- కార్యకర్తలను దూరంగా ఉంచే నేతలకు నేనూ దూరం
- కార్యకర్తలకు ఆర్థిక సాధికారత కల్పించే బాధ్యత నాది
- కష్టపడే కార్యకర్తలను గుర్తించే బాధ్యత లోకేష్దే
- పార్టీ ఆవిర్భావంనుంచీ ప్రతీ అడుగూ సంచలనమే…
- ప్రతీ నిర్ణయమూ ప్రజాక్షేమమే
- గతం, వర్తమానమే కాదు… భవిష్యత్తూ టీడీపీదే
- ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించాలి
- 44వ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం చంద్రబాబు
- కొత్తలుక్తో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
- వేదికపైన కార్యకర్తలు… వేదికకింద నేతలు
- ‘కార్యకర్తే అధినేత’ నినాదానికి అద్దంపట్టిన వైనం
అమరావతి (చైతన్య రథం): పార్టీ కోసం పని చేసే వాళ్లకే పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంతే కాకుండా… పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్లకు ప్రజా ప్రతినిధులుగా అవకాశమిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు. ఓవైపు 50 శాతం సీట్లు పెరిగేలా డి-లిమిటేషన్ ప్రక్రియ వేగవంతం కానుండడం, మరోవైపు మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్న క్రమంలో సీఎం చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవాన కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కార్యకర్తలను పట్టించుకోని నేతలు తనకు అక్కర్లేదంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ఈసారి 50 శాతం సీట్లు పెరుగనున్నాయి. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయి. పార్టీకోసం ఎవరు బాగా పని చేస్తే వారే ప్రజాప్రతినిధులవుతారు. క్రమశిక్షణతో పని చేయండి… పార్టీని బలోపేతం చేయండి.. కష్టపడే కార్యకర్తలను, నేతలను గుర్తించే బాధ్యత లోకేష్దే. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత ప్రవర్తన మొదలుకుని ప్రతి అంశంలో తెలుగుదేశం బ్రాండ్ నిలిపేలా వ్యవహరించాలి. ప్రజలతో మమేకం కావాలి… సమస్యలు పరిష్కరించాలి. అభివృద్ధి వైకుఠంపాళి కాకూడదు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే… రాష్ట్రం బలంగా ఉంటుంది. పార్టీ గెలుపే రాష్ట్రం గెలుపు.
పసుపు జెండా నిరంతరం ఎగరాలి. రాష్ట్రం ఎప్పుడూ గెలవాలి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుగు దేశం పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్దాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమే. నాడు కేంద్రంలో ఉన్న ఇందిర ప్రభుత్వం ఒత్తిడితో రాష్ట్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే… ప్రజలే రోడ్డెక్కి ఉద్యమించారు. ఇదొక రికార్డు. టీడీపీ ప్రభుత్వాలు ఏపీలో సంక్షేమానికి నాంది పలికాయి. అభివృద్దికి బాటలు వేశాయి. 40 ఏళ్ల క్రితం టీడీపీ తెచ్చిన రూ.2కే కిలో బియ్యం జాతీయ ఆహార భద్రతా పథకమైంది. అప్పుడు తెచ్చిన మహిళలకు ఆస్తి హక్కు తరువాత కేంద్రం చట్టం చేసింది. మహిళలకునాడు స్థానిక ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్… దశాబ్దాల తరువాత 33 శాతం రిజర్వేషన్కు అడుగులు పడడానికి కారణమైంది. మన ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు.. ఆ తర్వాత ఎన్నో రాష్ట్రాలకు రోల్ మోడల్ అయ్యాయి. మహిళా సాధికారతకు తెచ్చిన డ్వాక్రా సంఘాలు దేశంలోనే రోల్ మోడల్గా నిలిచాయి. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాం. ఎస్సీలకు వర్గీకరణతో సమన్యాయం చేశాం. ఎస్టీలకు భూములు, పథకాలు ఇచ్చి జీవితాలు మార్చాం. మైనారిటీల కోసం కార్పొరేషన్ తీసుకొచ్చాం. వారి జీవన ప్రమాణాలు పెంచాం” అని సీఎం చంద్రబాబు వివరించారు.
విజయాలు చూశాం… సంక్షోభాలూ చూశాం
“తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు.. సంక్షోభాలను, సవాళ్లను చూసింది. ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు కోల్పోయారు. నిద్రలేని రాత్రులు గడిపారు. టీడీపీని ఫినిష్ చేస్తామని ఆలోచన చేసిన వారే ఫినిష్ అయ్యారు. ఇందిర హయాంలో ఎన్టీఆర్ను గద్దె దించి కుట్రలు పన్నారు… అలిపిరిలో నాపై హత్యాయత్నం చేశారు. 2004 తరువాత టీడీపీ కార్యకర్తల, నేతల ప్రాణాలు తీశారు. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల పిల్లలను దత్తత తీసుకుని ఎన్టీఆర్ స్కూల్ ఏర్పాటు చేసి చదివించాం. గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేష్ యువగళం పాదయాత్ర చేపడితే అడ్డుకున్నారు. కార్యకర్తల అండతో అడుగు ముందుకే వేశాడు. 2019-24 మధ్య కాలంలో నన్ను కూడా జైల్లో పెట్టారు. ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి ఈ అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు, కష్టం వల్లనే వచ్చింది. కార్యకర్తల సంక్షేమం కోసం ట్రస్ట్ ద్వారా వేల మందికి ఉచిత విద్యను అందిస్తున్నాం. పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. కష్టపడిన వాళ్ళను కాపాడుకుంటాం… పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తాం. చంద్రయ్య చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుని… కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.
