- దేశ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి క్లియరెన్స్
- రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్
- రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు 11వ ఎస్ఐపీబీ ఆమోదం
- 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగావకాశాలు
- మెగా ప్రాజెక్టులకు ప్రత్యేకాధికార్లను నియమించాలని నిర్ణయం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రాజెక్టులకు ఓకే చెప్పిన ఎస్ఐపీబీ
- 11 ఎస్ఐపీబీల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు క్లియరెన్స్
- రాష్ట్రంలో 6.2 లక్షల ఉద్యోకావకాశాల సృష్టికి అవకాశం
అమరావతి (చైతన్య రథం): పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. రూ.87,520 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ ప్రాజెక్టుకు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 11వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలిపింది. విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లివద్ద మూడు క్యాంపస్లలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు అనుసంధానంగా ఈ క్యాంపస్లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దాదాపు 3 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఎస్ఐపీబీ సమావేశం.. ఇంధన రంగంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరో స్పేస్, ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ రంగాలు సహా.. పర్యాటకానికి ఊతమిచ్చేలా ఆతిథ్యరంగానికి చెందిన ప్రాజెక్టులకు ఆమోదాన్ని తెలిపింది. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ద్వారా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏపీకి సాధించటంపై ఐటీ మంత్రి నారా లోకేష్కు ముఖ్యమంత్రి, మంత్రులు అభినందనలు తెలిపారు. క్వాంటం వ్యాలీ తరహాలోనే డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్ మారతాయన్నారు. కేవలం 15నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డేటా సెంటర్లతో ఎకో సిస్టం వస్తోందని.. విశాఖ నగరం తదుపరిస్థాయి ఏఐ సిటీగా మారుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. విద్యుత్ తక్కువ ధరకు అందిస్తే ఐటీ రంగానికి మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ జరిగిన 11 ఎస్ఐపీబీల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 6.2 లక్షలమందికి నేరుగా ఉద్యోగాలు దక్కనున్నాయి.
ప్రాంతాలవారీ పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి
క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనామిక్ కారిడార్ తరహాలోనే రాయలసీమకూ ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. ఆ మేరకు మూడు ప్రాంతాలనూ పారిశ్రామిక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ విశాఖ ఎకనామిక్ రీజియన్ ను ఏర్పాటు చేస్తున్నామని, అదే తరహాలో అమరావతి కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరినుంచి ప్రకాశం వరకూ ఒక ఆర్ధిక ప్రగతి రీజియన్ న్ను, నెల్లూరు, రాయలసీమ జిల్లాలతో మరో ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్లను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలతోపాటు ఆటోమొబైల్ కారిడార్లు అభివృద్ధి అవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. వీటితోపాటు ఉద్యాన పంటలకు కేంద్రంగావున్న రాయలసీమ ఆగ్రో ప్రాసెసింగ్ హబ్ మారుతోందని త్వరలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేంద్రంగా ఈ ప్రాంతం మారుతుందన్నారు.
అమరావతి రాజధాని నగరం క్వాంటం వ్యాలీతో నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా మారుతుందని సీఎం పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లును కూడా అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా తయారు చేయాలని.. దీనికోసం ల్యాండ్ బ్యాంక్ను సిద్ధం చేసుకుని ప్రాజెక్టులను ఆహ్వానించాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు వచ్చినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక ప్రాజెక్టులను రైల్వేలైన్కు కూడా అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గి ఆయా ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుందని సీఎం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విలువ జోడింపుపైనా దృష్టి పెట్టాలన్నారు. అలాగే ఆతిథ్య రంగానికి చెందిన ప్రాజెక్టులపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పర్యాటకులకు నాణ్యమైన వసతి లభించేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వివిధ కేటగిరీల హోటళ్లకు అనుబంధంగా ఎకో సిస్టం కూడా వచ్చేలా చూడాలని సూచించారు. తిరుపతిలో ఉన్న కలినరీ ఇనిస్టిట్యూట్ను డీమ్డ్ యూనివర్సిటీగా హెూదా పెంచి వివిధ సంస్థలను అనుసంధానించాలని పేర్కొన్నారు. కూచిపూడి, థింసాలాంటి సంప్రదాయాలతో పాటు వివిధ ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసే అంశంపైనా దృష్టి పెట్టాలని చర్చించారు. ఇటీవల విజయం సాధించిన విజయవాడ ఉత్సవ్ తరహాలోనే విశాఖ, రాజమహేంద్రవరంలాంటి చోట్లా ఉత్సవ్లు నిర్వహించాలని సూచించారు.
మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేకాధికార్లు
అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ కూడా ఇక్కడ త్వరలోనే క్యాంపస్ ను ప్రారంభించనుందని.. ఒక్క విశాఖ నగరంలోనే 5 లక్షలమందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులకు హౌసింగ్ తోపాటు రహదారులు, ఇతర మౌలిక వసతులు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్తో స్థానిక టౌన్షిప్లు ఏర్పాటు చేయాలన్నారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశముందని ముఖ్యమంత్రి వివరించారు. వీటితో పాటు 5 లక్షలమంది వర్క్ ఫ్రమ్ హెూమ్ ద్వారా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. రామాయపట్నం సమీపంలో వస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీతోపాటు ఆర్సెలార్ మిట్టల్, రైడెన్ డేటా సెంటర్లాంటి భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యే వరకూ పర్యవేక్షణ చేసేలా ప్రత్యేకాధికార్లను యమించాలన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు లాజిస్టిక్స్ను ఇంటిగ్రేట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలు, నీటి సరఫరా, వినియోగంలాంటి అంశాలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2028నాటికల్లా జిందాల్ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేలా చూడాలని సీఎం పరిశ్రమల శాఖను ఆదేశించారు. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, కె. అచ్చెన్నాయుడు, పి. నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, అనగాని సత్యప్రసాద్ పాటు సీఎస్ కె విజయానంద్, పరిశ్రమలు, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటకం, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
11వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు
1. యాక్మే ఊర్జా వన్ లిమిటెడ్: అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టులో రూ.2 వేల కోట్ల పెట్టుబడి. 1380మందికి ఉద్యోగాలు.
2. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్: అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు రూ.2 వేల కోట్ల పెట్టుబడి. 1,380మందికి ఉద్యోగాలు
3. చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్: విజయనగరం జిల్లాలో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టు రూ.12,905 కోట్ల పెట్టుబడి. 3వేల మందికి ఉద్యోగాలు.
4. ఆంప్లిన్ ఎనర్జీ ట్రాన్సిషన్: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టు రూ.15.10 కోట్లు పెట్టుబడి.
5. రిలయన్స్ కన్సూమర్ ప్రోడక్ట్స్: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎఫ్ఎంసీజీలో రూ.758 కోట్ల పెట్టుబడులు. 500మందికి ఉద్యోగాలు
6. గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్: రూ.208 కోట్ల పెట్టుబడులు. 66మందికి ఉద్యోగాలు
7. ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్: రూ.201 కోట్ల పెట్టుబడి. 436మందికి ఉద్యోగాలు
8. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.33 కోట్ల పెట్టుబడి. 200మందికి ఉద్యోగాలు
9. దస్పల్లా అమరావతి హెూటల్స్: అమరావతిలో రూ.200 కోట్ల పెట్టుబడి. 400మందికి ఉద్యోగాలు
10. వీఎస్కే హెూటల్స్ రిసార్ట్స్: అరకువ్యాలీలో రూ.55 కోట్ల పెట్టుబడి. 98మందికి ఉద్యోగాలు
11. శ్రీవేంకటేశ్వరా లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్: శ్రీశైలంలో రూ.83 కోట్ల పెట్టుబడి. 300మందికి ఉద్యోగాలు
12. సదరన్ గ్లోబ్ హెూటల్స్ అండ్ రిసార్ట్స్: అమరావతిలో రూ.117 కోట్ల పెట్టుబడి. 300మందికి ఉద్యోగాలు
13. మైరా బే వ్యూ రిసార్ట్స్: కొత్తవలసలో కన్వెన్షన్ సెంటర్కు రూ.256 కోట్ల పెట్టుబడి.
14. ఎస్వీఎస్ కనస్ట్రక్షన్స్: కాకినాడలో రూ.87 కోట్ల పెట్టుబడి.
15. రైడన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్: డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.87,520 కోట్ల పెట్టుబడి. 200మందికి ఉద్యోగాలు.
16. ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ ఇండియా: విశాఖ కాపులుప్పాడలో ఐటీ లాజిస్టిక్స్ రూ.140 కోట్ల పెట్టుబడి. 2600 మందికి ఉద్యోగాలు
17. శాన్వీరా ఇండస్ట్రీస్ లిమిటెడ్: అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్సు రూ.2600 కోట్ల పెట్టుబడి. 800మందికి ఉద్యోగాలు.
18. శ్రీ సిమెంట్ లిమిటెడ్: పలనాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ రూ.2260 కోట్ల పెట్టుబడి. 350మందికి ఉద్యోగాలు
19. రేమండ్, జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ: అనంతపురంలో ఏరో స్పేస్ ఆటోమోటివ్ కాంపోనెంట్పై రూ.430 కోట్ల పెట్టుబడి. 4,096మందికి ఉద్యోగాలు.
20. రేమాండ్ జేకే మైనీ గ్లోబల్ ఎరోస్పేస్ లిమిటెడ్: అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్లుకు రూ.510 కోట్ల పెట్టుబడి. 1400మందికి ఉద్యోగాలు.
21. భారత్ డైనమిక్స్ లిమిటెడ్: ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ.1200 కోట్ల పెట్టుబడి. 1400మందికి ఉద్యోగాలు
22. అలీప్: ఓర్వకల్లు వద్ద మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం రూ.36.25 కోట్ల పెట్టుబడి. 3000 మందికి ఉద్యోగాలు.
23. అవంతీ వేర్ హౌసింగ్ సర్వీసెస్: విశాఖలో గుర్రంపాలెం వద్ద రూ.319 కోట్ల పెట్టుబడి.
24. అస్సెల్ ఈఎస్ జీ: కర్నూలు జిల్లా కృష్ణగిరిలో రూ.300 కోట్ల పెట్టుబడి. 300మందికి ఉద్యోగాలు.
25. ఫెయిర్ ఎక్స్ పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: విజయవాడ మల్లవెల్లిలో మెగా ఫుడ్ పార్క్ కోర్ ప్రాసెసింగ్ సెంటర్.
26. జెఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్: విజయనగరంలో ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్పై రూ.531 కోట్ల పెట్టుబడి. 45000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.