- కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు
- మహానాడు తరువాత రాష్ట్ర కమిటీ
- మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ
- ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- వైసీపీ చౌకబారు విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి
- రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయం
- టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టెలీకాస్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం చాలా బాగా జరిగిందంటూ సభ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలందరికీ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ గత పర్యటనలన్నింటినీ మరిపించేలా తాజా సభ జరిగిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర కమిటీ మినహా పార్టీలో అన్ని కమిటీలనూ ఈ నెల 18 లోగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో ఆదివారం సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పనుల పున:ప్రారంభం కార్యక్రమంతో దేశం, ప్రపంచం దృష్టి అమరావతిపై మళ్లిందన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి సభకు వచ్చి వెళ్లేదాకా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అమరావతి ఆవశ్యకతను తెలియజేసేందుకు, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రధాని చేతుల మీదుగా పున:ప్రారంభం చేశాం. వికసిత్ భారత్ 2047కు అమరావతి బలమైన పునాదిగా మారుతుందని ప్రధాని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఇక ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక. యువతకు అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని గాడిన పెట్టాం
ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పున:నిర్మాణం చేస్తామని ప్రధాని మోదీ, నేను, పవన్ కళ్యాణ్ చెప్పాం. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక గతి తప్పిన రాష్ట్రాన్ని గాడినపెట్టాం. పోలవరానికి నిధులు రాబట్టి 2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. మూతబడే స్థితిలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఊపిరిపోసి రూ.11,400 కోట్లు కేంద్రం నిధులు కేటాయించేలా చేసుకున్నాం. ఉత్తరాంధ్ర వాసుల కల అయిన రైల్వేజోన్ సాధించాం. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. బీపీసీఎల్, ఆర్సెలార్ మిట్టల్, సీమలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసుకుంటున్నాం. లేపాక్షి-కొప్పర్తి కారిడార్ తీసుకొస్తాం. ఇటీవల 11 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించాం. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రజల్లోకి తీసుకెళ్లండి
ప్రతినెలా 1వ తేదీనే పేదలకు పింఛను ఇస్తున్నాం. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. దీపం 2 కింద కోటి మందికిపైగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మత్య్సకారుల సేవలో పథకంలో భాగంగా కుటుంబానికి రూ.20 వేలు ఇచ్చాం. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభిస్తాం. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు అందిస్తాం. సూపర్-6 హామీలు అమలు చేయడంతో పాటు ఆర్థిక, ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
వైసీపీ విమర్శలను తిప్పికొట్టండి
నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అధికశాతం కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, కోపరేటివ్, ఏఎంసీ ఛైర్మన్ల పదవులను భర్తీ చేశాం. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. సామాజిక న్యాయం పాటించి పదవులకు ఎంపిక చేస్తున్నాం. పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు మే 18 నాటికి పూర్తి చేయాలి. ఈ సారి మహానాడును కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించుకుంటున్నాం. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ పూర్తి చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కార్యకర్తల, ప్రజల అభిప్రాయాల మేరకు నాయకులు పని చేయాలి. గుజరాత్ మోడల్ ఏపీలోనూ అమలవ్వాలి. సుస్థిర ప్రభుత్వం ఉండటంతో గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోంది..వాటిని గట్టిగా తిప్పికొట్టండి. ప్రభుత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యతే పార్టీకి కూడా ఇస్తున్నా. ఏడాది పాలనలోనే స్పష్టమైన మార్పులు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామని సీఎం చంద్రబాబు అన్నారు.