- కోనసీమ జిల్లాలో భారీ బాణసంచా పేలుడు
- పేలుడుధాటికి ఛిత్రమైన తయారీ కేంద్రం
- పలువురికి గాయాలు, ఆస్పత్రిపాలు
- శిధిలాలకింద కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానం
- ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
- వైద్య, సహాయక చర్యలకు తక్షణ ఆదేశాలు
- సహాయక చర్యలను పర్యవేక్షించిన హోంమంత్రి అనిత
- బాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ
- ప్రగాఢ సానుభూతి ప్రకటించిన డిప్యూటీ సీఎం, మంత్రులు
రాయవరం (చైతన్య రథం): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు
మహిళలున్నట్టు అధికారులు గుర్తించారు. బాణసంచా పరిశ్రమ యజమాని సత్తిబాబు కూడా ఉన్నట్టు సమాచారం. మరికొందరికి గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రయివేట్ ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక
సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో 40మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. భారీ పేలుడు
ధాటికి బాణసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని సమాచారం. ఘటనాస్థలిని రామచంద్రపురం ఆర్డీవో
అఖిల పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పందించారు. వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు,
రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలున్నట్టు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అగ్నిప్రమాద నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో పలువురు చనిపోవడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయకచర్యలు, వైద్యసాయంపై వివరాలను అధికారులనుంచి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో ఆమె మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, కొలుసు పార్థసారథి, దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతులు, క్షతగాత్రులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తూనే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అధికారులతో మంత్రులు ఫోన్లో మాట్లాడి సహాయ చర్యల పురోగతిని తెలుసుకున్నారు. భద్రతా నింబంధనలు అమలుపై దృష్టి పెట్టాలని, ఇటువంటి ఘటనలు పునరావృతతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీపావళి సమయంలో బాణాసంచా తయారీ కేంద్రాల్లో, సంబంధిత గోదాముల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుందని హామీనిచ్చారు.