- డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ రెడ్డి
- ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయని గొడ్డలిపార్టీ
- నేడు పారదర్శకంగా 16 వేలకు పైగా టీచర్ పోస్టు భర్తీ
- ఓర్వలేక జగన్ రెడ్డి విషపు మాటలు, సాక్షి మీడియాలో అసత్య కథనాలు
- అమాయకులను బలిచేసేలా పూటకో తప్పుడు మాట
- మాజీ సైనికుడు చక్రపాణి రెడ్డిపై కుప్పంలో వైసీపీ శ్రేణులు, సాక్షి ప్రతినిధుల దౌర్జన్యం దుర్మార్గం
- డీఎస్సీలో ఉద్యోగమే రాని రామకృష్ణ పేరిట అసత్య ప్రచారం
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధ్వజం
అమరావతి (చైతన్యరథం): ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం, అభివృద్ధి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడంతో పాటు, పోలవరం వంటి రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టుల పనులను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు పెద్ద ఎత్తున రాకపోగా, అభివృద్ధి వేగం పూర్తిగా మందగించిందని పేర్కొన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పును అత్యంత స్పష్టంగా ఇచ్చారని కోటంరెడ్డి అన్నారు. వైసీపీని చిత్తుగా ఓడించి కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేయడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. మరోవైపు రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టించాలనే నమ్మకంతో ప్రజలు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం సహా కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. దేశంలోనే ఇతర రాష్ట్రాలు అసూయపడే రీతిలో నేడు ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రాబోయే 5-10 ఏళ్లలో విద్యార్థులు, యువత భవిష్యత్తు మహోద్భుతంగా మారబోతోంది. పారిశ్రామికంగా, ఉద్యోగాల కల్పనలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలవనుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు.
ఓర్వలేకనే విషప్రచారం
ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డికి అసలు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా కూడా తెలియదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 148 రోజుల్లోనే, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకాన్ని డీఎస్సీ ఫైల్పై చేశారు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసింది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేకుండా జరిగిన ఈ నియామకాలపై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే, ఓర్వలేని వైసీపీÓ దీన్ని ‘దగా డీఎస్సీ’ అంటూ విషం చిమ్ముతోంది. నిజానికి ఇది ప్రజా డీఎస్సీ, యువ డీఎస్సీ. ఇలాంటి పవిత్ర ప్రక్రియపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వైసీపీయే అసలైన దగాకోరు పార్టీ. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, పెట్టుబడులు రాకూడదనే ఏకైక దురుద్దేశంతో వైసీపీ అలజడులు రేపేందుకు ప్రయత్నిస్తోంది. అబద్ధాల పునాదులపై నడిచే సాక్షి పత్రిక, సాక్షి టీవీని అడ్డం పెట్టుకుని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి 15 రోజులకోసారి బెంగళూరు నుంచి తాడేపల్లికి రావడం, ప్రెస్మీట్ పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోవడం, ఆయన కింద ఉండే నేతలు దానికి వంతపాడటం అలవాటుగా మారింది. ప్రజాస్వామ్యంలో మంచి పనులు చేస్తే అభినందించాలి, లోపాలుంటే నిలదీయాలి. కానీ ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ప్రతిష్టను బజారున పడేసేలా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తుండటం అత్యంత బాధాకరం. ఈ కుట్రపూరిత ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరారు.
మాజీ సైనికుడిపై వైసీపీ, సాక్షి గూండాయిజం
దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి జాతిని రక్షించిన ఒక మాజీ సైనికుడిపై వైసీపీ నాయకులు, సాక్షి మీడియా ప్రతినిధులు సాగించిన దౌర్జన్యం అత్యంత హేయమైన చర్య. రాజకీయ దురుద్దేశంతో సైనికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే స్థాయికి వైఎస్సార్సీపీ దిగజారిపోయిందని మండిపడ్డారు. యావత్ దేశం సెల్యూట్ చేసే సైనిక సమాజానికి చెందిన చక్రపాణి రెడ్డి అనే మాజీ జవాన్పై ఇంతటి దాష్టీకానికి పాల్పడటం క్షమించరాని నేరం. చక్రపాణి రెడ్డి నిబంధనల ప్రకారం ఎక్స్-సర్వీస్మెన్, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్ కోటాలో అత్యంత పారదర్శకంగా టీచర్ ఉద్యోగం సాధించారు. ఆయనకు వచ్చిన మెడల్స్, సర్టిఫికెట్లు అన్నీ పక్కాగా ఉన్నాయి. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో సాక్షి మీడియా ప్రతినిధులు కుప్పంలో చక్రపాణి రెడ్డి వద్దకు వెళ్లి, “నువ్వు సైనికుడివే కాదు.. నీ సర్టిఫికెట్లు దొంగవి” అంటూ బెదిరింపులకు దిగి దౌర్జన్యం చేయడం దుర్మార్గం.
