- ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లదే కీలక పాత్ర
- నా ఆలోచనలు అందుకుని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వండి
- సీఎం అంటే కామన్మ్యాన్ అంటున్నా… మీరూ పాటించాలి
- అన్నింటికీ రూల్స్ కాదు… మానవీయ కోణంలోనూ స్పందించాలి
- ఫేక్ ప్రచారాలు పెను సవాల్… రియల్ టైంలో చెక్ పెట్టండి
- జిల్లాల కొత్త కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శనం
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమర్థవంతమైన పాలన అందించే విషయంలో వారికి దిశానిర్థేశం చేశారు. 360 డిగ్రీల్లో పనితీరు పరిశీలించి మీకు కలెక్టర్లుగా అవకాశం ఇచ్చాను. నా ఆలోచనలు, అంచనాలు అందుకోండి… బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వండని సూచించారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని నేను చెపుతున్నా… మీరూ అదే పాటించండి. ప్రజలకు అందుబాటులో ఉండండి. నిత్యం వారితో మమేకమవ్వండి. అన్నింటికీ రూల్స్ కాదు, మానవీయ కోణంలోనూ పనిచేయాలి. అప్పుడే మీకు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి
కలెక్టర్లుగా పోస్టింగులు ఇస్తున్న సందర్భంగా సీపం మాట్లాడుతూ ‘‘నేను 1995లో మొదటిసారి సీఎం అయ్యాను. 30 ఏళ్లలో 15 ఏళ్లు సీఎంగా ఉన్నాను. ఎంతోమంది అధికారులను నియమించాను. చాలామందితో పనిచేయించుకున్నాను. అయితే ఈసారి కలెక్టర్లకు పోస్టింగ్ల విషయంలో మరింత గట్టి కసరత్తు నిర్వహించాను. గతంలో ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదు. దీనికి కారణముంది. అనేక సమస్యల మధ్య ఏడాది క్రితం మనం పాలన ప్రారంభించాం. ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిని తీర్చాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఇప్పటికే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వీటిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే కలెక్టర్లే కీలకం. మీ పనితీరే ప్రభుత్వానికి విజయాలను తెచ్చి పెడుతుంది. 1995లో తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు చాలా ధృడంగా, కఠినంగా ఉండేవాడిని. ఫైల్స్ క్లియరెన్స్వంటి కార్యక్రమాలతో అధికారులను పరుగులు పెట్టించే వాడిని. పని విషయంలో ఎక్కడా రాజీ ఉండేది కాదు. ఆ పనితీరు అధికారులకు, ఉద్యోగులకు కొంత కష్టంగా అనిపించినా ప్రగతిలో మార్పు కనిపించింది. అభివృద్ది వేగవంతమైంది. అదొక్కటే కాదు… ఎప్పుడు విపత్తువున్నా అధికారులకంటే ముందు నేను వెళ్లేవాడిని. తుఫాన్లు, వరదలు, విపత్తులు వచ్చినప్పుడు ముందు నేనే వెళ్లే వాడిని. విశాఖలో హుద్హుద్ సమయంలో ఫ్లైట్ కూడా వెళ్లని పరిస్థితుల్లో ముందుగా వెళ్లి 10 రోజులు అక్కడే ఉన్నాను. ఇలాంటి చర్యలవల్ల ప్రజలకు ఆందోళన పోతుంది. ప్రభుత్వం సాయం చేస్తుందనే నమ్మకం కలుగుతుంది. స్పందించే ప్రభుత్వంగా అంతా గుర్తిస్తారు. అధికారంలో రిస్క్ ఉంటుంది. లీడర్స్ అనే వాళ్లు రిస్క్ తీసుకోవాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి. ఫ్యాక్షన్, నక్సలిజం, మతఘర్షణల విషయంలో సమర్థులైన అధికారులకు స్వేచ్ఛనిచ్చి పనిచేయించాను. దీంతో ఫలితాలు వచ్చాయి. అధికారుల సహకారం, సమన్వయం, మంచి టీంతోనే నేను ఫలితాలు సాధించాను’’ అని చంద్రబాబు నాయుడు గుర్తు చేసకుంటూనే.. కొత్త కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు.
