- రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తుంటే వైసీపీ ఓర్వలేకుంది
- కార్పొరేటర్గానూ గెలవలేని సజ్జలకు అమరావతిపై మాట్లాడే అర్హత లేదు
- కత్తులు గొడ్డళ్ల సంస్కృతి తప్ప జగన్, సజ్జలకు వేరే ఏమీ తెలీదు..
- నిలకడలేని రాజకీయాలకు కేరాఫ్ వైసీపీ..
- దౌర్భాగ్యపు రాజకీయాలకు.. వైసీపీ నేతలే తలలు పట్టుకుంటున్నారు
- ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ ధ్వజం
మంగళగిరి (చైతన్య రథం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజలందరి పూర్తి మద్దతుతో, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ స్పష్టం చేశారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను, ‘సూపర్ సిక్స’ హామీలను నెరవేరుస్తూ, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని ఆయన తెలిపారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఊహించిన దానికన్నా ఎక్కువ నిధులు, బడ్జెట్, ప్రతిష్టాత్మక సంస్థలను సాధించి ఏపీని అభివృద్ధిలో నెంబర్ వన్గా నిలుపుతుంటే వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ అనే మూతపడే దుకాణానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక గుమస్తా లాంటివాడు. కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేని సజ్జల, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అసలు ఆయనకు అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది? అని రాకేష్ ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రజలందరికీ నడిబొడ్డున, అత్యంత సౌలభ్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే అమరావతిని మహా రాజధానిగా ఎంపిక చేయడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. కేవలం సెక్రటేరియట్ మాత్రమే కాకుండా శాసనసభ, హైకోర్టు, జుడిషియల్ భవనాలు, కేంద్ర ప్రభుత్వ కాంప్లెక్స్లు, అంతర్జాతీయ విద్యాసంస్థలు అమరావతిలో కేంద్రీకృతం అవుతుంటే వైసీపీ నేతలు మళ్లీ బురదజల్లే ప్రయత్నాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. నాడు అసెంబ్లీలో అమరావతికి 30 వేల ఎకరాలు ఉండాలని మద్దతు తెలిపిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత మూడు రాజధానులంటూ డబుల్ గేమ్ ఆడారు.
పోనీ ఆ మూడు రాజధానులకైనా ఐదేళ్లలో ఏమైనా చేశారా అంటే అదీ లేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి కొత్త రాగాలు అందుకుంటున్నారు. కత్తి, కొడవలి, గన్, గొడ్డలి సంస్కృతి తప్ప జగన్కు, ఆయన గుమస్తా సజ్జలకు వేరే ప్రపంచం తెలియదని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినాయకత్వానికి అసలు దిశా-నిర్దేశం లేదని, ఉదయం ఒక మాట, రాత్రికి ఒక మాట మారుస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ దౌర్భాగ్యపు రాజకీయాలు చూసి ఆ పార్టీలోని నాయకులే ‘ఏంట్రా బాబు మాకు ఈ కర్మ’ అని తలలు పట్టుకుంటున్నారని డూండి రాకేష్ అన్నారు. ఏపీకి పెట్టుబడులు రావడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం జగన్ రెడ్డికి ఇష్టం లేదా అని ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ, ప్రజా నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తుందని.. అమరావతిపై విషం కక్కే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ పార్టీ నాయకులు పూటకో మాట, నిలకడలేని రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు వైస్సార్సీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకైనా అర్థమవుతోందా? ఇందాక ఒకాయన రాజధానిని దొనకొండలో పెడదాం అంటాడు, మళ్లీ విజయవాడ అయితే బాగుంటుంది అంటాడు. రేపు పొద్దున వచ్చి తాడేపల్లి అయితేనే మా ఇల్లు సేఫ్ అంటారేమో! అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే ఉందా అంటూ వితండవాదాలు చేస్తున్నారు.
పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక స్టాండ్, రాత్రికి మరో స్టాండ్ మార్చే వీరికి అసలు ఒక విధానం అంటూ ఉందా? రాత్రి కలలో ఏది వస్తే ఉదయాన్నే దాన్ని ప్రజలపై రుద్దడం ఏంటి? అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడి కంపెనీలు, పెద్ద పెద్ద విద్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు వచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరుగుతుంటే, వీరు పొద్దున్న లేచింది మొదలు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం, యువతకు ఉద్యోగాలు రావడం, వ్యాపారాలు వృద్ధి చెంది ప్రజలు సంపాదించుకోవడం వీరికి ఇష్టం లేదా? రాష్ట్ర ప్రగతిని చూసి ఎందుకు ఏడుస్తున్నారు? అమరావతిలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి.. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అప్పుడు వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, ఎందుకు కమిషన్ వేయలేదు? ఎందుకు విచారణ జరిపించి కేసులు పెట్టలేదు, అరెస్టులు చేయలేదు? అప్పుడు చేతగాక కూర్చొని, ఇప్పుడు మళ్లీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో వైస్సార్సీపీ నాయకులు చేసిన ఘనకార్యాలు ఏంటో అందరికీ తెలుసు. అక్కడ అప్పటికే వేసిన రోడ్లను సైతం తవ్వేశారు. రాజధాని పనుల కోసం తెచ్చి ఉంచిన గ్రావెల్ను (మట్టిని) దొంగతనం చేశారు. చివరికి అమరావతి వీధుల్లో వేసిన కరెంట్ స్తంభాలను, కరెంట్ తీగలను సైతం వదలకుండా దొంగిలించుకుపోయిన దౌర్భాగ్య చరిత్ర వైస్సార్సీపీ నాయకులది. ఇలాంటి వారు ఈరోజు రాజధాని అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
అన్నింటికంటే ఘోరం ఏంటంటే.. రాజధాని కోసం నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు మీరు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న అమరావతి ఆడబిడ్డలను, రైతులను నడిరోడ్డుపై పొట్టల్లో తన్నారు. మన ఇంటి ఆడబిడ్డలని కూడా చూడకుండా వారి జుట్టు పట్టుకుని రోడ్లపై లాకెళ్లిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది కాదా? అంతలా మహిళలను హింసించి, కన్నీరు పెట్టించిన పాపం మీది. ఇంతటి దారుణాలకు, దౌర్జన్యాలకు పాల్పడిన వైస్సార్సీపీ నాయకులు.. ఈరోజు మళ్లీ అమరావతి గురించి నీతులు మాట్లాడటం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి, అండ్ కో పూర్తిగా దివాలా తీయడానికి రెడీగా ఉంది. అందుకే గత ఎన్నికల్లో ప్రజలందరూ కలిసి వారిని తరిమి కొట్టారు. ప్రజలు ఇచ్చిన ఆ తీర్పు కంటే అద్భుతమైన తీర్పు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 80 శాతానికి పైగా ప్రజలు కూటమి ప్రభుత్వంపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని గానీ, ఆయన కింద పనిచేసే పేటీఎం బ్యాచ్ను గానీ, ఆ గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డిని గానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కేవలం అమరావతిపై విషం కక్కడానికి తప్ప వీరు దేనికీ పనికిరారనే సంగతి అందరికీ అర్థమైపోయింది. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాలో ఒక అద్భుతమైన పదం వాడాడు.. అమరావతిలో భూమి కుంగిపోతుందంట! ఎక్కడి నుంచి ఎక్కడికి కుంగిందయ్యా నీ బాధ ఏంటీ? కాసేపేమో హైదరాబాద్ 10 ఏళ్లు కామన్ రాజధానిగా ఉంటే బాగుండు అంటారు.. ఇంకోసారేమో భూమి కుంగింది, నీళ్లు వచ్చేసాయి, రోడ్డు ఊగుతోంది అంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. అసలు వీళ్ల బాధ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏదో ఒక రకమైన అబద్ధాలు ప్రచారం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవడమే జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిల అసలు అజెండా అని ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. రాష్ట్రం బాగుపడుతుంటే వీరు తట్టుకోలేకపోతున్నారు. వీరు ఆడుతున్న నాటకాలను ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా.. ఈసారి ప్రజలే స్వయంగా చేతిలోకి బెత్తం పట్టుకుని వైస్సార్సీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే ఎవరినీ ప్రజలు వదిలిపెట్టరని డూండి రాకేష్ హెచ్చరించారు.
















