- పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు జగన్?
- జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలోనే పెద్ద దస్తగిరి హత్య
- రవీంద్రనాథ్ రెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలి
- రాయలసీమకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి జగన్
- 2019-24 మధ్య సీమకు నీళ్లు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
- టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
కడప పట్టణంలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్యను మాఫీ చేసే కుట్రలు జరుగుతున్నాయని… వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత రెండు వారాల క్రితం కడప పట్టణంలో వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరిని హత్య చేశారు. హత్యను పరిశీలిస్తే రాష్ట్రంలో కొన్నేళ్లుగా వైసీపీ సాగించిన దమనకాండ, మరణాకాండ, హత్యకాండల కోణంలోనే ఈ హత్య కూడా జరిగింది. 2019 లో వివేకా హత్యను జగన్ గుండెపోటు అని అనంతరం కదిరి నుంచి గొడ్డలి తెచ్చి గొడ్డలి పోటు చేశారు. నేడు పెద్ద దస్తగిరి హత్యను మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గంజాయ్ బ్యాచ్ హత్య చేసిందని… అనుమానాస్పద హత్య అన్నట్టు సాక్షిలో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. పెద్ద దస్తగిరి హత్య వెనకాల వైసీపీ పెద్ద పెద్ద తలకాయాలు ఉన్నాయి. కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కడప డిప్యూటీ మాజీ మేయర్ నిత్యానంద రెడ్డిలు పెద్ద పెద్ద భూ దాందాలు చేశారు.
నిత్యానందరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి బినామీ. పెద్ద దస్తగిరి పేరున వందల కోట్లు బీనామీ ఆస్తులను పెట్టారు. ఆ లావాదేవీల వ్యవహారంలోనే పెద్ద దస్తగిరి హత్య జరిగింది. రవీంద్రనాథ్ రెడ్డి, నిత్యానందరెడ్డిలు పెద్ద దస్తగిరి హత్యపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. పార్టీలో మరే ఇతరులు చనిపోతే చీమల దండులా వాలిపోయే వైసీపీ నేతలు… ఇప్పుడు ఒఖ వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరిని అత్యంత పాశవికంగా హత్య చేస్తే పులివెందులలోనే ఉన్న జగన్ ఎందుకు పరామర్శకు పోవడం లేదు. ఇప్పటివరకు హత్యను ఖండించడం లేదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేస్తే సానుభూతి ప్రదర్శించిన జగన్… పెద్ద దస్తగిరి హత్యపై ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలి. వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలయ్యాడు. దీనికి అంతటికి మూలం రవీంద్రనాథ్ రెడ్డి, నిత్యానంద రెడ్డిల ఆస్తుల గొడవే. రవీంద్రనాథ్ రెడ్డికి ఫ్యాక్టరీలు లేవు, గనులు లేవు, కానీ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులపై ప్రభుత్వం నిగ్గు తేల్చాలి.
ఎన్జీటీ అనుమతి లేకున్నా లిఫ్ట్ పేరుతో రూ.900 కోట్లు స్వాహా:
రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని… ఎన్డీయే కూటమి నిధులు ఇవ్వడంలేదు, నీళ్ల కోసం ఖర్చు చేయడం లేదని రాయలసీమకు చెందిన వైసీపీ నాయకులు గత నెల రోజులుగా సమావేశాలు, సమీక్షలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో హడావుడి చేస్తున్నారు. వైసీపీ కుహనా మేధావులకు ఒక్కటే ప్రశ్న.. 2019 -24 మధ్య రాయలసీమకు జగన్ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించండి. మీకు దమ్ముంటే రాయలసీమకు ఏం చేశారో చెప్పి మాట్లాడండి. రూ.3,885 కోట్లతో 2020 మేలో లిఫ్ట్ కు అనుమతులు ఇస్తే 2020 జూలైలో టెండర్లు పిలిచారు. ప్రాజెక్టు నిర్మించే సమయంలో పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ జగన్ ఆ పని చేయకుండానే టెండర్లు పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీకి కట్టబెట్టాడు. తెలంగాణలో జగన్ ఆప్తులైన కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ జగన్ తో మాట్లాడి ప్రాజెక్టు కట్టినట్టు ఉండాలి కానీ కట్టకూడదని సూచించాడు. కేసీఆర్ ఆదేశాలతోనే గవినోల శ్రీనివాస్ అనే బీఆర్ఎస్ కార్యకర్త చెన్నైలో ఉన్న నేషనల్ గ్రీన్ ట్యూబునల్ లో కేసు వేశారు.