సర్టిఫికెట్లపై అనుమానాలు ఉంటే పోలీసులకో, జిల్లా కలెక్టర్కో ఫిర్యాదు చేయాలి తప్ప, విచారణ చేయడానికి సాక్షి టీవీ, వైసీపీ నేతలేమైనా దర్యాప్తు అధికారులా? అధికారం పోయినా ఇంకా గూండాయిజం చేస్తామంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. మాజీ సైనికుడిపై దాడికి దిగి, బెదిరింపులకు పాల్పడిన వైసీపీ శ్రేణులు, సాక్షి ప్రతినిధులపై కఠిన సెక్షన్లతో నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. వారిపై రౌడీషీట్లు తెరిచి, పీడీ యాక్ట్ కింద జైలుకు పంపాలని ఒక శాసనసభ్యుడిగా డిమాండ్ చేస్తున్నాను. తమ ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, నేడు కూటమి ప్రభుత్వం వేలాది ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక విషం చిమ్ముతున్నారు. ఇకనైనా వైఎస్సార్సీపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకుని, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను, యువత భవిష్యత్తును నాశనం చేసే నీచ రాజకీయాలు మానుకోవాలని కోటంరెడ్డి హితవు పలికారు.
అబద్ధాల బండారం బట్టబయలు
మెగా డీఎస్సీ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుంటే ఓర్వలేని వైసీపీ, సాక్షి మీడియా పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. వాస్తవాలతో ఏమాత్రం సంబంధం లేకుండా నిరాధార ఆరోపణలతో రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వేముల రామకృష్ణ అనే అభ్యర్థి తప్పుడు సర్టిఫికెట్లతో అక్రమ మార్గంలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సాధించారంటూ వైసీపీ, సాక్షి మీడియా దుష్ప్రచారం చేశాయి. తీరా ఆ రామకృష్ణ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడించడంతో బండారం బయటపడింది. తాను పరీక్ష రాసిన మాట వాస్తవమే అయినా, సరిగ్గా ప్రిపేర్ కాకపోవడంతో అర్హత సాధించలేదని, తనకు అసలు ప్రభుత్వ ఉద్యోగమే రాలేదని రామకృష్ణ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రైవేట్ టీచర్ ఉద్యోగం చేసుకుంటూ మళ్లీ ప్రిపేర్ అవుతున్నానని చెప్పారు. తాను ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నట్లు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమని ఆయన సవాల్ విసరడం వైసీపీ నిరాధార ఆరోపణలకు చెంపపెట్టు. నిరుద్యోగులకు ఉపాధి దక్కకూడదనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే మెగా డీఎస్సీ జరగకుండా హైకోర్టులో ఏకంగా 335 కేసులు వేయించారు. అయితే న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేయడమే కాకుండా పిటిషనర్లకు తీవ్రస్థాయిలో చివాట్లు పెట్టింది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలనుకునే గోబెల్స్ సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు. కానీ నేడు సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాల ద్వారా సమాచారం క్షణాల్లో ప్రజలకు చేరుతోందని, ప్రజల్లో చైతన్యం పెరిగిందని గుర్తుంచుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆధారాలు, వాస్తవాలతో హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రజలు ఆయన ప్రెస్మీట్లు, అవాస్తవ ప్రకటనలు చూసి నవ్వుకుంటున్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మిగిలిన ఆ 11 సీట్లు కూడా దక్కకుండా చేస్తారని కోటంరెడ్డి హెచ్చరించారు.
ఒక్కసారి ప్రెస్మీట్ పెడితే లక్ష ఓట్లు గల్లంతు
జగన్మోహన్ రెడ్డి తన హోదాకు తగినట్లు హుందాగా, వాస్తవాలతో మాట్లాడటం నేర్చుకోవాలని, లేనిపక్షంలో వైసీపీకి మిగిలిన ఆ కాస్త ఆదరణ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. మెగా డీఎస్సీపై బురదజల్లే యత్నాల్లో భాగంగా చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవాలని ఆధారాలతో సహా ఆయన బట్టబయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి ఒక ప్రెస్మీట్ పెడితే చాలు.. పార్టీకి కనీసం ఒక లక్ష ఓట్లు నష్టం జరుగుతోందని వైసీపీ నాయకులే స్వయంగా అంతర్గతంగా వాపోతున్నారు. గతంలో ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో, హితవు కోరి చెబుతున్నానని, ఇప్పటికైనా అసత్యాలు మాట్లాడటం మానుకోవాలని కోటంరెడ్డి సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని డీఎస్సీల ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలు అందబోతున్నాయని, వైసీపీ చేస్తున్న తప్పుడు, విష ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దని కోటంరెడ్డి పిలుపునిచ్చారు.













