- ఏపీలో ఏఐ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి
- ‘ఏఐ సింగపూర్’ సంస్థను ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఎంఆర్వో కేంద్రాల ఏర్పాటుపై ఎస్ఐఏ ఇంజినీరింగ్ ప్రతినిధితోనూ భేటీ
- రాష్ట్రంలో విమానయాన రంగంలో అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి
సింగపూర్ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ హబ్గా అభివృద్ధి చేయాలన్న దృఢనిశ్చయంతోవున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పర్యటనలో భాగంగా 3వరోజు మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామిగా పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్ఛ్సేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌరసేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతమున్న అవకాశాలపైనా చంద్రబాబు- కంకణవల్లి మధ్య చర్చ జరిగింది.
ఎం.ఆర్.వో కేంద్రం ఏర్పాటుపై చర్చలు
ఎస్ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లిన్ విలిన్తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను జాన్ లిన్ విలిన్కు ముఖ్యమంత్రి వివరించారు. ఎంఆర్ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పారిశ్రామిక అనుకూల పాలసీల గురించీ వివరించారు. ముఖ్యంగా విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచన చేయాలని సీఎం చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎస్ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తర్వలోనే రాష్ట్రానికి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఎస్ఐఏ ఇంజినీరింగ్వంటి సంస్థల అనుభవం, టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచస్థాయి ఎంఆర్ఓ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని… ఈ కేంద్రం ఏర్పాటుకు విశాఖపట్నం, కృష్ణపట్నంవంటి ప్రాంతాలు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.