- రూ.15వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్
- సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం
- అనకాపల్లి జిల్లాలో టాయ్పార్క్ ఏర్పాటు చేయనున్న పాల్స్ ప్లష్ సంస్థ
- రామాయపట్నం పోర్టువద్ద ఫర్నిచర్ క్లస్టర్ సిటీకి ఆసక్తి చూపిన స్వీడన్ సంస్థ
విశాఖపట్నం (చైతన్య రథం): 4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్రంగంలో పెట్టుబడులకు హీరో ప్యూచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15 వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీఎం సమక్షంలో ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ -ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సీఎండీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ, హైబ్రీడ్ సొల్యూషన్స్ రంగాల్లోనూ పెట్టుబడులతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. డెడికేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు రామాయపట్నం వద్ద అత్యాధునిక ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు స్వీడన్ కు చెందిన జూల్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఫౌండర్ సీఈఓ టామ్ ఓలాండర్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రూ.300 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనున్నామని జూల్ సంస్థ తెలిపింది.
నార్వే, స్వీడన్ల నుంచి భారీ దుంగలను దిగుమతి చేసుకుని డోర్లు, విండోలు లాంటి ఉత్పత్తులతో పాటు ప్రీ ఫాబ్రికేషన్ విధానంలో ఇళ్లను కూడా రూపొందిస్తామని జూల్ సీఈఓ టామ్ ఓలాండర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టు సమీపంలో 500 ఎకరాల్లో ఫర్నిచర్ క్లస్టర్ సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అమరావతి నగరంతో పాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని సీఎం వెల్లడిరచారు. అనంతరం ప్రముఖ ఆటబొమ్మల తయారీ సంస్థ పాల్స్ ప్లష్ టాయ్స్ సంస్థ అధ్యక్షుడు అజయ్ సిన్హా ముఖ్యమంత్రిని కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద టాయ్ పార్క్ ఏర్పాటుపై చర్చించారు. చైనా తరహాలో ఆట బొమ్మల తయారీకి సంబంధించిన ఎకోసిస్టంను తయారు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం బొమ్మల తయారీలో స్థానికంగా ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలని సీఎం ఆ సంస్థ ప్రతినిధుల్ని కోరారు.














