- ఈ విషయంలో రాజీ లేదు
- నెలాఖరులోగా మార్కెట్ యార్డు పదవులు, దేవాలయ కమిటీల భర్తీ
- ఎంతోమంది కార్యకర్తల త్యాగాల ఫలితమే నేటి మన అధికారం
- నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటాం
- కార్యకర్తల గొంతు వినడానికి సిద్ధంగా ఉన్నాం
- నెల్లురు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్
నెల్లూరు (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి, కష్టపడేవారికే పదవులు ఇస్తాం.. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తిలేదు.. కేడర్ను బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నాం.. గతంలో మాదిరి మరోసారి నష్టపోవడానికి సిద్ధంగా లేం.. 4 నెలలకోసారి యావత్ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్లో సోమవారం జరిగిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగనీయొద్దన్నారు. తప్పులు జరిగితే సరిదిద్దుకుంటాం. చంద్రబాబు కూడా చెబితే వింటారు, నాలుగోసారి సీఎం అయినా వినడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నెలాఖరులోగా మార్కెట్ కమిటీలు (ఏఎంసీలు), దేవాలయ కమిటీలు పూర్తిచేస్తాం. కోటిమంది సభ్యులుగల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ. సొంత కార్యకర్తలను కారు కింద తొక్కేసిన నేత రాష్ట్రంలో ఉన్నారు. కనీసం ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కూడా జగన్కి మనస్సు రాలేదు. అదే మన అధినేత చంద్రబాబు కందుకూరు వెళ్లినపుడు తొక్కిసలాట జరిగితే ఇంటింటికీ వెళ్లి క్షమాపణ చెప్పారు. మనకి వాళ్లకు వ్యత్యాసం అదే. ఈ రోజు మన అధికారం వెనుక ఎంతోమంది త్యాగాలు దాగి ఉన్నాయి. చంద్రబాబుని 53రోజులు జైలుకు పంపి వేధించారు, పోలీసులు నాపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి సెల్యూట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఆలోచించి ముందుకు సాగాలని యువనేత లోకేష్ ఉద్బోధించారు.
ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
యువగళం పాదయాత్రలో చాలామంది నాతో నడిచారు. మార్పు నెల్లూరు నుంచే మొదలైంది. పాదయాత్రలో ప్రధానంగా పనిచేసిన వారిని గుర్తించాలని నన్ను కోరారు. సభ్యత్వ నమోదు, మన టీడీపీ వంటి పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన ఉత్తమ కార్యకర్తలతో గత ఏడాదికాలంగా సమావేశమవుతున్నా. కార్యకర్తలు చెప్పేది నాయకులు వినాలి. కార్యకర్తే అధినేత అని నమ్మి వారికి పెద్దపీట వేస్తున్నాం. 2013నుంచి పార్టీలో నేను క్రియాశీలకంగా ఉన్నా. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలి. పార్టీ పిలుపు ఇచ్చే కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాలి. ప్రతిపక్షంలో ఉండగా టెక్నాలజీ జోడిరచి కార్యక్రమాలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చాయి. అధికారంలోకి వచ్చాక కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నాం. గత ఏడాది కాలంలో సభ్యత్వ నమోదు తర్వాత సుపరిపాలన ` తొలి అడుగు కార్యక్రమం మాత్రమే పార్టీ చేపడుతోంది. పార్టీ కార్యకర్తలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
ఇబ్బందులున్నా హామీలు అమలుచేస్తున్నాం
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఒకే ఒక్క జీఓతో రూ.10వేల కోట్లు తల్లుల ఖాతాల్లో వేశాం. డబ్బులివ్వడమే కాదు, తల్లులను గౌరవించాలి. కార్యకర్తలంతా ప్రజలతో మమేకం కావాలి. క్రమశిక్షణ, పట్టుదలతో పార్టీ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. కుటుంబం అన్నాక సమస్యలుంటాయి, కలసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. పార్టీలో సంస్కరణల కోసం.. జగన్తో పోరాడినదాని కంటే 5 రెట్లు ఎక్కువగా పార్టీలో పోరాడతా. సమస్యలుంటే నాలుగుగోడల మధ్య చర్చిద్దాం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడదాం. చంద్రబాబు నియోజకవర్గాలకు వెళ్లినపుడు కూడా కార్యకర్తలను కలుస్తున్నారు, పార్టీ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. నిరంతరం పార్టీ కేడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లందే సమస్యలు తెలియవని యువనేత లోకేష్ అన్నారు.
సుపరిపాలనలో ` తొలి అడుగు విజయవంతం చేయండి
సుపరిపాలనలో ` తొలి అడుగు విజయవంతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం, ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. మెగా డీఎస్సీలో 16,347 టీచర్ పోస్టులు భర్తీచేస్తున్నాం. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పద్ధతి ప్రకారం భర్తీచేస్తాం. అయిదేళ్లలో రాని కంపెనీలు గత 12 నెలల్లో రాష్ట్రానికి వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం. మంత్రివర్గంలో 17మంది కొత్తవాళ్లు ఉన్నారు, అయినా మంత్రులందరం తరచూ కూర్చొని క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగూరి నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.