- న్యాయం చేయాలంటూ మృతుడి భార్య ఫిర్యాదు
- రామాలయాన్ని ధ్వంసం చేసిన వైసీపీ నేత అనుచరులు
- చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థుల వినతి
- టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు
- వినతులు స్వీకరించిన మంత్రి డోలా, కార్పొరేషన్ చైర్మన్లు సీఆర్ రాజన్, కుడిపూడి సత్తిబాబు
అమరావతి (చైతన్యరథం): వివిధ సమస్యలపై తరలివచ్చిన అర్జీదారులతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడిరది. గురువారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజల నుండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
మహానాడుకు వెళ్తున్న తన భర్తను వైసీపీకి చెందిన వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారని కడప జిల్లా వీరపునాయునిపల్లెకు చెందిన ఏ. కమలమ్మ గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటపై పోలీసులు పూర్తిగా విచారించకుండా.. అసలు ముద్దాయిలకు శిక్ష పడకుండా కాపాడుతున్నారన్నారు. తన భర్తను చంపిన వారితో పాటు చంపించిన వారిని కూడా శిక్షించేలా పోలీసులు చర్యలు తీసుకునేలా చూడాలని అభ్యర్థించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన నూలు వరలక్ష్మి విజ్ఞప్తి చేస్తూ.. తమ కుమారుడికి ఆయుస్మాన్ భారత్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బొడ్డుపల్లి సింహాచలం అనే వ్యక్తి తమ వద్ద రూ.12 లక్షలు తీసుకొని మోసం చేశాడని, అతనిపై చర్యలు తీసుకొని తమకు డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు.
రామాలయాన్ని ధ్వంసం చేసి 20 రోజులు అవుతున్నా.. వైసీపీకి చెందిన ముదునూరి మురళీకృష్ణ అనుచరులపై పోలీసులు ఎటువంటి చర్యలను తీసుకోవడంలేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రత్తిపాడు పోలీసులపై చర్యలు తీసుకొని దోషులకు శిక్షపడేలా చూడాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన సాంబమూర్తి, గ్రామస్తులు అభ్యర్థించారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలానికి చెందిన ఎస్. రామ్మోహన్ రావు విజ్ఞప్తి చేస్తూ.. గొల్లపూడి పంపింగ్ స్కీమ్ కాలువ కట్టను ఆక్రమించుకున్న కొందరు.. తమ స్థలంలోకి వెళ్లకుండా తమపైకి గొడవకు వస్తున్నారని ఫిర్యాదు చేశారు. కట్ట ఆక్రమించుకోవడమే కాకుండా ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారని.. అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన మల్లవరపు రామమూర్తి విజ్ఞప్తి చేస్తూ.. తమ ఇంటి స్థలాన్ని ఆక్రమణదారులు కబ్జా చేశారని.. దీనిపై ఆరు నెలల నుండి అధికారులకు అర్జీలు ఇస్తున్నా పట్టించుకోవడంలేదని.. దయ చేసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం పోలకల గ్రామానికి చెందిన బత్తుల సురేంద్ర నాయుడు విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం శిథిలావస్థలో ఉండి పెచ్చులూడి పడుతోందని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. సిబ్బందితో పాటు రోగులు బయపడుతున్నారని.. దయచేసి వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు.
పోలీసులమని చెప్పి కొందరు వ్యక్తులు గతంలో తన భర్త లక్ష్మీనారాయణ, తన కుమారుడు రాజ్కుమార్ను తీసుకెళ్లి దాడి చేసి వారి వద్ద ఉన్న ఫోన్లు, బంగారు ఉంగరాలు దోచుకెళ్లారని కడప జిల్లా వేంపల్లి మండలం శ్రీరామ్ నగర్కు చెందిన ముత్తారావుగళ్ల సుశీల ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తమ కేసు తీసుకోకపోవడమే కాకుండా.. తమను కులం పేరుతో దూషించారని.. ఈ అవమానంతో తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన పోలీసులపై ఎస్సీ,ఎస్టీ ఆట్రాసిటీ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన కోగంటి సురేష్ బాబు విజ్ఞప్తి చేస్తూ.. గ్రామంలోని కామన్ సైట్(బందెల దొడ్డి)ను కొందరు ఆక్రమించుకొని అక్రమంగా అమ్ముకున్నారని.. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన గుండపనేని చిన్నపోలయ్య, గుండపనేని వెంకట్రామయ్యలు జ్ఞప్తి చేస్తూ.. గతంలో తమకు ఇళ్లుమంజూరు అయ్యాయని కాని పేరు తప్పు వలన ఇంటి బిల్లు పడలేదని, దయ చేసి ఆగిపోయిన బిల్లును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.