విశాఖపట్నం (చైతన్యరథం): ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని జెలెస్ట్రా పవర్ సీఈఓ పరాగ్ శర్మను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. శనివారం విశాఖలో పరాగ్ శర్మతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరాగ్ వర్మ మాట్లాడుతూ… హర్యానాలోని గురుగావ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ… వర్టికల్ ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలపర్గా, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ గా ఉందని చెప్పారు. యుటిలిటీ స్కేల్ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి, కన్స్ట్రక్షన్, కమర్షియలైజేషన్ రంగాల్లో తాము సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 579 మిలియన్ పౌండ్ల వార్షికాదాయం కలిగిన తమ సంస్థ 7 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… సోలార్ ప్యానల్స్, విండ్ టర్బైన్ భాగాలు, బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థల కోసం ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. విడిభాగాల ఎగుమతికి సౌలభ్యంగా ఉండేలా పోర్టు సమీపంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్లో 1057 కి.మీ.ల సువిశాల తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, రైల్వే కనెక్టివిటీ అందుబాటులో ఉందని, మరో ఏడాదిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.













