- అది.. పేదలకు చేసే దానం కాదు…
- సంక్షేమ హాస్టళ్లకు కొత్త లుక్ రావాలి…
- హాస్టళ్ల నిర్మాణాలకు, మరమ్మతులకు నిధులిస్తాం
- యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు పెట్టండి
- త్వరలో శాశ్వత కుల ధృవపత్రాల జారీ
- విద్యా రుణాలపై వడ్డీ భారం తగ్గేలా కొత్త పథకం
- ప్రాంతాల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి
- కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): సంక్షేమం అంటే పేదలకు చేసే దానం కాదు. వారి అభివృద్ధికి, సాధికారతకు మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుందామని కలెక్టర్లకు సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో జరిగిన తొలిరోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్లు, సూపర్ సిక్స్ పథకాల అమలు, డ్వాక్రా, మెప్మా గ్రూపుల పనితీరువంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘‘ఆర్ధికంగా ఇబ్బందులున్నా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సంక్షేమం `అభివృద్ధి రంగాలకు సమతూకంగా నిధులు ఖర్చు చేస్తున్నాం. మూలధన వ్యయం కూడా చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం అందరికీ అందించాం. లబ్దిదారులకు సాయం అందే విషయంలో తలెత్తే చిన్నచిన్న లోటుపాట్లను కలెక్టర్లు సరిదిద్దాలి. మెగా డీఎస్సీ ద్వారా యువతకు 16,347 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికే 6 వేలకుపైగా పోలీసు విభాగంలో ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజన యువతకే ఉద్యోగాలు ఇచ్చేలా ఉన్న జీవో-3ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీనిపై ఏంచేయాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాం. అలాగే ప్రైవేటు రంగంలోనూ జాబ్స్ వచ్చేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వచ్చేలా జాబ్ మేళాలు ఏర్పాటు చేయాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్త్రీశక్తి విజయవంతమైంది. ఈవీ బస్సులతో ఖర్చు తగ్గుతుంది. కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణం, కార్గో ద్వారా ఆర్టీసీ ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం ద్వారా ఏటా రూ.33 వేల కోట్ల వ్యయం చేస్తున్నాం. అక్టోబరు 1న 3 లక్షలమంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అన్ని వర్గాలకూ అండగా…
‘‘వడ్డెర్లకు క్వారీల్లో రిజర్వేషన్లు పెట్టడంతోపాటు సీనరేజీలో మినహాయింపు ఇస్తాం. ఇమామ్, మౌజన్లకు కూడా గౌరవవేతనం ఇస్తున్నాం. విజయవాడలో హజ్ హౌస్ త్వరలోనే పూర్తవుతుంది. హజ్ యాత్రికులకు రూ.లక్ష ఆర్ధిక సాయం చేస్తున్నాం. మసీదుల నిర్వహణకు నెలకు రూ.5 వేలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. అన్ని దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లోనూ బ్రాహ్మణులకు చోటు కల్పించాం. నిర్మాణరంగంలో వర్కర్ల సంక్షేమం కోసం కూడా బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. శాశ్వత కుల ధృవీకరణ పత్రం కూడా త్వరలోనే జారీ చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెడతాం. కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించాం. తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలపై విచారణకు ఆదేశించాం. మత్య్సకారుల సేవలో భాగంగా వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఇస్తున్నాం. ఎవరికీ అన్యాయం జరక్కుండా ఎస్సీ వర్గీకరణను కూడా విజయవంతంగా పూర్తి చేశాం. డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తున్నాం. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల చొప్పున వేతనం ఇస్తున్నాం. అర్చకులకు గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాం. వేద విద్యార్ధులకు రూ.3 వేలు ఇస్తున్నాం. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అసంపూర్తిగా ఉన్న కాపు భవనాలను పూర్తి చేసేలా కార్యాచరణ చేస్తున్నాం. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలవారిని ఆదుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రజకులకు దోబీ ఘాట్లు, షెడ్లు, ఇస్త్రీ చేయడానికి ఆధునిక మౌలిక వసతులు కల్పించాలి. 200 యూనిట్లు హ్యాండ్లూమ్కు, 500 యూనిట్లు పవర్ లూమ్స్ ఉన్నవారికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం’’ అని మఖ్యమంత్రి వివరించారు.
