అమరావతి (చైతన్య రథం): ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. విశాఖపట్నానికి చెందిన తహసీల్దార్ రమణయ్య గత ఏడాది ఫిబ్రవరి 2న హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎన్నికల ముందు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ హత్యకు గురైన రమణయ్య భార్య అనూషను డిప్యూటీ తహసీల్దార్గా నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రమణయ్య భార్య అనూషకు కారుణ్య నియామకంలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్గా నియమించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృషి చేశారు. తమను ఆదుకుని, న్యాయం చేసినందుకు మంత్రి అచ్చెన్నాయుడుకు, ప్రభుత్వానికి డిప్యూటీ తహసీల్దార్ అనూష కృతజ్ఞతలు తెలిపారు.