పాపాలు చేసిన మీరు.. నాకు శాపాలు పెట్టడం ఏమిటి
` కడప ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులతో ఆడుకుంది మీరే
` లోపాలు సవరిస్తూ గాడిన పెడుతున్న కూటమి ప్రభుత్వం
` జగన్కు మంత్రి లోకేష్ కౌంటర్
అమరావతి (చైతన్యరథం): కడప ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది మీరే కదా జగన్, ఇప్పుడు దొంగే.. దొంగా దొంగ అన్నట్టు, ఎందుకీ నాటకాలు.. అని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. 2020-21లో మొదటి బ్యాచ్ ప్రారంభమయింది. యూనివర్సిటీకి కనీసం సొంత బిల్డింగ్ లేకుండా, ఫుల్టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా 3 ఏళ్ళు నడిపించింది మీ ప్రభుత్వంలో కాదా? కనీసం ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా కన్సల్టెంట్లతో నడిపించి, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ) అనుమతి లేకుండా మీరు చేసిన నిర్వాకం వల్ల, 2020- 21, 2021-22, 2022-23 బ్యాచ్కి సంబంధించిన విద్యార్ధులు నష్టపోయారు. దీని ప్రభావం ఈ ఏడాది ADCET పై కూడా పడింది.
తనిఖీల కోసం వచ్చిన సీఓఏ.. 2024 జూలై 1,2 తేదీల్లో యూనివర్సిటీని సందర్శించి, కనీస సౌకర్యాలు కూడా లేవంటూ, యూనివర్సిటీలో లోపాలపై అదే నెల 26న నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆగస్ట్ 7న మా ప్రభుత్వం ప్రభుత్వం వివరణ ఇచ్చింది. క్యాడర్ వైజ్ ఫ్యాకల్టీ లేదు అంటూ 2020- 21, 2021-22, 2022-23 బ్యాచ్కి అనుమతులు ఇచ్చేది లేదని 2024 అక్టోబర్ 25న సీఓఏ తెలిపింది. తరువాత నవంబర్ 20న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లని తాత్కాలిక పధ్ధతిలో నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ ఈ ఏడాది జూలై 2న అనుమతి మంజూరు చేసి, ఇదే విషయాన్ని 3వ తేదీన సీఓఏకి తెలియ చేసిందని మంత్రి లోకేష్ వివరించారు.
మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు
కనీస సిబ్బంది లేకపోవడం వల్ల, APSCHE కి లేఖలు పంపి, ADCET-2025కి కన్వీనర్ను నియమించాల్సిందిగా కోరాం.
యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.
మీ హయాంలో ఇచ్చిన రెగ్యులర్ అధ్యాపక నియామక నోటిఫికేషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో, విద్యార్ధులు నష్ట పోకుండా సిబ్బందిని నియమించటానికి చర్యలు తీసుకున్నాం
మీ హయాంలో కనీసం రెగ్యులర్ అధ్యాపకులు లేకుండా కన్సల్టెంట్లతో నడిపించారు. యూనివర్సిటీకి కనీసమైన సౌకర్యాలు, భవనాలు కూడా లేకుండా నడిపింది మీరు. మీ పాపాలను సరి చేస్తూ, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు.