అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం మహా విషాదమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడ నుంచి హుటాహుటిన బయల్దేరి అహ్మదాబాద్ వెళ్లిన ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రధాని మోదీ పోన్ చేసి ప్రమాదం గురించి ఆరా తీశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నేను విజయవాడ నుంచి నేరుగా బయల్దేరి వచ్చాను. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. అన్ని కోణాల్లో లోతైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేస్తాం. అధికారులతో సమావేశం అనంతరం మరిన్ని వివరాలు అందిస్తాం. విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.