- ప్రతిభకు తగిన బహుమానం ప్రకటించిన సీఎం
- మహిళా క్రికెటర్కు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం
- ఇంటి నిర్మాణం కోసం కడపలో 1000 చ.గ. స్థలం
- గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి
- చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీచరణి
- పుష్పగుచ్చంతో హార్దిక స్వాగతం పలికిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతోపాటు ఇంటి నిర్మాణానికి కడపలో 1000 చ.గ. స్థలం కేటాయిస్తున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్`1 అధికారిగా ఉద్యోగం కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి నారా లోకేష్ను క్రికెటర్ శ్రీచరణి మర్యాద పూర్వకంగా కలిశారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో శ్రీచరణి పంచుకున్నారు. తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రీచరణిని అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తాచాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు.
భవిష్యత్లో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని అభిలషించారు. ఈ సందర్భంగా శ్రీచరణి మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీ షర్ట్ను ముఖ్యమంత్రికి అందించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీచరణి బృందం భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీచరణితోపాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఉన్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టులో శ్రీచరణికి ఘన స్వాగతం పలికిన మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు… ఆమెతోపాటు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ శ్రీచరణికి హార్దిక స్వాగతం పలికారు.












