- ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి
- జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలంటే కఠినమైన మార్గాన్ని మాత్రమే ఎంచుకోండి
- భవిష్యత్ అవకాశాలను అందుపుచ్చుకునేలా విద్యా రంగంలో సమూల మార్పులు
- గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన ఎకో సిస్టమ్ నిర్మాణం
- అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): ‘ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటం ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ ప్రతిరోజూ కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. యువత భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేలా సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో మేము విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నాం’ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో బుధవారం జరిగిన అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిóగా హాజరు కాగా మంత్రి నారా లోకేష్ అతిథిóగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ‘మేము విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలను మరింత దగ్గర చేస్తున్నాం. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాం, పరిశ్రమలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్నాం. యువత నేర్చుకోవడానికి, కొత్తవాటిని సృష్టించడానికి, నాయకత్వం వహించడానికి అవకాశాలను కల్పిస్తున్నాం’ అన్నారు.
యువత ఉద్యోగార్థులుగా మిగిలిపోకూడదు
మా లక్ష్యం చాలా స్పష్టమైనది. యువత కేవలం ఉద్యోగ అన్వేషకులుగా మాత్రమే మిగిలిపోవాలని మేము కోరుకోవడం లేదు. వారు ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని మేము ఆశిస్తున్నాం. పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ప్రజలు కేవలం మీ విజయాలను చూసి మాత్రమే గుర్తుంచుకోకూడదు. మీరు సమాజంలో తీసుకువచ్చిన మార్పు లేదా మీరు చేసిన కృషిని చూసి వారు మిమ్మల్ని గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి గొప్ప ముద్రను వదిలివెళ్లడమే నిజమైన వారసత్వం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఉత్సాహభరితమైన కాలంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. యువత గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా కలలు కనేలా ఆంధ్రప్రదేశ్ నేడు ఒక వ్యవస్థను నిర్మిస్తోంది. మేము ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, భవిష్యత్తు నాయకుల కోసం అనేక అవకాశాలు కల్పిస్తున్నాం.
వైఫల్యాలను చూసి భయపడకండి
ఈ రోజు మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. ఈరోజు మీ ప్రయాణానికి ముగింపు కాదు. ఈరోజు ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం కావాలి. వైఫల్యాన్ని చూసి ఎప్పుడూ భయపడకండి. వైఫల్యం అంటే మీరు తగినంత సమర్థులు కాదని అర్థం కాదు. ప్రయత్నించే ధైర్యం మీకు ఉందని మాత్రమే దాని అర్థం. విజయం ఎప్పటికీ ప్రయత్నం విరమించని వారి సొంతం. ప్రపంచంలో మార్పు తీసుకురాగలమనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. చరిత్రలో ప్రతి గొప్ప మార్పు “నేనెందుకు కాకూడదు?” అనే ప్రశ్నతోనే మొదలైంది. ఈ రోజు మీరు ఒక డిగ్రీ అందుకుంటున్నారు. కానీ అంతకంటే ముఖ్యంగా… మీరు ఒక బాధ్యతను స్వీకరిస్తున్నారు. మీ కుటుంబం, మీ సమాజం, మీ దేశం పట్ల బాధ్యత అది. ఈ డిగ్రీ కేవలం మీది మాత్రమే కాదు. మీతో కలిసి ఈ ప్రయాణాన్ని సాగించిన వారందరికీ ఇది చెందుతుంది. మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులు తమ సౌకర్యాలను త్యాగం చేశారు. ప్రతి సవాలులోనూ మీ కుటుంబం మీకు అండగా నిలిచింది. మీ ఉపాధ్యాయులు మీకు మార్గనిర్దేశం చేశారు, మిమ్మల్ని సరిదిద్దారు, మీపై నమ్మకం ఉంచారు. ఈ రోజు మీ వల్ల వారు గర్వపడుతున్నారు. అలాగే వారి వల్లే మీరు ఈ స్థితిలో ఉన్నారు.
