- రోగుల అవసరాలకు తగ్గట్టు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు
- పరికరాలు, మిషన్ల కొనుగోలు, సరఫరాకు నిర్ధిష్ట క్యాలెండర్
- ఆసుపత్రుల భవన నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలి
- వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి ఆదేశం
- సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి, రోగులకు మందులు అందుబాటులో ఉంచడంలో ఎటువంటి ఇబ్బందిలేని విధంగా కొత్త వ్యవస్థను రూపొందించాలని మంత్రి తెలిపారు. ఇందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో ప్రజారోగ్య శాఖ సంచాలకులతోపాటు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సీనియర్ అధికారి, రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎపిఎంఎసఐడిసి) అధికారి (డ్రగ్స్ విభాగం), ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులతో కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సాయంత్రం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందులు, సర్జికల్స్, పరికరాల కొనుగోలు విధానం, పంపిణీ తీరు, ఆసుపత్రుల నిర్మాణాల పురోగతి, ఇతర అంశాలపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ఇతర అధికారులతో సుదీర్ఘంగా సుమారు 4 గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు ఏపీఎంఎసఐడీసీ ద్వారా ప్రభుత్వాసుపత్రులకు జరిగే మందుల కొనుగోలు, సదరు ఆసుపత్రుల ద్వారా స్థానికంగా జరిగే మందుల కొనుగోలు (లోకల్ పర్చేజ్), పంపిణీ, ఇతర అంశాలగురించి మంత్రికి వివరించారు. ఆసుపత్రుల నుంచి వచ్చే డిమాండ్ల అనుసరించి త్రైమాసిక (క్వార్టర్లీ) విధానంలో మందులను పంపుతున్నామని అధికారులు తెలిపారు. అనంతరం మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ ప్రస్తుత విధానంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.
అన్ని కోణాలనుంచి అధ్యయనం జరగాలి
ఆసుపత్రులకు రోగులు ఎంత మంది వస్తున్నారు? ఓపీ, ఐపీ ఎలా ఉంటుంది?, మందుల అవసరం ఎలా ఉంది,? డిమాండ్లను ఎలా ప్రస్తుతం పంపుతున్నారు? అన్ని ఆసుపత్రులనుంచి వచ్చే డిమాండ్లను ఏవిధంగా క్రోడీకరిస్తున్నారు? మందుల కంపెనీలకు ఎలా ఆర్డర్లు ఇస్తున్నారు? ఎంత సమయంలో ఆసుపత్రులకు చేరుతున్నాయి? జాప్యం జరిగితే ఆసుపత్రుల మెడికల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డిమాండుకు తగ్గట్టు మందుల సరఫరా జరుగుతోందా? లేదా? మందుల అవసరాల డేటాలో ఎంతవరకు కచ్చితత్వం ఉంటుంది? ఎక్కడెక్కడ లోపాలున్నాయి? వాటిని ఎలా మెరుగుపరచాలి? తమిళనాడులో ఎలాంటి ప్రమాణాలు అనుసరిస్తున్నారు? అక్కడి ఉత్తమ విధానాలపై కమిటీ అధ్యయనం చేయాలి. ఇతర అంశాలపై లోతుగా, క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రెండు వారాల్లో ప్రభుత్వానికి కమిటీ రిపోర్టు ఇవ్వాలి” అని మంత్రి స్పష్టం చేశారు.
