- డీఎస్సీపై ఆరోపణలు చేసి పారిపోవడం కాదు… వాస్తవాలు ఉంటే ధైర్యంగా చర్చకు రండి
- స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలుపొందాలి
- చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
- నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్
నర్సరావుపేట (చైతన్యరథం): 2019లో బాబాయినికిరాతకంగా చంపేసి చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్తచరిత్ర అని అవినీతి విష పుత్రిక సాక్షి పేపర్లో రాశారు. అదేమని అడిగితే చిన్నపిల్లాడు. తెలియక చంపేశాడని తన తమ్ముడిని సమర్థించడం జగన్ రెడ్డికే చెల్లుతుందని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. బుధవారం జరిగిన నర్సరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతలలో ఒక చెన్నారెడ్డి అనే వ్యక్తి చనిపోతే ఏపీలో జంగిల్ రాజ్ అని జగన్ ట్వీట్ చేశారు. జగన్ చెన్నారెడ్డి తండ్రి భాస్కర్రెడ్డికి ఫోన్ చేసి బ్రహ్మారెడ్డి చంపాడు కదా అంటే గొడ్డలి పార్టీ కార్యకర్తలే తన బిడ్డను చంపారని చెప్పాడు. బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి, ఆ నెపాన్ని మనపై వేసే ప్రబుద్ధుడు జగన్. తెలుగుదేశం పార్టీకి తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ వంటి అనుబంధ విభాగాలు ఉన్నాయి. గొడ్డలి పార్టీకి గంజాయి, బూతులు, మహిళలను అవమానించే అనుబంధ విభాగాలు వున్నాయి. తెలుగుదేశం పార్టీలో రెండో తరం, మూడో తరం వచ్చింది. వైసీపీలో భూ కబ్జాలు, హిట్ అండ్ రన్, భార్యను వేధించే నాయకులు వచ్చారు. గొడ్డలి పార్టీ అరాచకాలన్నింటినీ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది. వైసీపీ దుష్ప్రచారాలను టీడీపీ కేడర్ సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని లోకేష్ పిలుపునిచ్చారు.
పార్టీ కోసం పనిచేస్తే పదవులు వెదుక్కుంటూ వస్తాయి
పల్నాడుకు ముఖద్వారం, పౌరుషాల పురిటిగడ్డ నర్సరావుపేట. ఎంతో మంది గొప్ప నాయకులను తయారుచేసిన నేల నర్సరావుపేట. ఏపీ తొలి స్పీకర్ వెంకట్రామయ్య చౌదరి. ఉమ్మడి రాష్ట్ర 3వ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పనిచేసిన రాష్ట్ర విభజన తర్వాత తొలి స్పీకర్గా ‘పల్నాడు పులి’ కోడెల శివప్రసాద్ వంటి నేతలను అందించిన ఈ నేల అభివృద్ధికి కారణం తెలుగుదేశం పార్టీయే. టీడీపీ ఆవిర్భావానికి ముందు పల్నాడు అంటే ఫ్యాక్షనిజం అనే పేరుండేది. కోడెల ఎమ్మెల్యే అయ్యాక ఫ్యాక్షన్కు ఫుల్ స్టాప్ పెట్టారు. అభివృద్ధి చేసి చూపించారు. 2019లో ఓడిపోయినా అరవిందబాబు
కార్యకర్తలకు అండగా నిలబడి తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీ, ఎమ్మెల్యే అద్భుతంగా కలసికట్టుగా ముందుకు సాగుతున్నారు. టీడీపీలో వర్గాలు ఉండవు. తెలుగుదేశం అనే ఒకే ఒక వర్గం మాత్రమే ఉంటుంది. వర్గాల పేరుతో కావాలని కొందరు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. నేను ఈరోజు రాష్ట్ర మంత్రిగా మీ ముందు నిలబడటానికి కారణం తెలుగుదేశం. కార్యకర్తలు నాతో లేకపోతే నేను ఎవరు? పనిచేసే కార్యకర్తలను గుర్తించే బాధ్యత నాది. 2025 మహానాడులో నా మనసుకు దగ్గరైన శాసనం కార్యకర్తే అధినేత. పార్టీ ఆవిర్భావం రోజున కార్యకర్తలను అధినేత పక్కన కూర్చోబెట్టాం. మంత్రులంతా కింద కూర్చున్నారు. పార్టీ కోసం మీరు పనిచేస్తే ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు, పదవులు వెదుక్కుంటూ మీ వద్దకే వస్తాయి.
