అమరావతి (చైతన్య రథం): ఏపీ పంచాయతీరాజ్ శాఖను ఐదు జాతీయ అవార్డులు వరించాయి. రెండు విభాగాల్లో ప్రథమ, ఒక విభాగంలో ద్వితీయ, మరో రెండింట తృతీయ పురస్కారాలు లభించాయి. రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్, జల్ సంచయ్- జన్ భాగీదారిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలిచింది. వైకాపా హయాంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ పంచాయతీరాజ్ శాఖ.. నేడు దేశంలోనే తొలిస్థానానికి చేరింది. జాతీయస్థాయి అవార్డులు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని బలంగా విశ్వసించే ప్రభుత్వంగా పల్లెల్లో వెలుగులు నింపుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. సుపరిపాలన, పేదరిక నిర్మూలన -జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, ఉత్తమ మండలం, మహిళా స్నేహపూర్వక పంచాయతీవంటి ఐదు అంశాల్లో వచ్చిన అవార్డులు 21 నెలల సుపరిపాలనకు అద్దం పడుతున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అత్యుత్తమ విధానాలు, సంస్కరణలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ముందుకు నడిపిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, ఆ శాఖ అధికారులకు, ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలిపారు. గ్రామ స్వరాజ్య స్థాపనలో మరెన్నో విజయాలు అందుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.














