- కార్యకర్తే అధినేత అని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదిక
- స్త్రీశక్తి నినాదంతో నవశకానికి నాంది పలికే మహానాడు
- రెండేళ్ల విజయాలను ప్రజల ముందుంచుతాం
- అభివృద్ధి విఘాత రాజకీయాలను ఎండగడతాం
- పసుపు జెండాతో రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం
- వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్య రథం): తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే ఆత్మీయ రాజకీయ పండుగ మహానాడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్న మహోన్నత సిద్ధాంతాన్ని దేశానికి చాటి చెప్పిన చారిత్రాత్మక వేదిక మహానాడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల సాధికారతకు అండగా నిలిచిందని, ఈసారి “స్త్రీశక్తి” నినాదంతో మహానాడు నిర్వహించడం గర్వకారణమన్నారు. మహిళా శక్తి, యువశక్తి, రైతు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో మహానాడు-2026 కొత్త దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసిన పార్టీ తెలుగుదేశమేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మహిళల అభ్యున్నతే రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది అని పార్టీ ఎప్పటినుంచో నమ్ముతోందన్నారు. మహానాడు-2026 కేవలం పార్టీ సమావేశం కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్కు దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక వేదిక అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా నడిపించే సంకల్పానికి ఇది తొలి మెట్టు అవుతుందన్నారు. రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పించడం, పెట్టుబడులు తీసుకురావడం, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం మహానాడు ప్రధాన ధ్యేయాల్లో ఒకటన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను మహానాడు వేదికగా ప్రజల ముందుంచుతామని మంత్రి తెలిపారు. అలాగే రాబోయే మూడేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అనుసరించే దశ, దిశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తోందనే స్పష్టమైన సంకేతాన్ని మహానాడు ద్వారా రాష్ట్రానికి అందిస్తామని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాలకు ప్రభుత్వం ఏం చేయబోతుందనే దానిపై స్పష్టమైన కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే గొడ్డలి పార్టీ విధ్వంసక రాజకీయాలను మహానాడు వేదికగా ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మంత్రి ఘాటుగా విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడం, పెట్టుబడులను తరిమేయడం, యువత భవిష్యత్తును చీకటిలో నెట్టడం గత పాలకుల అసలు స్వరూపమని మండిపడ్డారు.
మహానాడు-2026ను మహోత్సవంలా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అపార ఉత్సాహంతో సిద్ధమయ్యారని మంత్రి తెలిపారు. ఇప్పటికే గ్రామగ్రామాన పసుపు జెండా రెపరెపలాడుతోందని చెప్పారు. నేడు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కేంద్రాలకు వేలాదిగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మహానాడు అంటే కేవలం సభ కాదు… అది తెలుగు జాతి గర్వం… కార్యకర్త ఆత్మవిశ్వాసం… భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు బంగారు బాట వేసే మహాసంకల్పం అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.















