- 20 నెలల్లో ఎంతో చేశాం… భవిష్యత్తులో మరింత చేస్తాం
- రూ.లక్ష కోట్లతో ‘ఉద్యాన హబ’గా రాయలసీమ అభివృద్ధి
- గాడిలో విద్యుత్ వ్యవస్థ- తొలిసారిగా విద్యుత్ ఛార్జీల ట్రూడౌన్
- జనాభా నిర్వహణకు ఈ సెషన్లోనే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ
- ‘నల్లమల సాగర’పై తెలంగాణకు అభ్యంతరాలు ఎందుకు?
- ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు
- గత పాలనలో జరిగిన మద్యం స్కాంను సుప్రీంకోర్టు తప్పుపట్టింది
- శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం
అమరావతి (చైతన్యరథం): ‘గత పాలనలో జరిగిన విధ్వంసంనుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేశాయి. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకున్నాను. 2019-24 మధ్య నాలాగే చాలామంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. విశాఖ వెళ్తే పవన్కళ్యాణ్ను అడ్డుకున్నారు. గతంలో అరాచకాలు చేసిన వాళ్లు ఇప్పుడు నీతులు చెప్తున్నారు. ప్రజలు ప్రతీ అంశాన్నీ గమనిస్తూ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. దాని ఫలితమే కూటమి అద్భుత విజయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి వస్తూనే ఏడు శ్వేతపత్రాలను విడుదల చేశాం. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్రానికి ధన్యవాదాలు. నెలకు రూ.2,750 కోట్లమేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా అందిస్తున్నాం. ఏడాదికి రూ.33వేల కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్థికసాయం అందించాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటిదాకా 43.5 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాం. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వారందరినీ ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. పీ4 ద్వారా భవిష్యత్లో మంచి ఫలితాలు వస్తాయి. సంపద ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలం. సంపద పంచగలం. అందుకే జీరో పావర్టీ ద్వారా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టాం. అట్టడుగుస్థాయిలో ఉన్న వారికి చేయూత అందించేందుకే పీ4 కార్యక్రమం. పేదరిక నిర్మూలనకు సంబంధించి దేశంలోనే ఇది అత్యుత్తమ మోడల” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పీపీపీతోనే ప్రగతి… పురోగతి
“పీపీపీ వల్ల సంపద సృష్టి జరుగుతోంది. రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఈ విధానంలోనే నిర్మితమవుతున్నాయి. పీపీపీ విధానంలో ప్రాజెక్టు నిర్మించి నిర్వహిస్తారు. నిర్దిష్ట కాలపరిమితి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. క్వాంటం నైపుణ్యాల కోసం కోర్సు నిర్వహిస్తుంటే 60 వేలమందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇంధన రంగంలో ట్రాన్సిషన్ సమయం నడుస్తోంది. హరిత ఇంధనానికి డిమాండ్ ఉంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి ఏపీ, మహారాష్ట్ర ఓ మోడల్ అవుతాయి. ఏపీలో ప్రొజ్యూమర్ విధానంలో ఇంధన ఉత్పత్తి చేయాలని భావిస్తున్నాం. సోలార్ ప్యానళ్లను ఇళ్లపై ఏర్పాటు చేసుకుని గ్రిడ్కు అనుసంధానిస్తాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్య సేవలను విస్తృతం చేస్తాం. ఈనెల 16న బిల్ గేట్స్ రాష్ట్రానికి వస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేసి వ్యక్తిగత ఔషధాలను కూడా అందించే అవకాశం ఉంది.
సంజీవని ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి. జనాభా నిర్వహణపై ఈ అసెంబ్లీ సెషన్లోనే పాలసీ తెస్తాం. డెమో గ్రాఫిక్ డివిడెండ్ను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా సంపద సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. మెగా డీఎస్సీ హామీ ఇచ్చి ఏడాదిలోగానే టీచర్లకు పోస్టింగులు ఇచ్చాం. కానిస్టేబుళ్ల నియామకాలు కూడా పూర్తి చేసి స్టైఫండ్ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచాం. భూమి ఇవ్వకుండా, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పరిశ్రమలు, ఉద్యోగాలు ఎలా వస్తాయి? ప్రముఖ పరిశ్రమలకు భూములు ఇస్తుంటే కొందరు వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేలా ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో వేగంగా అనుమతులు ఇస్తున్నాం. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25.6 శాతం ఏపీకే వచ్చాయంటే ఏపీ బ్రాండ్ విలువ ఏమిటో అందరూ అర్ధం చేసుకోవాలి.