డీఎస్సీ ఆరోపణల్లో నిజం ఉంటే నిలబడి నిరూపించాలి
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. 150 కేసులు వేసినా 150 రోజుల్లో విజయవంతంగా మెగా డీఎస్సీ నిర్వహించి 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. రాబోయే రోజుల్లో మరో మూడు డీఎస్సీలు ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీచేసే బాధ్యత నాది. డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్ తో చర్చకు నేను రెడీ. ఆరోపణలు చేసి పారిపోవడం కాదు, వారి ఆరోపణల్లో వాస్తవాలు ఉంటే ధైర్యంగా నిలబడి నిరూపించాలి. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు భర్తీ చేసే బాధ్యతను కూడా నేను తీసుకుంటా. లక్షలాది యువత కలలను నెరవేరుస్తా. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి నేను చెప్పాల్సిన పనిలేదు.
కార్యకర్తలకు ఉచితంగా మందులు అందిస్తాం
కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ టీడీపీ. తెలుగుదేశం పార్టీ కోటి మంది సభ్యులు గల అతి పెద్ద కుటుంబం. సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుందాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బూత్ కీలకమైనదే. మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే కార్యకర్తలను గుర్తించి, నామినేటెడ్ పదవులు ఇస్తాం. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేయండి. చేసిన పనిని మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేయండి. క్లస్టర్, యూనిట్ నాయకులకు కేంద్ర కార్యాలయంలో ట్రైనింగ్ ఇచ్చాం. శిక్షణకు వచ్చిన వారికి రక్తపరీక్షలు చేయిస్తే, 75 శాతం మందికి వివిధ వ్యాధులు ఉన్నాయి. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తాం. జీవితాంతం వారికి మందులు అందించే బాధ్యత నాది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలు అందరిపైనా ఉంది.
బీసీలకు తీరని ద్రోహం చేసిన జగన్
జగన్ సీఎం అయ్యాక స్థానిక సంస్థల్లో బీసీలకు 10శాతం రిజర్వేషన్ తగ్గించి 17వేల పదవులకు దూరం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్లో తీర్మానం చేశాం. వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి వాటిని కూడా అడ్డుకోవాలని చూస్తున్నారు. 2019-24 నడుమ బీసీ బిడ్డలను వైసీపీ నేతలు అతి కిరాతకంగా చంపేశారు. తన అక్క ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ను కిరోసిన్ పోసి తగులబెట్టారు. తోట చంద్రయ్య, నందం సుబ్బయ్యలను దారుణంగా హతమార్చారు. మాజీ మంత్రి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. అప్పలరాజు మరో వ్యక్తిని ప్రవేశపెట్టాడు. చనిపోయింది యాదవ సామాజికవర్గ వ్యక్తి. కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. జగన్ బడా చోర్ అయితే… కారుమూరు నాగేశ్వరరావు చోటా చోర్. మద్యం రవాణాలో అక్రమ సొమ్ము కోడలు ఖాతాలో జమ చేశాడు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన్ను జైలుకు పంపితే మనపై నెపం వేస్తున్నారు. వైసీపీ దుష్ప్రచారాలపై కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి.
స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలి
మరో నెలరోజుల్లో రానున్న మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో గెలుపొందాలి. ప్రస్తుతం మనం జనసేన, బీజేపీలతో కలిసి ముందుకు వెళ్తున్నాం. 2029లోనే కాదు మరో మూడు సార్లు కూడా కూటమిగానే కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లి గెలుస్తాం. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుందాం. నో మిస్ ఫైర్, నో క్లాస్ ఫైర్. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో నేతృత్వాన డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమం, జీతాలు, పెన్షన్లకు కేంద్రం సహకారం ఉంది. కార్యకర్తలు ఇగో, అహంకారాలకు దూరంగా ఉండాలి. ప్రజలతో కనెక్ట్ కావాల్సిన బాధ్యత కేడర్పై ఉంది. ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలి. ప్రతి గడపా తొక్కాలి. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలే ప్రసక్తే లేదు
కొందరు రెడ్బుక్ అంటే
భయపడుతున్నారు. ఇది కార్యకర్తలకు ఇచ్చిన హామీ కాదు. యువగళంలో సుమారు వంద మీటింగ్లో ఈ విషయాన్ని చెప్పా. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదని లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. నర్సరావుపేట ఐటీఐకి స్టాఫ్ కావాలని ఎంపీ కృష్ణదేవరాయలు కోరాగా నూటికి నూరు శాతం ఇస్తామన్నారు. నర్సరావుపేటకు యూనివర్సిటీ అడిగారని, ఈ విషయమై సీఎంతో మాట్లాడాల న్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ… లోకేష్ చొరవ వల్లే రాష్ట్రానికి గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయి. జేఎన్టీయూ కళాశాలలో రూ.70కోట్లతో హాస్టల్ భవనాలను ప్రారంభించారు. నర్సరావుపేట జేఎన్టీయూని యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
సమావేశంలో పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్లమెంటరీ అధ్యక్షుడు జానీ సైదా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్, జోనల్ కో-ఆర్డినేటర్ బీటీ నాయుడు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ కోవెలమూడి నాని తదితరులు పాల్గొన్నారు.















