- ఆహారపు అలవాట్లతో వ్యాధులు తగ్గించుకోవచ్చు
- ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గించాలి
- క్యాన్సర్ రోగుల్లో మహిళలే అధికం
- రైతులు పురుగుమందుల వినియోగం తగ్గించాలి
- అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ నిర్మాణం…
- ప్రతి నియోజకవర్గంలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
- రాష్ట్రంలో.. హెల్త్ టూరిజానికి ప్రోత్సాహం
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- జిల్లాలవారీ ఆరోగ్య సమస్యలపై పవర్ పాయింట్
అమరావతి (చైతన్య రథం): ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్పు ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని, ఇందుకోసం ప్రతి రోజూ వ్యాయామం, యోగా, ధ్యానం చేయడంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రోజూ అరగంట వాకింగ్ చేయడం, అలాగే దైవ చింతనతో ఒత్తిడి తగ్గుతుందన్నారు. మన దేశ వారసత్వ సంపద అయిన యోగాను ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తోందని తెలిపారు. పొగాకు, డ్రగ్స్, ఆల్కాహాల్ను దూరం పెడితే క్యాన్సర్, లివర్, కిడ్నీ సమస్యలు తగ్గుతాయన్నారు. జంక్ ఫుడ్, ఫాలిష్డ్ బియ్యం తినడం తగ్గించి మిల్లెట్స్, ముడిబియ్యం తీసుకోవడంతో పాటు ఆహారంలో పీచు పదార్థం, కూరగాయలు ఎక్కువగా తినాలని సూచించారు. జిల్లాలవారీగా హెల్త్ రిపోర్టులను సోమవారం సచివాలయంలో ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి మీడియాకు వివరించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని రూపొందించాలన్నది తమ ఆలోచన అన్న సీఎం…హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ సాధనకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఉప్పు, నూనె, చక్కెర తగ్గించాలి
నలుగురున్న కుటుంబంలో నెలకు 600 గ్రాముల ఉప్పు వాడితే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. వంటనూనె నెలకు 2 లీటర్లు, చక్కెర 3 కేజీలకన్నా ఎక్కువ వినియోగించకుండా చూసుకోవాలి. వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఉప్పు వినియోగం తగ్గిస్తే 40 శాతం మేర గుండెపోట్లు తగ్గుతాయి. కేరళ ప్రభుత్వం షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్ ప్రకటించింది. తమిళనాడులో రేషన్ షాపుల్లో గ్లూకోజ్ టెస్టులకు స్ట్రిప్స్ ఉచితంగా ఇస్తున్నారు. ఏపీలో క్లీన్ కుక్ స్టవ్ పంపిణీ కింద అంగన్వాడీలకు గ్యాస్ స్టవ్ ఇచ్చాం. డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ మోడల్ కింద సింగపూర్లో అక్కడి ప్రభుత్వం ఇళ్లకు ప్రత్యేక పెయింట్ వేసి దోమల బెడద లేకుండా చేస్తోంది. దోమలను నివారిస్తే వ్యాధులను నియంత్రించవచ్చు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున న్యూట్రిఫుల్ యాప్ డెవలెప్ చేశాం. దీనికి స్కాచ్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం 4 లక్షలమంది ఈ యాప్ను అనుసరిస్తున్నారని సీఎం చంద్రబాబు వివరించారు.
పురుగు మందుల వినియోగం తగ్గాలి
రైతులు పంటలకు పురుగు మందుల వినియోగం తగ్గించాలి. వీటి వాడకం వల్ల పంజాబ్ రాష్ట్రం క్యాన్సర్ కేపిటల్ అయింది. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం నేడు పురుగు మందుల వినియోగంతో అనారోగ్యంపాలైంది. అందుకే మన రాష్ట్రంలోని రైతుల్లో చైతన్యం తెచ్చి ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పాఠశాల విద్య నుంచే ఆహారపు అలవాట్లపై చైతన్యం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడిరచారు.
డిజి లాకర్లో హెల్త్ రికార్డులు
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ల జారీలో ఏపీ ముందుంజలో ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 88 శాతం మంది ప్రజలకు హెల్త్ అకౌంట్లు రూపొందించాం. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’ ఏర్పాటు చేస్తున్నాం. ఫేజ్ 2 లో చిత్తూరు జిల్లా, ఫేజ్ 3లో రాష్ట్రం మొత్తం ఈ విధానాన్ని అమలు చేస్తాం. 26 నెలల్లో ఈ వర్చువల్ ఆసుపత్రులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హెల్త్ రికార్డులు రూపొందించి డిజిటల్ లాకర్లో పెడతాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని చిన్నతనం నుంచే ట్రాకింగ్ చేస్తాం. కాలాన్ని బట్టి వ్యాధులు ఎప్పుడు వస్తాయో ప్రజలకు అలెర్ట్ సందేశాలు పంపేలా రూపకల్పన చేస్తాం. మొబైల్ వైద్య వాహనాల ద్వారా ఇంటివద్దే పరీక్షలు చేయిస్తాం. డాక్టర్లు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా సేవలందిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.
టాటా, గేట్స్తో కలిసి…
టాటా, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో వైద్యరంగంలో ముందుకెళ్తాం. ప్రపంచస్థాయి టెక్నాలజీ, ప్రాక్టీసెస్ను ఇక్కడికి తీసుకొస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తాం. 175 నియోజకవర్గాలకుగాను 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. లేని 105 నియోజకవర్గాల్లో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్మిస్తాం. ఆరోగ్య సేవలను ప్రజలకు దగ్గర చేయడానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నియోజకవర్గాల్లో నిర్మిస్తాం. పీపీపీ విధానంలో నిర్మించి వయబిలిటీ గ్యాప్ ఫండిరగ్ అందిస్తాం. ఆసుపత్రుల నిర్మాణానికి స్థలంతోపాటు, కొంత రాయితీ ఇస్తాం. మధ్యప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలో దీనిపై అధ్యయనం చేసి ఉత్తమ విధానాన్ని తీసుకొస్తాం. దీంతో ప్రతి నియోజకవర్గంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఏర్పాటవుతుంది. వ్యాధులకు సంబంధించి దేశ, విదేశాల్లో ఉండే నిపుణులను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుంటాం. రాష్ట్రంలోని ఉత్తమ డాక్టర్లను వారికి అనుసంధానం చేసి ప్రతి మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఏంచేశామన్నది సమీక్ష చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.
అమరావతిలో మెగా మెడిసిటీ ఏర్పాటు
రాజధాని అమరావతిలో పీపీపీ విధానంలో మెగా గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చందబాబు ప్రకటించారు. కేంద్రం దేశంలో 25 మెడిసిటీలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని, అమరావతిలో మెడిసీటీ నిర్మాణంపై కేంద్రంతో సంప్రదిస్తున్నామని వెల్లడిరచారు. దీనికి 200 ఎకరాలను కేటాయించి అందులో 100 ఎకరాలు హెల్త్ కేర్, సేవలకు 40 ఎకరాలు, రెసిడెన్షియల్కు 40 ఎకరాలు, కమర్షియల్కు 20 ఎకరాలు ఇచ్చే విధంగా విధానాలు రూపొందించారు. మెడిసిటీ ఏర్పాటుపై ఆరోగ్య శాఖ, సీఆర్డీఏ కలిసి పని చేస్తాయి. హెల్త్ టూరిజానికి కూడా ఈ మెగా మెడిసిటీ ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.