గత పాలకుల వేధింపుల కారణంగా అమర్ రాజా బ్యాటరీస్ పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయింది. విశాఖలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ పరిశ్రమలు వస్తున్నాయి. అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిట్టల్ కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాయి. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ కూడా రూ.70 వేల కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. భాగస్వామ్య సదస్సులో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు 610 ఎంఓయులు చేసుకున్నాం. మొత్తంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలో ఇస్తామన్న హామీని నిలబెట్టు కుంటాం.”అని సీఎం స్పష్టం చేశారు.
24గంటల్లో ధాన్యం కొనుగోలుకు చెల్లింపులు జరుపుతున్నాం
“గత పాలకులు సమర్ధంగా నీటి నిర్వహణ చేపట్టలేదు. ఎన్టీఆర్ హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులతో రాయలసీమలో ప్రాజెక్టులు చేపట్టారు. వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేస్తాం. పోలవరం- వంశ ధారను లింక్ చేస్తాం. ఎడమ కాలువ ద్వారా ఈ ఏడాది అనకాపల్లి వరకూ నీటిని తీసుకెళ్తాం. హంద్రీనీవా కాలువలను పూర్తి చేసి కుప్పం వరకూ నీళ్లు తీసుకువెళ్లాం. చెరువులు నింపాం. రాయచోటికి కూడా నీరు తీసుకెళ్తాం. గాలేరు నగరి ద్వారా వచ్చే ఏడాది కడపకూ నీళ్లు పారిస్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎమ్మెల్యేలు కూడా ప్రత్యక్షంగా చూడాలని కోరుతున్నాను. గత పాలకులు రాజకీయ కక్షతో పోలవరాన్ని గోదాట్లో ముంచేశారు. డయాఫ్రాం వాల్ ధ్వంసం చేశారు. ఇప్పుడు రూ. 1000 కోట్లతో మళ్లీ డయాఫ్రాం వాల్ నిర్మిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నెలలోగా జాతికి అంకితం చేస్తాం.
ఏటా 3500 టీఎంసీల గోదావరి వరద జలాలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. అందులో 200 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు తరలిస్తాం. ఈ ప్రాజెక్టుకు తెలంగాణా అభ్యంతరం చెప్పటం సరికాదు. తెలుగు జాతిగా రెండు రాష్ట్రాలూ నీటిని సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైతే ఈ అంశాన్ని సంప్రదింపుల ద్వారా ఓ నిర్ణయానికి రావచ్చు. ఒకటి రెండు అంశాలు పరిష్కారం అయితే కూర్చుని మాట్లాడు కుందామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రతిపాదించారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అడ్డుపడటం సరికాదు. రూ. 1 లక్ష కోట్లతో రాయలసీమను ఉద్యాన హబ్గా తయారు చేస్తాం.
రూ.30 వేల కోట్లమేర ప్రభుత్వ నిధులు… రూ.70 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులతో సీమలో హర్టీకల్చర్ అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం ఏడాదికి 400 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పండ్ల ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్తులో 1000 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులకు కేంద్రస్థానంగా రాయలసీమ ఎదుగుతుంది. అక్వాకల్చర్ గత పాలనలో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రూ.1.50 యూనిట్ చొప్పున విద్యుత్ను ఆక్వాకు ఇస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆక్వా కల్చర్ హబ్గా మన ప్రాంతం తయారవుతుంది. ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు చెల్లించింది కూడా కూటమి ప్రభుత్వమే. కోకోనట్, కోకో, కాఫీలాంటి పంటలపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై మరింత శ్రద్ధపెట్టి వ్యాల్యూ ఎడిషన్ చేసేలా చర్యలు తీసుకుంటాం. ఏపీలో రైతుల ఆత్మహత్యలను నివారించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతీ ఘటననూ ఆడిట్ చేయిస్తాం. విద్యార్ధులు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలి. ఆత్మహత్యలు దేనికీ |












