- సాగర నగరంలో సర్వం సిద్ధం
- గిన్నీస్ రికార్డ్స్ సాధించేలా 5 లక్షల మందితో యోగా
- ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు పకడ్బందీ ఏర్పాట్లు
- విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
విశాఖపట్నం (చైతన్యరథం): అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు సాగర నగరం విశాఖ ముస్తాబయింది. శనివారం జరిగే యోగా దినోత్సవానికి సర్వం సిద్ధమయింది. 22 ప్రపంచ రికార్డులు 2 గిన్నిస్ రికార్డులు నెలకొల్పేలా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 26 కిలో మీటర్లు పొడవునా అన్ని ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి నారా లోకేష్ శుక్రవారమే విశాఖకు చేరుకున్నారు.
ప్రపంచ రికార్డులు తిరగరాసేలా విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యేలా 5 లక్షల మందితో యోగాసనాలు వేయించనున్నారు. పెద్దఎత్తున జనం తరలిరావడంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికబద్ధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం ఆర్కేబీచ్ వద్ద 15 వేల మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనే ప్రధాన వేదికను సిద్ధం చేశారు.
కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర మూడున్నర లక్షల మంది యోగసనాలు వేసేలా దారి పొడవునా గ్రీన్ మ్యాట్ పరిచారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు రోడ్లపై రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఎక్కడికక్కడ భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షం పడినా యోగాకు ఇబ్బంది లేకుండా ఏయూ ప్రాంగణంలో జర్మన్ టెంట్ల కింద 15 వేల మంది యోగా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రధానితో కలిసి యోగసనాలు వేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు శిక్షకులు, విశాఖ వాసులు చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు శుక్రవారం అర్థరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు. శనివారం ఉదయం 5 గంటల కల్లా వారికి కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఎవరెవరు ఏయే గ్యాలరీల్లోకి వెళ్లాలో ఇప్పటికే కచ్చితమైన సూచనలు చేశారు. ఒక్కో గ్యాలరీలో వెయ్యిమంది చొప్పున 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి సూచించిన కంపార్ట్మెంట్లలోకి వారు మాత్రమే వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు.
ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు
ప్రజలు గందరగోళానికి గురికాకుండా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారం అందుబాటులో ఉంచారు. ముందే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయిన వారూ అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ యోగా మ్యాట్తోపాటు కిట్, వాటర్ బాటిల్, రెయిన్కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కంపార్ట్మెంట్ లో ఒక శిక్షకుడు, ఇద్దరు పోలీసులు, వైద్య సిబ్బంది, ఒక సహాయకులు ఉండేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
యోగాసనాల్లో పాల్గొననున్న మోదీ, చంద్రబాబు, పవన్
ఆర్కే బీచ్లోని ప్రధాన వేదిక వద్ద శనివారం ఉదయం 6.25 గంటలకు యోగాంధ్ర`2025 కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాత్రికి కలెక్టరేట్ వద్ద బస్సులో బస చేసిన సీఎం చంద్రబాబు ఉదయం 6.15 గంటలకు ఆర్కేబీచ్కు బయలుదేరతారు. ఐఎన్ఎస్ చోళ బస నుంచి ఉదయం 6.05 గంటలకు బయలుదేరి ప్రధాని మోదీ 6.25కు ఆర్కే బీచ్కు చేరుకుంటారు. ఆర్కే బీచ్లో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతారు. 6.30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగిస్తారు. చివరగా ప్రధాని మోదీ 15 నిమిషాలపాటు ప్రసంగిస్తారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి 7.45 వరకు నిర్వహిస్తారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ, గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు ప్రతాప్ రావు, రామ్మోహన్నాయుడు, శ్రీనివాస్ వర్మ యోగాసనాలు వేస్తారు. ప్రధాన వేదిక వద్ద 50 దేశాలకు చెందిన రాయబారులు కూడా ఆసనాలు వేయనున్నారు. అతిపెద్ద కార్యక్రమం కావడంతో పదివేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో 10వేల మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 1300 సీసీ కెమెరాలను రెండు కమాండ్ కంట్రోల్ రూంలకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో పహారా కాయనున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగసనాలు వేయనున్నారు