- పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన మంత్రి సవిత
- అంతర్జాతీయ భారత్ టెక్స్-2025కు హాజరు
- రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని వివరించిన వైనం
న్యూఢిల్లీ: ఏపీ స్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు అదే అనువైన సమయమని రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. టెక్స్టైల్స్ విభాగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ టెక్స్టైల్ పాలసీలను తీసుకొచ్చినట్టు వివరించారు. చేనేతరంగ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడులకు ఆకర్షణకు ప్రభుత్వం అనువైన వాతావరణం కల్పించిందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేశ, విదేశీ పెట్టుబడుదారులకు మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో జరుగుతున్న భారత్ టెక్స్-2025లో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి ఎస్ సవిత ఆదివారం పలువురు దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలిశారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతోపాటు పెట్టుబడుల కోసం కేంద్రం భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత మండపంలో ప్రధాన నరేంద్ర మోదీ ప్రసంగించారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత పలువురు పారిశ్రామికవేత్తలను కలిశారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇటీవలే నూతన టెక్స్టైల్స్ పాలసీని తీసుకొచ్చినట్టు చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అనువైన ప్రాంతమని, పరిశ్రమల స్థాపనకు తక్షణ అనుమతులు, రాయితీలు ఇవ్వడంతోపాటు భూకేటాయింపులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రంలో చేనేతరంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలో టెక్స్టైల్స్ రంగానికి అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే మేలైన పట్టు, చేనేత వస్త్రాలు తమ రాష్ట్రంలో ఉత్పత్తవుతున్నాయన్నారు.
చేనేత వస్త్రాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పనలో భాగంగా రాష్ట్రంతోపాటు దేశంలోని పలు నగరాల్లో చేనేత ఎగ్జిబిషన్లు, ఎక్స్పోలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగిస్తూ… వారికి 365 రోజుల పని కల్పించే లక్ష్యంతో టెక్స్టైల్స్ పార్కులు, వీవర్శాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూలు కొనుగోలుపై 15శాతం రాయితీ అందిస్తున్నామన్నారు. ప్రజల్లో చేనేత వస్త్రాల వినియోగంపై పెరుగుతున్న మక్కువను దృష్టిలో పెట్టుకుని ఈ కామర్స్ ద్వారా విక్రయాలు ప్రారంభించామన్నారు. అమెజాన్, మింత్రా, ఫ్లికార్ట్, జియో మార్ట్ వంటి ఏడు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల్లో 20 ఆప్కో షోరూమ్ల ద్వారా చేనేత వస్త్రాలను నేరుగా కస్టమర్ల ఇళ్లకే డోర్ డెలివరీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. చేనేత సహకార సంఘాలు చెల్లిస్తున్న జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల, మరమగ్గాల కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వనున్నామన్నారు. నేతన్నలకు 90 శాతం సబ్సిడీతో ఆధునిక పరికరాలు, యంత్రాలు అందజేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రి సవితవెంట రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఢల్లీి పర్యటనకు వచ్చిన మంత్రి సవితకు ఏపీ భవన్లో ఘన స్వాగతం లభించింది.