- 6వేల ఎకరాలు భూములిస్తాం
- రాయలసీమలో ఇప్పటికే కియా కార్లు, స్పేస్, డ్రోన్ సిటీలు… ఇప్పుడు రేమాండ్స్
- వివిధ ప్రాజెక్ట్ల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- రూ.1201 కోట్ల పెట్టుబడులతో రేమాండ్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన
- శ్రీసిటీలో 5 కంపెనీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి
- శ్రీసిటీలో ఏర్పాటు చేసే 12 కంపెనీలతో సీఎం సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం
విశాఖపట్నం (చైతన్యరథం): శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే శ్రీసిటీని అభివృద్ధికి మోడల్గా తీర్చిదిద్దుతామని వెల్లడిరచారు. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజైన శనివారం నాడు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీసిటీలో ఏర్పాటైన 5 కంపెనీలను ప్రారంభించారు. దీంతోపాటే… శ్రీసిటీలో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…భారత దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక టౌన్ షిప్ శ్రీసిటీ అన్నారు. శ్రీసిటీి నుంచే డైకెన్, ఇసుజూ, క్యాడ్బరీ లాంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన పరిశ్రమలు శ్రీసిటీ పారిశ్రామిక టౌన్ షిప్కు రావాలి. ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు చెందిన హెల్త్ కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ డివైసెస్ కంపెనీలకు రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులిచ్చాం.
గడచిన రెండు రోజులుగా రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా గడచిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. త్వరలోనే శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తాం. 50 దేశాలకు పైగా కంపెనీలు శ్రీసిటీ నుంచి పనిచేస్తాయి. 1.50 లక్షల మంది ఉద్యోగులతో శ్రీసిటీ అభివృద్ధికి మోడల్ గా మారుతుంది. శ్రీసిటీ సమీపంలోనే ఎయిర్ స్ట్రిప్ నిర్మించే దిశగా ఆలోచన చేస్తున్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శ్రీసిటీ తరహా మోడల్స్ మరిన్ని రావాల్సి ఉంది. ఒక సంస్థ తయారు చేసిన ఉత్పత్తులు మరో సంస్థకు ముడిసరుకుగా మారతాయి. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం దేశంలోనే తొలిసారిగా ఏపీ ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తోంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు భారీ ప్రణాళికలు వేస్తున్నాం. 2028 నాటికి శ్రీ సిటినీ ఓ బెస్ట్ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
త్వరలోనే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి
రాయలసీమలో ఇప్పటికే చాలా పరిశ్రమలు వచ్చాయి. 2014-2019 మధ్యకాలంలోనే కియా కార్ల ఫ్యాక్టరీని తెచ్చాం. ఇక రాయలసీమ ప్రాంతంలోనే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నాం. ఏరోస్పేస్, డిఫెన్సు కారిడార్లు వస్తున్నాయి. ఇప్పుడు అనంతపురం జిల్లాకు రేమాండ్స్ సంస్థ వచ్చింది.. పెట్టబుడులు పెడుతోంది. కియా దగ్గర్లోనే ఆటో కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంటును రేమాండ్స్ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే 3-4 ఏళ్లలోనే చేరుకుంటాం. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. 2027 నాటికి ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తామని రేమాండ్ హామీ ఇచ్చింది. మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. విమానాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వాటి ఉత్పత్తి కూడా మరింత పెరగాలి. రేమాండ్ గ్రూప్ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా ఉత్పత్తులు తయారు చేయటం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు.
ఏపీలో వేగంగా అనుమతులు … పాలసీలు బాగున్నాయి
రేమాండ్ సంస్థకు చెందిన మూడు కంపెనీల శంకుస్థానల కార్యక్రమంలో పాల్గొన్న రేమాండ్స్ గ్రూప్ ఎండీ గౌతమ్ మైనీ మాట్లాడుతూ… ఏపీలో పరిశ్రమలకు వేగంగా అనుమతులు వస్తున్నాయన్నారు. అలాగే వివిధ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీలు బాగున్నాయని గౌతమ్ మైనీ కితాబిచ్చారు. ఏపీ అభివృద్ధిలో భాగంగా తాము ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్ రంగాల్లో అడుగు పెట్టామన్నారు. తాము 25 ఏళ్ల నుంచి ఎయిరో స్పేస్ రంగంలో ఉన్నామని.. డిఫెన్స్ రంగంలో కూడా బలోపేతం అయ్యేలా తమ గ్రూప్ ప్రణాళికాబద్దంగా పని చేస్తుందని గౌతమ్ వివరించారు. భాగస్వామ్య సదస్సు వేదికగా జరిగిన ఈ కార్యక్రమాల్లో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ కె.విజయానంద్, రేమాండ్స్ గ్రూప్ కార్పోరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రేమాండ్స్ గ్రూప్ పెట్టుబడులు… శ్రీ సిటీలో మరిన్ని కంపెనీలకు ఎంఓయూలు
రేమాండ్స్ గ్రూప్ రాష్ట్రంలో రూ.1201 కోట్ల పెట్టుబడితో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. సిల్వర్ స్పార్క్ అపారెల్ పార్క్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఈ సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్, గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, టెకులోడు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఇక శ్రీసిటీలో మొత్తంగా 12 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2320 కోట్ల విలువైన పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. శ్రీసిటీలో ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా ఉత్పత్తుల ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఎంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది.













