- 421 ఉద్యోగాల భర్తీకి మే 2 నుంచి దరఖాస్తులు
- రాత పరీక్ష లేదు..సీనియర్ క్రీడా మెరిట్తో ఎంపిక
- రవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి
అమరావతి(చైతన్యరథం): ఏపీ ప్రభుత్వం క్రీడాప్రాధికార సంస్థ మెగా డీఎస్సీ-2025లో భాగంగా 3 శాతం క్రీడల కోటా ఉద్యోగాల భర్తీకి బుధవారం విజయవాడ శాప్ ప్రధాన కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ముఖ్యమైనదన్నారు. క్రీడలతో యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారు. ఇది సమర్థ సమాజ నిర్మాణానికి మూలస్తంభం. ఈ విషయాన్ని ముందు గానే గుర్తించి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. మెగా డీఎస్సీలో విడుదల చేసిన 16,347 పోస్టుల్లో క్రీడా కోటా కింద 421 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద కేటాయించినట్లు తెలిపారు. స్పోర్ట్స్ కోటాకు ఎంపికను పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నిష్పక్షపాతంగా అర్హులందరికీ న్యాయం జరిగిలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను కనీసం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రీడా కారులకు 3 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. అలాగే ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఇన్సెంటివ్లు అందిస్తామని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మెగా డీఎస్సీకి అర్హులైన క్రీడాకారులు మే 2 నుంచి మే 31 వరకు ష్ట్ర్్జూం://ంజూశీత్ీం.aజూ.స్త్రశీఙ.ఱఅ, ష్ట్ర్్జూం:// ంజూశీత్ీంసంష. aజూషటంం.ఱఅ వెబ్సైట్లలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మెగా డీఎస్సీలో క్రీడా కోటా కింద ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో 333 పోస్టులు, మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో 30 పోస్టులు, ఏపీ ట్రైబల్ వెల్ ఫేర్ ఆశ్రమ్ పాఠ శాలల్లో 22 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2 పోస్టులు, ఏపీ మోడల్ పాఠ శాలల్లో 4 పోస్టులు, ఏపీ సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 7 పోస్టులు, ఏపీ గురుకుల వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 23 పోస్టులు కేటాయించినట్లు వివరించా రు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ గిరీష, శాప్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.