- సరికొత్త రికార్డు దిశగా సమావేశం
- రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్న 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు
- పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో సమావేశానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం గురువారం ఒకే రోజున 2 కోట్ల మందితో రెండో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (మెగా పేటీఎం) నిర్వహించనుంది. విద్యార్థులు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు…ఇలా అందరినీ ఒక చోటుకు ప్రభుత్వం తీసుకొస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది రెండో కార్యక్రమం. పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఉపాధ్యాయులతో సీఎం మాట్లాడనున్నారు.
61 వేల విద్యాసంస్థలు…2 కోట్లమంది భాగస్వాములు
రాేష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలలో మెగా పీటీఎం 2.0ను ఒక ఉత్సవంలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తంగా 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశం సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఇక ప్రతీ ఏడాది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ సమావేశాన్ని పీటీఎం పేరిట ప్రభుత్వం నిర్వహించనుంది. కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ను ప్రభుత్వ అధీనంలో నడిచే పాఠశాలల్లో సైతం నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ సంకల్పించారు. ఈ మేరకు వరుసగా రెండో ఏడాది కూడా పండుగ వాతావరణంలో విద్యార్ధుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాములతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
తల్లిదండ్రులకు పురోగతి కార్డుల అందజేత
తమ పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, సామాజిక సమస్యలపై అవగాహన చేసుకుంటున్నారా అనే అంశాలపై తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలగనుంది. అంతేకాదు…విద్యార్థుల చదువులకు సంబంధించిన సమగ్ర పురోగతి కార్డులను తల్లిదండ్రులకు ప్రభుత్వం అందించనుంది. తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలను, సూచనలను ఈ వేదిక ద్వారా ప్రభుత్వంతో పంచుకోవచ్చు. పాఠశాల విద్యలో పనితీరు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై చర్చించుకునే సదవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలగనుంది.