- గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం
- 241 మందికి పైగా మృతి
- ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది
- ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు
- అదుపు తప్పి మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన మృత్యు విహంగం
- ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారని సమాచారం
- మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్
- దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం రూపానీ మృతి
- ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ఏఐ-171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో విమానంలో ఉన్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది లో ఒకరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. విమానంలో 11ఏ నెంబర్ సీట్లోని ప్రయాణికుడు రమేశ్ విశ్వాస్ సజీవంగా బయటపడ్డారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, 1 కెనడియన్, 7 మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి చెందారు. ఈ విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పైకి దూసుకెళ్లి కూలిపోయింది. హాస్టల్లోని వైద్య విద్యార్థులు ఐదుగురు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికుల సమాచారం కోసం 1800 5691 444 అనే ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు.
విమానం జనావాసాల్లో కూలడంతో అక్కడా కొంతమంది చనిపోయి ఉంటారని మొత్తంగా ఎంతమంది చనిపోయారనేది చెప్పడం కష్టమేనని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. విమానంలో 11ఏ నెంబర్ సీట్లోని ప్రయాణికుడు రమేశ్ విశ్వాస్ సజీవంగా బయటపడినట్లు చెప్పారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన పై ఎయిరిండియా యాజమాన్యమైన టాటా గ్రూప్ స్పందించింది. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాగా అందించనున్నట్లు వెల్లడిరచింది. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామని తెలిపింది.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో.. పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు. తరువాత సెకన్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీ కొట్టి ఓ భవనంపై కూలిపోయింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లయిట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. క్రమంగా కిందికి కూలుతూ భవనాలను ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన నిమిషాల్లో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పలువురిని సురక్షితంగా బయటకు తీశారు. విద్యార్థుల భోజనాలు చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడంతో మెస్లో ప్లేట్లు, ఆహారం చిందరవందరగా పడిన దృశ్యాలు వైరల్గా మరాయి. తొలుత మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనగా వడోదర నుంచి మరో రెండు బృందాలను ఇక్కడికి తరలించారు. ప్రమాదస్థలి నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వరకు గ్రీన్కారిడార్ను ఏర్పాటు చేశారు.
ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది, ఇతర బృందాలు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యాయి. ప్రమాదం జరిగిన ఐదు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు, ఇతర ఏజెన్సీలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ వాళ్లని హాస్పిటల్స్కు తరలించారు. కూలిన విమాన కెప్టెన్ సుమీత్ సభర్వాల్కు 8,200 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉంది. విమానంలో కో పైలట్ గా ఉన్న క్లైవ్ కుందర్కు 1,100 గంటలకు పైగా అనుభవం ఉంది.
మరోవైపు ఈ ప్రమాదం ఎలా జరిగింది.. సాంకేతిక సమస్య కారణంగా జరిగిందా.. ఏదైనా కుట్ర దాగుందా.. అనే కోణంలో దర్యాప్తు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. మరోవైపు ప్రమాదంపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.
కాగా, ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది మొదలు.. ప్రమాదానికి గురైన తీరుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయినట్లుగా కొన్ని విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. 600 అడుగులపైగా ఎత్తుకు దూసుకెళ్లిన విమానం.. క్షణాల్లో జనావాసాలపై కుప్పకూలి పేలిపోవడం కొన్ని వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మాజీ సీఎం విజయ్ రూపానీ..
ఇంకోవైపు ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించారు. ఆయన కుమార్తె లండన్లో నివసిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్ ప్రయాణమయ్యారు. ఇక ఆయన భార్య అంజలి రూపానీ లండన్లో ఉన్నారు. ఆమెను తీసుకు వచ్చేందుకు ఆయన లండన్ పయనమైనట్లు విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు వివరించారు.
సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హుటాహుటిన సంఘటన స్థలికి బయల్దేరారు. అత్యవసర బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, క్షేత్రస్థాయి పరిస్థితులను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎయిరిండియా-171 విమాన ఘటనపై ఎయిరిండియా చైర్మన్ చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వెలిబుచ్చారు. ఇది హృదయ విదారకర ఘటన. దీనిపై మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదం అన్నారు. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. ప్రమాదంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని.. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు తెలియచేయాలని ఆదేశించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ ప్రధాని ఫోన్లో మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని రామ్మోహన్ నాయుడు, అమిత్ షాకు ప్రధాని సూచించారు.