మీరే నాం టీమ్
‘‘కలెక్టర్గా పనిచేయడం అంటే మీకు మంచి గుర్తింపు వస్తుంది. ప్రజల జీవితాల్లో మార్పులు తేవడానికి మంచి అవకాశం కలెక్టర్ ఉద్యోగం. మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ప్రతిదానిలో మార్పు చూపించవచ్చు. సాంఫీుక సంక్షేమ హాస్టల్కు వెళ్లి వసతులు చూడండి. ప్రభుత్వ ఆస్తులు రక్షించడంలో మీరే కీలకం. నాడు హైదరాబాద్లో ఒక అధికారి ఉండే వారు. ఆయనకు పూర్తి అధికారాలు ఇచ్చాను. దీంతో ల్యాండ్ మాఫియాకు చెక్ పెట్టారు. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపారు. ఒక తాహసీల్దారు బదిలీ అయితే కొత్తగా వచ్చే వాళ్లు…. ల్యాండ్ రికార్డులు అప్పగించడమే కాదు…. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ ఆస్తులు చూపించి వాటి రక్షణ అంశాలు వివరించి బాధ్యతలు అప్పగించే వారు. ఆ స్థాయిలో పనిచేశాం కాబట్టే నాడు ఫలితాలు చూపించాం. కలెక్టర్లుగా మీరు బాధ్యతగా, పారదర్శకంగా ఉంటే… మీ కింది అధికారులు కూడా వాటిని పాటిస్తారు. మీరు వారిలో స్ఫూర్తి నింపాలి. జిల్లా కలెక్టర్ల ఎంపికలో నాకున్న అవకాశాల్లో మీరే బెస్ట్ ఆప్షన్స్ అని సెలక్ట్ చేశాను. మీరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపాలి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న నా టీం మీరే. పనిచేస్తే ప్రోత్సహిస్తా….. ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం క్యారీ చెయ్యను. ఇదే సమయంలో నేను పొలిటికల్ గవర్నెన్స్ అని చెపుతున్నా. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన దాంట్లో మంచి చెడు చూడండి… ప్రజలకు ఉపయోగపడేది అయితే మానవీయ కోణంలో పనిచేయండి. నేను తప్పు చేయమని చెప్పను. పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పు చేయమని కాదు. కలిసి పనిచేయమని. ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం వారికి ఇవ్వండి. పొలిటికల్ గవర్నెన్స్ చేసిన సమయంలో నేను ఓడిపోలేదు. ఎక్కువ బ్యూరోక్రటిక్ గవర్నెన్స్ చేసినప్పుడే రాజకీయంగా నష్టపోయాను’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఇతర జిల్లాలతో పోటీ పడండి
‘‘మీ నిర్ణయాలు క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి. ప్రతి దానికీ డబ్బులు లేవని కూర్చుంటే పనవ్వదు. నేను అన్ని రాష్ట్రాలకంటే ఏపీ నెంబర్ 1గా ఉండాలని అందరితో పోటీ పడుతుంటా. మీరూ అన్ని జిల్లాలకంటే ముందుండాలని ఇతర జిల్లాలతో పోటీ పడాలి. ముందుండాలనే కసి, పట్టుదల మీకు కనిపించాలి. అసత్యాలు ప్రచారం చేసే మీడియా, సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్ అవర్లోనే మీరు రెస్పాండ్ అవ్వాలి. మనం చేసేది ప్రజల్లోకి వెళ్లాలి. లేకపోతే అసత్యాలే నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంది. కలెక్టర్ అనేది అధికారం కాదు. అహంకారం, ఈగోలు వద్దు. కామన్ మ్యాన్గా ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు ఉద్బోధించారు.