- నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
- సీఆర్డీఏ సమావేశ నిర్ణయాలకు ఆమోదం
- భూకేటాయింపులు, రాయితీల కల్పనకు ఓకే
- 17మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష
- 248మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి
- వైఎస్సార్ జిల్లా పేరు వైఎస్సార్ కడప జిల్లాగా మార్పు
- పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు
- మహిళల రాత్రిపూట పనికి చట్టసవరణ
- రాత్రిపూట పనిచేసేచోట భద్రత, రవాణా సౌకర్యం
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి కొలుసు
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకర్ల సమావేశంలో వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ఆదివాసీ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాకు రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్కు మంత్రిమండలి ఆమోదించింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 533 నీటి కొరత ఉన్న జనావాసాల్లో కవరేజీ కోసం క్లస్టర్ ఆధారిత విధానంలో 15 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు రూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం తెలిపింది.
దీంతో శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపుకొట్టూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, మందస తదితర ఏడు మండలాల్లో, సీతంపేట మండలంలోని ఆదివాసీ ప్రాంతాలతో సహా 341 జనావాసాల్లోని 2.42 లక్షలమంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 533 జనావాసాల్లోని 2.85 లక్షలమందికి పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుంది. 2025 ఫిబ్రవరి 1నాటికి యావజ్జీవ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న 17మంది ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరుకు హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెల్పింది. ఏపీఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి కల్పించేందుకు, కానిస్టేబుళ్ల సంఖ్యను 248కి తగ్గించేందుకు హోంశాఖ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపనకు ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం పిన్నమరెడ్డి పల్లి, నూగొండపల్లి గ్రామాల్లో మొత్తం 94.497 ఎకరాల ప్రభుత్వ భూమిని హోంశాఖకు బదిలీ చేయడానికి రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఏలూరు జిల్లాలో నిర్మించతలపెట్టిన హైద్రాబాద్ ఐ ఇనిస్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ కసరనేని దమయంతి దాన ప్రక్రియ ద్వారా ఇవ్వతలపెట్టిన పెడవేగి మండలం వంగూరు గ్రామంలోని 10.88 ఎకరాల భూమి బదలాయింపునకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపుపై రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రూ.10.54 లక్షల ట్రాన్సఫర్ డ్యూటీ మినహాయింపును హైద్రాబాద్ ఐ ఇనిస్టిట్యూట్ పొందనుంది.
ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలు చేసింది. కార్మిక చట్టాలు సరళంగా ఉంటే పెట్టుబడులు కూడా అధికంగా వస్తాయని మంత్రి మండలి అభిప్రాయపడిరది. ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఓవర్ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పని చేసే అవకాశం ఉండేది. ఇకపై మహిళలు క్వార్టర్లో 144 గంటలు ఓవర్ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సహించడం కోసం నిబంధనలను సైతం సవరించామని స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని హరిత హోటల్లో యాత్రీ నివాస్ను అధునీకరించేందుకు పర్యాటక రంగం చేసిన ప్రతిపాదనకు రూ.13.5కోట్లకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలోని హరిత హోటల్ ఆధునీకరణకు టూరిజం శాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు సైతం ఆమోదించింది.
గత ప్రభుత్వం హరిత హోటల్ అభివృద్ధి పనులకు రూ.4.5 కోట్లుగా నిర్ణయించి అంచనాలను రూ.13.5 కోట్లకు పెంచింది. దీంతో హరిత హోటల్ అభివృద్ధి కోసం రూ.13.50 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిలో క్వాంటం కంప్యూటర్, కృత్రిమ మేధ సంస్థల ఏర్పాటునకు మంత్రి మండలి ఆమోదించింది. క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థల ఏర్పాటునకు అమరావతిలో 50 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వాంటం కంప్యూటింగ్, ఏఐలో రాబోయే 5నుంచి 10 ఏళ్లలో ఏపీ నెంబర్ వన్ స్థానానికి చేరడమే లక్ష్యమని కేబినెట్ స్పష్టం చేసింది. క్వాంటం కంప్యూటింగ్, ఏఐ సంస్థల్లో స్కూళ్ల నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహించాలని నిర్ణయించింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అత్యధికమందితో యోగా చేయించి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన బడ్జెట్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాదిలో 25 ఈ- కేబినెట్లు నిర్వహించినందుకు సీఎం చంద్రబాబుకు కేబినెట్ అభినందనలు తెలిపింది. అలాగే ఈ ఏడాది పాలనలో అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు కేబినెట్ అభినందించింది.