రాయలసీమ లిఫ్ట్ కు అనుమతులు లేవని ప్రాజెక్టుపై స్టే ఇచ్చింది. అయినా కూడా కాసుల కక్కుర్తితో జగన్, పెద్దిరెడ్డి రూ.900 కోట్లకు బిల్లులు డ్రా చేసుకున్నారు. ఇదే విధంగా కొనసాగిస్తే మీ ఇంజినీరింగ్ చీఫ్, సీఎస్లను అరెస్ట్ చేస్తామని ఎన్జీటీ హెచ్చరించింది. జగన్ హయాంలోనే పనులు నిలిపివేస్తే… నేడు టీడీపీ పనులు నిలిపివేసిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాయలసీమను సస్యశామలం చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు 11-08-2023లో రాయలసీమ లిఫ్ట్ అనేది కేవలం చెన్నైకి తాగునీటి కోసమే అంటూ జీఓలు ఇచ్చారు. రాయలసీమకు తాగునీటి అవసరాల కోసం కాదు చెన్నైకి తాగునీటి అవసరాల కోసం రూ.3,885 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సమక్షంలో అన్న ఎన్టీఆర్ తమిళనాడు సీఎం ఎంజీ రామచంద్రన్ చేత ఒప్పందం చేయించుకొని తెలుగు గంగ నీటి తరలింపునకు నిధులు విడుదల చేయించుకున్నారు. జగన్ తన హయంలో ఎన్ని కోట్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి వసూలు చేశారో డేటా తీయమని డిమాండ్ చేస్తున్నాను. జగన్ తప్పుడు విధానాలకు ఎన్జీటీ 22-03-2024లో రూ.2.65 కోట్ల జరిమానా విధించింది. 2021 నుంచి ఎన్జీటీ పోర్టర్ లో ఒక్క పేపర్ కూడా అప్లోడ్ చేయలేదు. ఇక్కడే రాయలసీమ లిఫ్ట్ పై వైసీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. పర్యావరణ అనుమతులు లేకపోతే దేశంలో ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్లదు. పరివేష్ పోర్టల్లో ఎన్జీటీ క్లియరెన్స్ కోసం నాలుగేళ్లు ఎందుకు దరఖాస్తు చేయలేదో జగన్ సమాధానం చెప్పాలి.
కేవలం డబ్బుల కోసం చిత్తశుద్ధి లేకుండా రాయలసీమ లిఫ్ట్ పేరుతో డ్రామా ఆడారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక 18-02-2025లో పరివేష్ పోర్టల్ను యాక్టివేట్ చేసి పత్రాలను అప్ లోడ్ చేశాం. ఆ ప్రక్రియ జరుగుతుంది. ఇంత జరుగుతుంటే సభలు సమావేశాలు పెట్టి డ్రామాలు ఆడుతున్నారు. ఎన్జీటీలో ఇంత పెద్ద కేసు ఉంటే రూ.10 లేదా రూ.20 లక్షలు ఖర్చు చేసి పెద్ద లాయర్ల చేత ట్రైబ్యునల్ లో వాదనలు వినిపించారా జగన్ రెడ్డి. మీ కేసులు, మీ ప్రత్యర్థుల కేసులు, వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు రూ.కోట్లు ఖర్చు చేసి లాయర్లను పెట్టిన జగన్… ఎందుకు రాయలసీమ లిప్ట్ పై ఒక్క సమగ్రమైన లాయర్ ను కూడా పెట్టలేదు. గుడ్డి గుర్రానికి పళ్లు తోమేందుకు వైసీపీ నేతలు వెళ్లారా? వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణానికి మేం జీఓలు ఇస్తే… జగన్ రెడ్డి రాగానే రద్దుచేశాడు. దాదాపు 102 సాగునీటి ప్రాజెక్టుల పనులను జగన్ రెడ్డి జీఓ 356 ద్వారా రద్దు చేశాడు. రాయలసీమకు తీరని ద్రోహం చేసిన ద్రోహి జగన్. గతంలో ఎన్టీఆర్ హయాంలో హంద్రీనీవా, గాలేరు నగరిని ప్రారంభిస్తే గతంలో వైఎస్ఆర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకునే కుట్రలకు తెరతీశారు. 2019-24 మధ్య కాలంలో ఒక ఆయకట్టుకు అయినా అధనంగా నీరు ఇచ్చినట్టు నిరూపిస్తే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నాను. ఈ సవాల్ ను స్వీకరించే దమ్ము వైసీపీ నాయకులు ఉందా? దమ్ముంటే జగన్ రెడ్డి రాయలసీమకు ఏం చేశాడో చెప్పలేని వైసీపీ దద్దమ్మలను గ్రామాల్లో తిరగనీయకుండా తరిమి తరిమి కొట్టాలి, అని రాంగోపాల్ రెడ్డి కొరారు.















