- మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లుగా అభివృద్ధి
- పెట్టుబడుల సదస్సుకంటే ముందే పరిశ్రమలకు శంకుస్థాపనలు
- 12వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు
- రూ. 1,01,899 కోట్లు పెట్టుబడులు..
- 85870 ఉద్యోగాలకు ఎస్ఐబీపీలో ఆమోదం
- 16నెలల్లో రూ. 8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05870 ఉద్యోగాలకు గ్రీన్సిగ్నల్
అమరావతి (చైతన్య రథం): పెట్టుబడులతో ముందుకొచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు… అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు.. విద్యుత్ లభ్యత ఉండేలా చూడాలని సీఎం సూచించారు. శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపీబీ ఆమోదించింది. వీటిద్వారా రూ.1,01,899 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 85,570 ఉద్యోగాలు దక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన 16 నెలల్లో జరిగిన 12 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా మొత్తంగా రూ.8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05,870 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…
‘‘రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యత. పెట్టుబడిదారులనుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధాకాకుండా తక్షణం ఆమోదం తెలియచేయాలి. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమలనుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలి. క్షేత్రస్థాయిలో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను త్వరితగతిన వచ్చేలా శ్రద్ధపెట్టాలి. గత పాలకులు భూమి కేటాయించినా.. ఇప్పటికీ ప్రారంభంకాని ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో సమీక్షించాలి. ఏ ప్రాజెక్టులైనా నిర్మాణ పురోగతి లేకపోతే అనుమతులు రద్దుచేయాలి. ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. చిప్, సెమీకండక్టర్లు, డ్రోన్వంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి.
రాష్ట్రంలో సుమారు 15 పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసుకుని… క్లస్టర్వారీ విధానంతో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వివిధరంగాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలిస్తుంది. ఇలాంటివాటిని గుర్తించి ప్రమోట్ చేయాలి. కేంద్రమిచ్చే ప్రోత్సాహకాలు కొంచెం ఆలస్యమైనా… రాష్ట్ర ప్రభుత్వంవైపు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పెట్టుబడులు చేజారకుండా చూడాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వమిచ్చే ప్రోత్సాహకాలపై సంప్రదింపులు జరుపుదాం. పారిశ్రామిక అవసరాల నిమిత్తం… పరిశ్రమలకు విద్యుత్ సరఫరా విషయంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించాలి. ఇక ప్రభుత్వం కూడా పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేసుకోవాలి. అలాగే ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు తమ భూములను పరిశ్రమలకు, కంపెనీలకు ఇవ్వడానికి ముందుకొస్తే.. అలాంటి వారిని ప్రోత్సహించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
మెగా సిటీలు… మాస్టర్ ప్లాన్లు
‘‘రాష్ట్రంలో మూడు మెగా సిటీలు అభివృద్ధి చేయాలి. అనకాపల్లినుంచి విజయనగరం వరకు విశాఖను మెగా సిటీగా అభివృద్ధి చేయాలి. అలాగే తిరుపతి, అమరావతి నగరాలను కూడా మెగా సిటీలు చేయాలి. ఇప్పటికే అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉంది. విశాఖ, తిరుపతి మెగా సిటీలకు కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మెగా సిటీలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా చూడాలి. ఈమేరకు టూరిజం, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు సమన్వయం చేసుకుని మెగా సిటీలు అభివృద్ధి జరిగేలా చూడాలి. అలాగే వీటికి టౌన్ షిప్స్ ఇంటిగ్రేషన్ జరగాలి. నివాసయోగ్యమైన నగరాలుగా తీర్చిదిద్దాలి. గూగుల్ డేటా సెంటర్వల్ల విశాఖకు మరిన్ని కంపెనీలు, పరిశ్రమలు రానున్నాయి. భవిష్యత్తులో విశాఖకు వచ్చే కంపెనీలకు భూలభ్యత ఉండేలా చూసుకోవాలి. టూరిజం అభివృద్ధికి ఆతిధ్య రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన హోటళ్లు నిర్మించేలా చూడాలి. రాష్ట్రంలో మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయి. దీనికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంది. ఈమేరకు మూడు కారిడార్లకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తాం. బీచ్ టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి’’ అని సీఎం చంద్రబాబు సూచించారు.
పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించాలి
ఈనెల, 14, 15 తేదీల్లో విశాఖ పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎస్ఐపీబీ ఆమోదించిన పరిశ్రమల్లో వేగంగా శంకుస్థాపనలు జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. తనతోపాటు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు ఆయా జిల్లాల్లో పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక ఇటీవల తాను జరిపిన విదేశీ పర్యటనల్లో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులను భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించానని.. వారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారని.. అలాగే భాగస్వామ్య సదస్సుకు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు. విశాఖలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు భారీఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
12వ ఎస్ఐపీబీలో ఆమోదించిన పెట్టుబడుల వివరాలు
1. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్స్ లిమిటెడ్ -రూ.202 కోట్లు -436 మందికి ఉద్యోగాలు.
2. ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ -రూ.700 కోట్లు -1,000మందికి ఉద్యోగాలు.
3. ఎన్పీఎస్పీఎల్ అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ -రూ.2,081 కోట్లు -600మందికి ఉద్యోగాలు
4. క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్ -రూ.1,154 కోట్లు -1500మందికి ఉద్యోగాలు
5. ఎస్సీఐసీ వెంచర్స్ ఎల్ఎల్పీ -రూ.550 కోట్లు -1130మందికి ఉద్యోగాలు.
6. ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ -రూ.22,976 కోట్లు -1241మందికి ఉద్యోగాలు.
7. ఫ్లూయింట్గ్రిడ్ లిమిటెడ్ -రూ.150 కోట్లు -2,000మందికి ఉద్యోగాలు
8. మథర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ -రూ.110 కోట్లు -700మందికి ఉద్యోగాలు
9. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ -రూ.115 కోట్లు -2000 మందికి ఉద్యోగాలు
10. కె.రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ -రూ.2,172 కోట్లు -9,681మందికి ఉద్యోగాలు
11. విశాఖ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ -రూ.2,200 కోట్లు -30వేలమందికి ఉద్యోగాలు
12. ఐ స్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ -రూ.119 కోట్లు -2,000మందికి ఉద్యోగాలు
13. ఎస్ఏఈఎల్ సోలార్ పీ12 ప్రైవేట్ లిమిటెడ్ -రూ.1728 కోట్లు -860మందికి ఉద్యోగాలు
14. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ -రూ.7972 కోట్లు -2,700మందికి ఉద్యోగాలు
15. మైరా బే వ్యూ రిసార్ట్స్ -రూ.157 కోట్లు -980మందికి ఉద్యోగాలు.
16. విశ్వనాథ్ స్పోర్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ -రూ.51 కోట్లు -750మందికి ఉద్యోగాలు
17. సుగ్నా స్పాంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ -రూ.1247 కోట్లు -1,100 మందికి ఉద్యోగాలు
18. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ -రూ.8570 కోట్లు -1000మందికి ఉద్యోగాలు
19. వాల్ట్సన్ ల్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1682 కోట్లు -415 మందికి ఉద్యోగాలు
20. ఏఎమ్జీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ -రూ.44,000 కోట్లు -3000 మందికి ఉద్యోగాలు
21. వాసంగ్ ఎంటర్ ప్రైజెస్ -రూ.898 కోట్లు -17,645మందికి ఉద్యోగాలు
22. బిర్లాను లిమిటెడ్ -రూ.240 కోట్లు -588మందికి ఉద్యోగాలు
23. సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ -రూ.1,090 కోట్లు -1250మందికి ఉద్యోగాలు
24. భారత్ డైనమిక్స్ -రూ.489 కోట్లు -500మందికి ఉద్యోగాలు
25. డాజ్కో ప్రైవేట్ లిమిటెడ్ -రూ.1234 కోట్లు -1454మందికి ఉద్యోగాలు
26. శ్రీవేదా ఇన్నోవేషన్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ -రూ.12 కోట్లు -1500 మందికి ఉద్యోగాలు











