- అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం
- నౌకాదళ కార్యకలాపాలకు సంపూర్ణ సహకారం
- వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాతో సీఎం చంద్రబాబు
విశాఖపట్నం (చైతన్య రథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండిరగ్ ఇన్ ఛీప్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ భల్లా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ముఖ్యమంత్రి వివరించారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం, నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తూర్పు నావికా దళం నిర్వహించే ఫ్లీడ్ రివ్యూలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… విశాఖ అనేక అవకాశాలకు, ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రం కాబోతుందని అన్నారు.
విశాఖ భవిష్యత్ నగరంగా మారుతోందని… దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, నావీ కలసి పనిచేయాలని అన్నారు. విశాఖ నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా కానుందని… ఇదే సమయంలో విశాఖను అత్యుత్తమ టూరిజం సెంటర్గా కూడా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. దీనికి తూర్పు నావికాదళం సహకారాన్ని అందించాలని సీఎం కోరారు. నావీ అంటే కేవలం ఫైటింగ్ ఫోర్స్ మాత్రమే కాదని… నావికా దళ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నావీ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఏపీలో రక్షణ రంగంలో చేరేందుకు యువత చూపుతున్న ఆసక్తి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నావీ చేపట్టే వివిధ ప్రాజెక్టులకు, కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం చంద్రబాబు వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు తెలిపారు.















