న్యూఢిల్లీ: కేంద్ర చేనేత, జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ను మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్-2025కు హాజరైన గిరిరాజ్ సింగ్ను మంత్రి సవిత కలిశారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం చేయూతనందించాలని కోరారు. గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వ అసమర్థత కారణంగా ఏపీలో చేనేత పరిశ్రమ నిర్వీర్యమైందన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించకపోవడంతోపాటు జగన్ ప్రభుత్వంనుంచి ఎటువంటి ప్రోత్సాహం లభించకపోవడంతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని వివరించారు. చేసిన అప్పులు తీర్చలేక, ఉత్పత్తులు అమ్మకానికి నోచుకోక ఎందరో నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారని కేంద్ర మంత్రి గిరిరాజ్ దృష్టికి సవిత తెచ్చారు. 2024 ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాతనుంచి చేనేత రంగానికి మంచిరోజులు ప్రారంభమయ్యాయన్నారు.
కొద్ది నెలల కిందటే నూతన టెక్స్టైల్స్ పాలసీ తెచ్చామన్నారు. 2014-19 మధ్య ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం అమలు పథకాలన్నింటినీ పునరుద్ధరించామని వివరించారు. వాటితో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపునకు సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. నేతన్నలకు 365 రోజులు పని కల్పించాలన్న లక్ష్యంతో నూతన టెక్స్టైల్స్ పార్కులు, వీవర్ శాలలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం అండగావుంటే నేతన్నలకు మరింత ఆర్థిక భరోసా కలిగించే అవకాశముంటుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ దృష్టికి మంత్రి సవిత తీసుకెళ్లారు. రాష్ట్రంలో చేనేత రంగంలో పెట్టుబడులకు సాయమందించాలని కోరారు. మంత్రి సవిత వినతులపై కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్ సానుకూలంగా స్పందించారు. మంత్రి సవిత వెంట రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.