విద్యార్థికి చేయూత-వైద్యానికి భరోసా
‘‘పాఠశాలల్లో ఉన్న వసతులతో 10 తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చూడాలి. ఉన్నత విద్య చదువుకునే విద్యార్ధులకు కేంద్రం నుంచి పావలా వడ్డీ కింద ఎంతైనా రుణం తీసుకునే అవకాశముంది. ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా విధానాలను రూపొందించండి. సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్లు తప్పని సరిగా సందర్శించాలి. విద్యార్ధులకు ఇచ్చే ఆహారం, నీరు, వారికిచ్చే దుప్పట్లు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలి. అన్ని సంక్షేమ హాస్టళ్ల పునర్నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయండి. అవసరమైతే రాత్రి పూట నిద్రచేసి అక్కడ పరిస్థితుల్ని మార్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మెరుగుపర్చేందుకు నిధుల కొరతలేదు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లల్లో చదివే విద్యార్థులు ఐఐటీ, ఐఐఎంవంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించేలా మరింత కృషి చేయాలి. ఇప్పటికే హాస్టళ్లల్లో చదువుకున్న విద్యార్థులు ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు. ఆ సంఖ్య మరింత పెరగాలి. ఆ దిశగా కలెక్టర్లు ఫోకస్ పెట్టాలి. గతంలో చాలామంది అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసేందుకు ఉత్సాహం చూపేవారు. ఎస్ఆర్ శంకరన్లాంటి వారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ. శంకరన్ వంటివారిని నేటితరం కలెక్టర్లు ఆదర్శంగా తీసుకోవాలి. కలెక్టర్లు తమ టాలెంట్తో కొత్త పంథాలో పాలన చేపట్టాలి. యూనివర్సల్ హెల్త్ సర్వీసుల కింద రూ.2.5 లక్షల భీమా రాష్ట్రంలో ప్రజలందరికీ వర్తిస్తుంది. జన ఔషధి కింద జనరిక్ మెడిసిన్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. 9 గంటలపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. పీ`4 మరో గేమ్ చేంజర్ కార్యక్రమం. వాలంటరీగానే అంతా ముందుకు వస్తున్నారు. బలవంతం ఉండదు. పీ`4, డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేసి ముందుకు వెళ్లండి. డ్వాక్రా, మెప్మా, పీ`4లాంటి కార్యక్రమాలతో ఇచ్చిన చేయూతతో ఏమేరకు జీవన ప్రమాణాలు పెరిగాయో చూడాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల్లో తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి’’ అని చంద్రబాబు సూచించారు.
ప్రాంతాల మధ్య పోటీ ఉండాలి… అభివృద్ధికి పరుగులు పెట్టాలి
‘‘అభివృద్ధిలో ఉత్తరాంధ్ర దూసుకెళ్తోంది. ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీ పడుతోంది. ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్, గూగుల్వంటి సంస్థలు వస్తున్నాయి. రాయలసీమలో లేపాక్షినుంచి ఓర్వకల్లు వరకూ పెద్దఎత్తున పరిశ్రమలు వస్తాయి. శ్రీసిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు వస్తున్నాయి. టూరిజం సర్క్యూట్ల ఏర్పాటు ద్వారా ఆర్ధిక ఎకోసిస్టం ఏర్పాటు అవుతుంది. ఎంఎస్ఎంఈలను కూడా ప్రోత్సహించేలా పాలసీలను తీసుకువచ్చాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. గ్రీన్ ట్యాక్స్ను కూడా రద్దు చేశాం. సీ-వీడ్ కల్చర్ను లాజికల్గా తీసుకెళ్తే పెద్దఎత్తున ఆర్ధిక లబ్ది చేరే అవకాశం ఉంటుంది. బయోఫ్యూయెల్ సహా వివిధ రకాలుగా సీ-వీడ్ వినియోగం పెరిగింది. అవసరమైతే దాని కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేద్దాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.