తాడేపల్లి (చైతన్య రథం): సీఎం చంద్రబాబు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో సీఎం చంద్రబాబు గత ఏడాది జులై 1న ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా స్థానిక సుగాలి కాలనీలో ఉన్న బాణావత్ పాములు నాయక్, సీతమ్మ నాయక్ దంపతుల ఇంటికి వెళ్లి తొలి పింఛన్లు అందజేసి.. యోగక్షేమాలను తెలుసుకున్నారు. పూరింట్లో ఉంటున్న తాము వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు సీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టానికి చలించిన చంద్రబాబు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఏడాది తిరగక ముందే రూ.12 లక్షల వ్యయంతో డాబా నిర్మించి ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.8 లక్షలు మంజూరు చేయగా.. మిగిలిన నగదును విద్య, ఇటీ శాఖల మంత్రి నారా లోకేశ్, తెదేపా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు సహకారంతో సమకూర్చి నిర్మాణం పూర్తి చేశారు. బుధవారం ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కొల్లి శేషు, భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జి పంచుమర్తి ప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం పాములు నాయక్ దంపతులు పూరి గుడిసె నుంచి కొత్త ఇంట్లోకి మారారు. ‘సీఎం స్వయంగా మా కష్టం తెలుసుకుని ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఆయనకు, మంత్రి లోకేశ్కు రుణపడి ఉంటాం’ అని పాములు నాయక్ దంపతులు తెలిపారు.