విలువలతో కూడిన విద్య… ‘అమృత’ ప్రత్యేకత
నేను భారతదేశం అంతటా అనేక విశ్వవిద్యాలయాలను సందర్శించాను. ప్రతి విశ్వవిద్యాలయం జ్ఞానాన్ని అందిస్తుంది. పట్టాలను ప్రసాదిస్తుంది. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు అంతకంటే ఎక్కువే అందిస్తాయి. అటువంటి వాటిలో ‘అమృత’ విశ్వవిద్యాలయం ఒకటి. ఆలోచించడం, నాయకత్వం వహించడం, సేవ చేయడం వంటివి ‘అమృత’ మీకు నేర్పుతుంది. అదే ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రత్యేకమైనదిగా నిలుపుతోంది. విద్య అంటే కేవలం వృత్తిపరమైన జీవితాన్ని (కెరీర్) నిర్మించుకోవడం మాత్రమే కాదని అమృత విశ్వసిస్తుంది. అది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినది. కరుణ, విలువలతో సమాజానికి సేవ చేయడానికి జ్ఞానాన్ని వినియోగించుకోవడం దీని ఉద్దేశం. ఆ అద్భుతమైన దృక్పథం పూజ్యనీయులైన ‘అమ్మ’ నుంచి వచ్చింది. అమ్మ ఒకసారి ఇలా అన్నారు… “కరుణ అనే పదాన్ని కేవలం ఒక మాటగా కాకుండా ఆచరణాత్మక మార్గంగా మనం మలచుకోగలిగితే, ప్రపంచంలోని తొంభై శాతం మానవతాపరమైన సమస్యలను పరిష్కరించగలుగుతాము.” ఎంతటి శక్తివంతమైన మాట అది. జ్ఞానం మనకు నైపుణ్యాలను ఇస్తుంది. సాంకేతికత మనకు శక్తిని ఇస్తుంది. కానీ కరుణ వాటికి ఒక పరమార్థాన్ని ఇస్తుంది.అదే అమృత ప్రతి విద్యార్థికీ నేర్పే అత్యున్నత పాఠం.
విద్య అంతిమ లక్ష్యం జ్ఞానాన్ని పంచడమే
ఈరోజు మీరు ఈ ప్రాంగణం నుంచి బయటకు అడుగుపెడుతున్నప్పుడు, ఈ లోకం మీ ్పుGPA గురించి గానీ లేదా మీ బంగారు పతకాల గురించి గానీ అడగదు. “మీరు ఎలాంటి మార్పు తీసుకువచ్చారు?” అని మాత్రమే అడుగుతుంది. యువతకు మంచి వృత్తి జీవితం (్పుaతీవవతీ) ముఖ్యం. విజయం ముఖ్యం. కానీ మీ జ్ఞానం మరొకరి జీవితాన్ని మెరుగుపరిచినపుడే నిజమైన విజయం. అదే విద్య అసలైన లక్ష్యం. భారతదేశాన్ని మార్చిన వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు మనకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గుర్తుకొస్తారు. ఆయన సంపన్న కుటుంబం నుంచి రాలేదు. ఆయన జీవితం సాఫీగా సాగలేదు. కానీ ఆయనకు ఒక గొప్ప కల ఉండేది. తన భవిష్యత్తును నిర్ణయించే అవకాశాన్ని ఆయన ఎప్పుడూ తన పరిస్థితులకు ఇవ్వలేదు. ఆయన జీవితం మనకు ఒక సులభమైన పాఠాన్ని నేర్పుతుంది. మీరు ఎక్కడ మొదలుపెట్టారన్నది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నదే ముఖ్యం.
నైపుణ్యంపై దృష్టి సారించండి
జీవితం తరచుగా మీకు రెండు మార్గాలను చూపిస్తుంది. ఒక మార్గం సులభంగా ఉంటుంది. మరొకటి కష్టంగా ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే మిమ్మల్ని సవాలు చేసే మార్గాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ప్రతి గొప్ప ఆవిష్కరణ… ప్రతి గొప్ప సంస్థ… ఏదైనా భిన్నంగా చేసే ధైర్యం గల వ్యక్తితోనే మొదలయ్యాయి. మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో మీకు ఒక సూచన చేయాలనుకుంటున్నాను. విజయం కోసం పరుగులు తీయకండి. అత్యుత్తమ నైపుణ్యం (వఞcవశ్రీశ్రీవఅcవ) సాధించడంపై దృష్టి పెట్టండి. అప్పుడు విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. ఈ రోజు మీరు పొందుతున్న డిగ్రీ మీ విద్యాభ్యాసానికి ముగింపు కాదు. అది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ప్రపంచం ప్రతిరోజూ మారుతూనే ఉంటుంది. నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉండండి. వినమ్రంగా ఉండండి.