పరికరాల కొనుగోలుకు క్యాలండర్ రూపొందించాలి
ఆసుపత్రులనుంచి పరికరాలు, మిషన్ల కోసం ఏపీఎంఎసఐడీసీకి వచ్చే ఇండెంట్ల విధానంలోనూ మార్పులు రావాలన్నారు. ఆసుపత్రుల సూపరింటెండెంట్ల నుంచి వచ్చే పరికరాల కొనుగోలు ఇండెంట్లు, సరఫరా నిర్ధిష్ట సమయంలో జరిగేలా ప్రత్యేకంగా క్యాలండర్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. దీనివల్ల టెండర్లను పలుమార్లు పిలిచే అవకాశం తలెత్తదని, సుహృద్భావ వాతావరణంలో పోటీ ఏర్పడి ధరలు తగ్గే అవకాశం ఉందని మంత్రి సత్యకుమార్ సూచించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా త్వరలో ప్రారంభించనున్న ‘క్రిటికల్ కేర’ బ్లాక్ల నిర్మాణాల పురోగతి, సన్నాహక ఏర్పాట్లను మంత్రి అధికారులతో చర్చించారు. పూర్తయిన 9 క్రిటికల్ బ్లాక్ల నిర్మాణాలను, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీలను కూడా కేంద్ర మంత్రి ఏకకాలంలో ప్రారంభిస్తారని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. సమీక్షా సమావేశంలో ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ రూ.44 కోట్లతో చేపట్టిన 150 ఆయుష్ డిస్పెన్సరీల పునర్నిర్మాణాలు, నూతన భవన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయని మంత్రికి వివరించారు. అలాగే 6 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాల (రూ.90 కోట్ల వ్యయం)కు అవసరమైన స్థల సేకరణ, రూ.210 కోట్లతో మూడు జూ.ఆయుష్ కళాశాల ఏర్పాటు చర్యలను మంత్రికి వివరించారు. విశాఖలోని ఆయుష్ శాఖకు చెందిన ల్యాబరేటరీ నిర్మాణం పూర్తయిందన్నారు. ‘ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద’ ఏర్పాటుకు అవసరమైన ఆమోదంపై కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న సంప్రదింపులపైనా మంత్రి అధికారులతో చర్చించారు.
పిహెచ్సీ, సిహెచ్సి, ఇతర నిర్మాణాల పురోగతిపై ఆరా
గడిచిన రెండేళ్లలో జాతీయ ఆరోగ్య మిషన్, పీఎం అభిమ్, 15వ ఆర్ధిక సంఘంకింద రూ.1,450 కోట్లతో చేపట్టిన 100 పీహెచ్సీలు, తొమ్మిది సీహెచ్సీలు, సుమారు 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవన నిర్మాణాల పురోగతి, 20 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాల పురోగతిని మంత్రి సమీక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులను ఆదేశించారు. అలాగే, పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాల పురోగతిని మంత్రి సమీక్షిస్తూ త్వరగా పనులు పూర్తిచేసి, వినియోగంలోకి తేవాలన్నారు. అదేవిధంగా 11 పూర్వ వైద్య కళాశాలల్లో జరుగుతోన్న రకరకాల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలన్నారు. విద్యార్థుల సౌకర్యాలు పరిగణనలోనికి తీసుకుని పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్కు అక్రిడిటేషన్ తెప్పించాలి
తిరుపతి, విశాఖలో రూ.45 కోట్లతో అత్యాధునిక పరికరాలు/ మెషిన్లతో సిద్ధమైన స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీలు రాబోయే మూడునెలల్లో ఎనఎబీఎల్ అక్రిడిటేషన్ తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ఈ రెండు లేబరేటరీల్లో నియామకాలు పూర్తయ్యాయన్నారు. తిరుమలలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్, విశాఖలో ల్యాబ్లో నమూనాల పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపిన 78 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, 72 ఇతర పోస్టుల (కొత్తవి) భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందాలని తెలిపారు. ఇవికాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన 278 శాంక్షన్డ్ పోస్టుల్లో సుమారు 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని కూడా త్వరితగతిన భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. విశాఖ, గుంటూరు తిరుమల, తిరుపతి, కర్నూలు స్టేట్ ఫుడ్ ల్యాబుల్లో ఈ నియామకాలు జరిగేందుకు ప్రత్యేకంగా చొరవ చూపాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబును ఆదేశించారు.
