కార్యకర్తే అధినేత..
“పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలు, మంత్రులైన వాళ్ళు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్దాంతాలకు, విధానాలను, క్రమ శిక్షణకు కట్టుబడి ఉండాలి. పార్టీ కార్యకర్తల వల్లనే మనం ఇక్కడ ఉన్నాం అని గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలను పట్టించుకోని వాళ్ళను, ఇబ్బంది పెట్టే నాయకులు మాకు అవసరం లేదు. 2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేనతో పొత్తుకు పెట్టుకున్నాం. రికార్డు బద్దలు కొట్టేలా విజయం సాధించాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా…కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా పాలన అందిస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం. దేశంలోనే ఎవరూ ఇవ్వని స్థాయిలో సామాజిక పెన్షన్లు ఇస్తున్నాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి, మత్య్సకారుల సేవలో, అన్నదాత సుఖీభవ ఇచ్చాం. డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ చేశాం… తాజాగా 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. చెప్పినట్టుగా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెస్తున్నాం… ఇప్పటికే 6.28 లక్షల ఉద్యోగవకాశాలు కల్పించాం. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చాం… చెప్పినట్టుగా ఒక్క పైసా కూడా పెంచలేదు. ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం. ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం.. భవిష్యత్ లోనూ పెంచబోం. పోలవరాన్ని పూర్తి చేస్తాం… అమరావతిలో మొదట ప్రారంభించిన పనులు 2028 ఆగస్టుకు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాం. అమరావతి దేవతల రాజధాని కాబట్టి కొందరు రాక్షసులకు ఇష్టం లేదు. ఫ్యూచర్ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నాం. ఇక మూడు ముక్కలాట లేదు.. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని.. అదే అమరావతి” అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
పొలిటికల్ గవర్నెన్సులో రాజకీయ పొరపాట్లకు తావులేదు
“తెలుగుదేశం పార్టీ అభివృద్ధి రాజకీయాలు చేస్తోంది. వైసీపీ తప్పుడు ప్రచారాలను పార్టీ తిప్పికొట్టాలి… నిత్యం ప్రజల్లో ఉండాలి… చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ వివరించాలి. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలవాలి. నాయకత్వం పెంపు కోసం నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ టీడీపీనే. కార్యకర్తలకు రాజకీయ సాధికారత కల్పిస్తాం… అన్ని పదవుల్లోనూ జనాభా దామాషా పద్దతిన అవకాశాలు కల్పిస్తాం. కార్యకర్తలకు ఆర్థిక సాధికారత కల్పిస్తాం. న్యాయ బద్ధమైన సంపాదన వచ్చేలా సహకరిస్తాం” అని సీఎం స్పష్టం చేశారు. ప్రసంగం చివర్లో జై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటూ సీఎం చంద్రబాబు జైకొట్టారు. పార్టీ బలోపేతం కోసం పని చేస్తానంటూ కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేశారు.
44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో మారిన పంథా
ఆవిర్భావ దినోత్సవం ఆసాంతం ఫ్రెష్ లుక్తో, కొత్త తరహలో సాగింది. పార్టీ కోసం పనిచేసిన వారికి, సీనియర్ కార్యకర్తలకు, యువనేతలకు పెద్ద పీట వేస్తూ ఆవిర్భావ సభ సాగింది. సభా వేదిక మీద కార్యకర్తలను… సభికుల్లో సీనియర్ నేతలను కూర్చొబెట్టి ఆవిర్భావ సభ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారికి, పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి, గత ప్రభుత్వంలో వేధింపులు అనుభవించిన వారికి గుర్తింపునిచ్చేలా టీడీపీ ఆవిర్భావ సభ జరిగింది. పార్టీ కోసం బాగా పని చేసిన 19 మంది సామాన్య కార్యకర్తలను సభా వేదిక మీద కూర్చొబెట్టారు. ఇక సభా నిర్వహణ బాధ్యతలను కావలి గ్రీష్మకు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ… పార్టీ కోసం తాము పని చేసిన విధానాన్ని భావోద్వేగంతో వివరించారు. కార్యకర్తే అధినేత అనే నినాదం నూటికి నూటి పాళ్లు అమలు చేసే పార్టీ టీడీపీనే అంటూ కార్యకర్తల కితాబు ఇచ్చారు. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబుతో అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్య యాదవ్, తెలంగాణ సీనియర్ బక్కని నర్శింహులు మాట్లాడారు. అండమాన్ నికోబార్ దీవుల్లో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను మాణిక్య యాదవ్ వివరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలను చూసేందుకు అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించాలని కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయం ముందు భారీ టీడీపీ జెండాను సీఎం ఎగరేశారు. జెండావిష్కరణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సహా ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, లోకేష్ పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన నేతలను… కార్యకర్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్యాయంగా పలకరించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య ఘట్టాలతో వీడియో ప్రజెంట్ చేశారు.