యువత కలల సాకారానికి అండగా నిలుస్తాం
భారతదేశానికి గర్వకారణమయ్యేలా ఏదైనా ఒక దానిని నిర్మించాలని కలలు కనండి. అది ఒక కంపెనీ కావచ్చు, కొత్త సాంకేతికత కావచ్చు, పరిశోధనలో ఒక గొప్ప పురోగతి కావచ్చు లేదా ఏదైనా సామాజిక కార్యక్రమం కావచ్చు. భారతదేశపు తదుపరి గొప్ప కంపెనీల్లో కొన్ని ఇక్కడే ఆరంభమవుతాయని నేను ఆశిస్తున్నాను. వాస్తవ సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మీ జ్ఞానాన్ని ఉపయోగించాలని కోరుతున్నాను. భవిష్యత్తుకు మీ ఆలోచనలు అవసరం. మీ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. ప్రతి గొప్ప కంపెనీ ఒక ఆలోచనతోనే ప్రారంభమైంది. ప్రతి గొప్ప ఆవిష్కరణ ఒక కలగా మొదలైంది.
ప్రతి గొప్ప నాయకుడు ఒకప్పుడు ఇలాంటి హాలులో కూర్చున్న విద్యార్థే. కాబట్టి గొప్పగా కలలు కనండి, కష్టపడి పనిచేయండి, నిరంతరం నేర్చుకోండి కఠినమైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకండి. మీ అందరికీ గొప్ప విజయం లభించాలని కోరుకుంటున్నాను. మీరు మీ తల్లిదండ్రులకు గర్వకారణం కావాలి. మీ ఉపాధ్యాయులకు గర్వకారణం కావాలి. మీ విశ్వవిద్యాలయానికి గర్వకారణం కావాలి. అలాగే మీ దేశానికి గర్వకారణం కావాలి. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిప్రదాతలుగా నిలవాలి. ఈ రోజు మీరు ఒక డిగ్రీతో ఈ ప్రాంగణం వెళ్తున్నారు. మీరు ధైర్యంతో వెళ్తారని నేను ఆశిస్తున్నాను.
గొప్పగా కలలు కనే ధైర్యం. ఎవరూ వెళ్లని కొత్త మార్గంలో పయనించే ధైర్యం. విఫలమైనా వెరవని ధైర్యం. మళ్లీ కొత్తగా ప్రారంభించే ధైర్యం. అన్నిటికంటే ముఖ్యంగా… సమాజంలో మార్పు తీసుకువచ్చే ధైర్యం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేటి నుంచి ఇరవై ఏళ్ల తర్వాత… మీరు ‘అమృత’కు తిరిగి రావాలని కోరుతున్నాను. విద్యార్థులుగా కాదు… పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా, ఉపాధ్యాయులుగా, ఆవిష్కర్తలుగా, ప్రజా నాయకులుగా మీరు తిరిగి రావాలి. మీరు తిరిగి వచ్చినప్పుడు… ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థీ మిమ్మల్ని చూసి “నేనూ వారిలాగే కావాలి” అని స్ఫూర్తిపొందాలి. అదే మీ అత్యున్నత సాధన అవుతుంది. అదే మీ గొప్ప విజయం అవుతుంది. అదే మీరు వదిలి వెళ్లే గొప్ప వారసత్వం అవుతుంది. 2026 బ్యాచ్ పట్టభద్రులకు అభినందనలు. ప్రపంచం మీ కోసం వేచి ఉంది. బయటకు వెళ్లండి… గొప్పగా కలలు కనండి. కరుణతో సేవ చేయండి. నిజాయితీతో నాయకత్వం వహించండి. ప్రపంచాన్ని మార్చే ట్రెండ్ సెట్టర్లు కావాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో అమృత విశ్వవిద్యా పీఠం, అమృత యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయేంద్రజీ, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ స్వామి నిజామృతానందపురిజీ, అమరావతి క్యాంపస్ రిజిస్ట్రార్ విపిన్ నాయర్, డీన్ సీకే జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

















