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పడు ప్రజలకు చేరవేసేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ను రూపొందించి మార్చి 3వ తేదీ లోపు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
హనుమాన్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లే అంశంపై అటవీశాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనిపై చర్చించేందుకు నవంబర్ 3వ వారంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మానవులు, జంతువుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టు బాగుందన్నారు. అయితే ప్రాజెక్టులోని ప్రతి అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కాల పరిమితి పెట్టుకోవాలి. ఏనుగులతో తీవ్రంగా దెబ్బ తింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఎలా? దానికి రైతులు ఎలా ఒప్పించాలనే అంశాలపై దృష్టి సారించాలన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు ఎక్కువ. అలాంటి వాటికి ఏనుగులు ఎక్కువగా ఆకర్షితమవుతున్నాయి. ఆ పంటల్లో మార్పులు తీసుకువస్తే రైతుల ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలి. తేనెటీగల పెంపకం, ఎకో టూరిజం అభివృద్ధి వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలి. ఈ అంశంపై నవంబర్ మూడో వారంలో నిర్వహించే సమీక్షలో కూలంకషంగా చర్చిద్దామన్నారు.
ప్రత్యేక యాప్ సిద్ధం చేయండి
మానవ, వన్య ప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న గజ ప్రజా యాప్ స్థానంలో నూతన సాంకేతికతో ప్రత్యేక యాప్ ని సిద్ధం చేయండి. తమ పరిసర ప్రాంతాల్లో సంచరించే జంతువులు సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేలా ఆ యాప్ ఉండాలి. ఏనుగులకి ప్రత్యేక రేడియో కాలర్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఏనుగుల సంచారం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది? గుంపులుగా తిరిగే ఏనుగులతో పాటు ఒంటరి ఏనుగులు సమాచారం కూడా తెలిసేలా చూడండి. సాంకేతికతను వినియోగించి ఏ ప్రాంతంలో ఏనుగులకి ఈ రేడియో కాలర్ ఏర్పాటు చేస్తే అత్యధిక ప్రయోజనం ఉంటుందనుకుంటే వాటికి ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామ స్థాయిలో సర్పమిత్ర వాలంటీర్లు
హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాల్లో మాదిరి గ్రామాల్లోనూ జనావాసాల్లోకి వచ్చిన పాముల నుంచి ప్రజలకు హాని కలగకుండా సర్ప మిత్రలను ఏర్పాటు చేసేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో వాలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్టు అటవీ శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామ స్థాయిలో ముందుకు వచ్చే సర్పమిత్ర వాలంటీర్లకు అటవీ శాఖ నుంచి ప్రోత్సాహకాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి అర్జీల స్వీకరణ
పలమనేరు పర్యటనకి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి ప్రజల నుంచి, జనసేన శ్రేణుల నుంచి అర్జీలు వచ్చాయి. అర్జీదారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలు
ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రం సందర్శన
మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, మనుషులను రక్షించేందుకు ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చిన కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం సందర్శించారు. ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రానికి విచ్చేసిన ఆయన ఏనుగుల శిక్షణ, సంరక్షణ, తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతోపాటు గతంలో ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న మూడు కుంకీలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి. శిక్షణలో కుంకీ ఏనుగులు చూపుతున్న మెళకువలు, ఇటీవల జరిగిన ఆపరేషన్ల తీరును అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కుంకీ ఏనుగులు ప్రత్యేకంగా చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
క్రమబద్ధంగా కుంకీ ఏనుగులు వరుసగా వస్తూ ఫీుంకారం చేస్తూ పవన్ కళ్యాణ్కి సెల్యూట్ చేశాయి. అనంతరం అడవిలో లభ్యమయ్యే వివిధ రకాల కలపను ఏనుగుల సహాయంతో బయటకు తీసుకువచ్చే విధానాన్ని ప్రదర్శింప జేశారు. మానవ, ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు మదపుటేనుగుల గుంపు, నివాసాలు, పంట పొలాల వైపు వస్తున్నప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో ప్రత్యక్షంగా కుంకీ ఏనుగుల చేత చేయించిన ప్రదర్శన ఆకట్టుకుంది. మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ప్రత్యేకంగా మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణిచి వేస్తారు అన్నది పవన్ కళ్యాణ్కి మావటీలు చూపించారు. మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్ను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఏనుగులకు ఆయన స్వయంగా బెల్లం ఆహారం అందించారు. అనంతరం గజరాజుల ఆశీర్వచనం తీసుకున్నారు.
ముసలమడుగు ఏనుగుల క్యాంపు ప్రారంభోత్సవం
అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అందుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఏనుగుల క్యాంపులో ఏర్పాటు చేయనున్న గజారామం నగర వనానికి పునాదిరాయి వేశారు. సౌర శక్తితో పని చేసే వేలాడే అటవీ ఏనుగుల నిరోధక కంచె నిర్మాణానికి పవన్ కళ్యాణ్ పునాది రాయి వేశారు.
మియావకీ తరహా ప్లాంటేషన్ కి శ్రీకారం
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా అడవిని పెంపొందించే మియావకీ తరహా ప్లాంటేషన్కు ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రం వద్ద పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్లాంటేషన్ ను ఏర్పాటు చేశారు. ఉసిరి మొక్కను నాటి పవన్ కళ్యాణ్ ఈ దట్టమైన అడవుల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీటరకు ఒక్కటి చొప్పున నాటిన మియావకీ ప్లాంటేషన్ను స్వయంగా మొబైల్ లో వీడియో తీసుకున్నారు. మధ్యన పొదలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మావటీలకి రూ.50 వేలు బహుమానం
కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను స్వీకరించేటప్పుడు వీటిని జాగ్రత్తగా చూసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ విధంగానే పలమనేరు ఎలిఫెంట్ క్యాంపులో మావటీలు.. కుంకీల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వారి పని తీరు మెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు రూ.50 వేలు బహుమానంగా అందించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, అనంతపురం, తిరుపతి ఫారెస్ట్ కన్జర్వేటర్లు యశోద బాయి, చిత్తూరు డీఎఫ్ఓ స్రుబ్బురాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















