- అడ్వాన్స్ నిధులతో శరవేగంగా పోలవరం
- 2027 డిసెంబర్నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం
- కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు: మంత్రి నిమ్మల
అమరావతి (చైతన్య రథం): కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు ఉండడంవల్ల అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ నిధులు మంజూరు చేయడంపట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి, నిధుల సాధనకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు రూ.5052 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ నిధులు వచ్చినట్టు చెప్పారు. నిధులు సకాలంలో రావడం కేంద్రం పెద్ద మనసుతో సహకరించటం వల్ల పట్టాలు తప్పిన పోలవరం పనులు నేడు పరుగులు పెడుతున్నాయన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులకు టైంషెడ్యూల్ నిర్ణయించుకుని నిర్మాణ సంస్థలైన మేఘా ఇంజనీరింగ్, బావర్, అఫ్రిలతో సమన్వయం చేసుకుంటూ శరవేగంతో చేస్తున్నట్టు చెప్పారు. అలాగే అంతర్జాతీయ నిపుణులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అధికారులు, కేంద్ర జలశక్తి సంఘ ప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలతో పనులు షెడ్యూల్ టైంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సందర్శించి సంతృప్తి చెందిన తర్వాతే అడ్వాన్స్ నిధులు ఇవ్వడం ఆనందదాయకమన్నారు. 2014-19 కాలంలో 72శాతం పోలవరం పనులు పూర్తి చేసి అప్ప చెబితే, జగన్ ధ్వంసరచనకు పూనుకొని, ఎక్కడ పనులు అక్కడే వదిలేసి డయాఫ్రం వాల్ ధ్వంశానికి కారకుడయ్యాడని దుయ్యబట్టారు.
ఇదే, గత టీడీపీ ప్రభుత్వ కాలంలో చేసిన పనులు తాలూకు, రీయింబర్స్మెంట్ నిధులు జగన్ హయాంలో వస్తే, ఆ నిధులు కూడా ప్రాజెక్టుకి ఖర్చు పెట్టకుండా దారి మళ్లించాడని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం రెండు కట్టర్లను ఉపయోగిస్తున్నామని, ఇప్పటి వరకు 136 మీటర్లు పొడవున, 6700 చదరపు మీటర్లు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటివారం నుంచి, మూడో కట్టర్ కూడా అందుబాటులకి వస్తుందని తెలిపారు. ఎగువ కాఫర్ డ్యాంను బలోపేతం చేయడానికి, బట్రస్ డ్యాం ఇప్పటికే మొదలై శరవేగంగా జరుగుతున్నాయని, వీటితోపాటు క్లే రీచ్లో డివాల్ నిర్మాణానికి సంబంధించి, వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఏడాది డిసెంబరుకి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని, డివాల్కి సమాంతరంగా ఈసిఆర్ఎఫ్ డ్యాం తదితర ప్రాజెక్టు పనులు చేస్తూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తిచేస్తామని మంత్రి నిమ్మల పునరుద్ఘాటించారు.
అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగమైన నిర్వాసితుల బాధలను తీర్చడానికి ఏడేళ్ళ తరువాత నేరుగా రూ.990 కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు జమ చేశారన్నారు. ఈ కారణంగానే నిర్వాసితులు ఈ ఏడాది సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారని మంత్రి నిమ్మల ఆనందం వ్యక్తం చేశారు.