- అబద్ధాలు, అభూత కల్పనల్లో ఘనుడు జగన్
- మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం
- ప్రాజక్టు పూర్తికి రూ.4 వేల కోట్లు, 2 ఏళ్ల సమయం కావాలి
అమరావతి (చైతన్యరథం): అబద్ధాలు చెప్పడం, అభూత కల్పనలు చేయడం, పూర్తికాని ప్రాజెక్టులను ప్రారంభించడంలో జగన్ అంతర్జాతీయ ఖ్యాతి గడిరచారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఏడు వింతలు మాత్రమే తెలిసిన ప్రజలు..ఎనిమిదో వింతను జగన్ రూపంలో చూస్తున్నారని చురకలు అంటించారు. గురువారం సెక్రటేరియట్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ తీరు తెన్నులు వివరించారు. ఈ ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను మంత్రి నిమ్మల విశదీకరించారు. వెలిగొండ ప్రాజక్టు పనులను పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని, ఆ ప్రాజక్టు పూర్తి కావాలంటే దాదాపు రూ.4 వేల కోట్ల నిధులతో పాటు 2 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు. 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి తాగు నీరు అందజేసే వెలిగొండ ప్రాజక్టు ప్రధాన పనులు ఏవీ పూర్తి చేయకుండా రైతులను గృహనిర్బంధం చేసి పటిష్టమైన బందోబస్తు మద్య ఆ ప్రాజక్టును జగన్ రెడ్డి జాతికి అంకితం చేశారని మంత్రి నిమ్మల గుర్తుచేశారు.
శ్రీ శైలం వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్ పనులు, మొదటి, రెండవ సొరంగం పనులు, ఫీడర్ కెనాల్ పనులు, నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను ఏ మాత్రం పూర్తి చేయకుండా వెలిగొండ ప్రాజక్టును జాతికి అంకితం చేస్తున్నామంటూ డ్రామాలు ఆడారన్నారు. సొరంగం-1 లో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర, సొరంగం-2 లో 2.00 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తొలగించాల్సి ఉందని, అందుకు దాదాపు తొమ్మిది మాసాలు పడుతుందన్నారు. సొరంగం -2 లో ఇంకా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేయాల్సిన పనులు ఉన్నాయని అందుకు దాదాపు ఎనిమిది మాసాలు పడుతుందన్నారు. అదే విధంగా సొరంగం-2 లో 6.8 కి.మి.మేర లైనింగ్ పనులు ఉన్నాయని, భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఉందని, దాన్ని తొలగించేందుకు చాలా సమయం పడుతుందన్నారు. 21.8 కి.మి. మేర ఫీడర్ కెనాల్ పనులను కూడా చేయాల్సి ఉందన్నారు. ఇన్ని పనులు పెండిరగ్లో ఉంటే.. జగన్ మాత్రం వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. అదే విధంగా ఈ ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడం వింతగా ఉందన్నారు. 1996 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టుకు భూమి పూజచేసి, 2014 లో రూ.1,373 కోట్లను కేటాయింది అందులో 96 శాతం నిధులు అంటే రూ.1,319 కోట్లను వెచ్చించి 30 శాతం పనులను పూర్తి చేశారన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో బడ్జెట్ రూ.3,518 కోట్లు కేటాయిస్తున్నట్లు చూపించినప్పటికీ అందులో కేవలం 18 శాతం నిధులు అంటే రూ.647 కోట్లను మాత్రమే వెచ్చించారని మంత్రి నిమ్మల తెలిపారు.