- గత ప్రభుత్వంకంటే 24.65 లక్షలమందికి అదనంగా..
- పథకం మొత్తానికయ్యే ఖర్చు రూ.10,091 కోట్లు
- ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వినియోగం
- కూటమి పాలన ఏడాదైన సందర్భంగా కీలక హామీ అమలు
- సుపరిపాలనలో మొదటి అడుగు వేశాం
- రౌడీ మూకతో పొదిలివెళ్లి జగన్ రౌడీయిజం చేశారు
- రాక్షసుల మాదిరి ఏపీ నాశనానికి కుట్రలు చేస్తున్నారు
- ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదు
- నా మంచి తనమే ఇప్పటిదాకా చూశారు…
- అరాచకాలకు పాల్పడితే ఇక ఉపేక్షించేది లేదు
- మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): ‘ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నాం. నేటితో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా హామీని అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీల్లో ఈ పథకం కీలకమైంది. 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు తల్లికి వందనం పథకం కింద ఖర్చు చేస్తున్నాం. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెచ్చిస్తాం. తల్లికి వందనం పథకం.. అమ్మఒడి పథకానికి మధ్య చాలా వ్యత్యాసముంది. గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్ధులకు అమ్మఒడి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్ధులకు ఇస్తోంది. అంటే గత ప్రభుత్వంకంటే 24,65,199 మందికి అదనంగా పథకం వర్తింపచేశాం. గత ప్రభుత్వం రూ.5,540 కోట్లు ఇవ్వగా… మేం రూ.8,745 కోట్లు జమ చేస్తున్నాం. వారికంటే రూ.3,205 కోట్లు అదనంగా ఇస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకున్నామని, స్కూలు అడ్మిషన్లు కాగానే వారికి కూడా డబ్బులు వేస్తామని వివరించారు. తల్లిలేని పిల్లలుంటే తండ్రి, సంరక్షులకు, అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్దేశించిన వారికి నగదు జమ చేస్తామన్నారు. ప్రయివేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 76 వేలమందికి కూడా పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పారదర్శకత కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు. సాంకేతిక సమస్యలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈనెల 26వరకు సమయం ఇస్తున్నామని, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా గురువారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు.
బలహీన వర్గాలకే అధిక లబ్ధి
67.27 లక్షలమంది విద్యార్ధుల్లో 29.82 లక్షల మంది బీసీలు, 11.76 లక్షలమంది ఎస్సీలు, 4.26 లక్షలమంది ఎస్టీలు, 66.5 వేలమంది మైనార్టీలు, 8.44 లక్షలమంది ఈడబ్యూసీ విద్యార్థులున్నారు. జనాభా సమతుల్యతలో భాగంగా ఇదొక ముందడుగు. ఒక కుటుంబంలో ఒక్క బిడ్డ ఉన్న విద్యార్ధులు 18,55,760 మంది, ఇద్దరు బిడ్డలున్న విద్యార్ధులు 29,10,644 మంది ఉన్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలున్న విద్యార్ధులు 6,32,052మంది ఉన్నారు. నలుగురు పిల్లలున్న తల్లులు 80,212 మంది ఉన్నారు. దక్షణ భారతదేశమంతా జనాభా తగ్గుతోంది. ఒకప్పుడు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువమంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాం. ఇప్పుడు ఇద్దరు పిల్లలకంటే తక్కువుంటే పోటీకి అనర్హులుగా చేయాల్సి వస్తుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
‘అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయేకు రెండు కళ్లలాంటివి. సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి దాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాం. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారని ఎంతోమంది అడిగారు. కష్టాలు వచ్చినప్పుడు కాడి పడేయడం కాదని అందరికీ స్పష్టంగా చెప్పాను’ అని చంద్రబాబు గుర్తు చేశారు.
ఈనెల 20న అన్నదాత సుఖీభవ
‘అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదిలో కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ.20 వేలు ఖాతాల్లో వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘ఈ పథకం కూడా ఈనెల 20న అమలు చేస్తాం. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.7,500 మాత్రమే. వాళ్లకు మాకు వ్యత్యాసం రూ.6,500. దీపం పథకం కింద ఆడబిడ్డలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో లక్షా 29వేల 178మందికి రూ.259 కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం లక్షా 9వేల 231 మందికి రూ.109 కోట్లే ఇచ్చింది. మన ప్రభుత్వం 19వేల 947మందికి అదనంగా ఇచ్చి రూ.150 కోట్లు ఎక్కువ ఖర్చు చేశాం. పింఛన్లు కింద గత పాలకులు ఏడాదికి రూ.21,631 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం రూ.34 వేల కోట్లు ఇచ్చింది. రూ.12,370 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాం. బటన్ నొక్కామని గొప్పలు చెప్పిన వారికి మేం అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్థం కావాలి. వాలంటీర్లు లేకపోతే పింఛను ఎలా ఇస్తారని విమర్శించారు. ఒకటో తేదీనే గౌరవప్రదంగా ఇంటికెళ్లి పింఛను అందిస్తున్నాము. దేశంలో ఎక్కడైనా ఇంత పెద్దమొత్తంలో పింఛను ఇస్తున్నారా? ఇంత క్రమ శిక్షణగా అమలవుతోందా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
సుపరిపాలనలో మొదటి అడుగు
‘గత ఐదేళ్లూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. అభివృద్ధి జాడ లేదు. మద్య నిషేధం గురించి మాట్లాడేవారు ఆదాయాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. తహసీల్దార్ కార్యాలయాలు సైతం తాకట్టుపెట్టారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు లేవు. రిటైర్డ్ ఉద్యగులకు సరిగా పెన్షన్లు ఇవ్వలేదు. అవన్నీ మా ప్రభుత్వం పరిష్కరించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 204 అన్నా క్యాంటీన్ల ద్వారా 4 కోట్ల భోజనాలు అందించాం. 21 ఆలయాల్లో నిత్యాన్నదానానికి శ్రీకారం చుడుతున్నాం. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలిస్తాం. ఇప్పటికే రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. లోకేష్ చైర్మన్గా ఎంప్లాయిమెంట్ జనరేషన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కార్యక్రమానికి వర్కవుట్ చేస్తున్నారు. నిరుద్యోగభృతి పథకం అమలుపైనా కసరత్తు చేస్తున్నాం. ఆడబిడ్డ నిధి పథకానికి పీ4కు లింక్ చేస్తాం. ఇబ్బందుల్ని అధిగమిస్తున్నాం. రోజులో ఒక గంటపాటైనా ఆర్థికశాఖపై సమీక్షిస్తున్నాను. పేదల్లో అత్యంత నిరుపేదలున్నారు. ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం నిర్మూలిస్తాం. ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.