- న్యాయం చేయాలని బాధితుడి వినతి
- సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన జనం
- అర్జీలు స్వీకరించి పరిష్కారానికి కృషి చేసిన మాజీ ఎంపీ కంభంపాటి
అమరావతి (చైతన్యరథం): గతంలో ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు వింతా శంకర్ రెడ్డి ఆక్రమించుకున్నాడని, అతనిపై చర్యలు తీసుకొని తన పొలంలో అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామానికి చెందిన పావులూరి సుబ్బారావు.. టీడీపీ నేతలకు అర్జీ ఇచ్చి విన్నవించుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి పలు సమస్యలపై ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావుకు అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన అచ్చుగట్ల ఖాజీ హుసేని విజ్ఞప్తి చేస్తూ.. తమకు పెద్దల ద్వారా సంక్రమించిన భూమిని వైసీపీ నాయకులు అల్లబండ ముక్తావలి, అల్లబండ బడేస్వామిలు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని..వారి నుండి తమ భూమిని విడిపించి తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామానికి చెందిన పర్చూరి లింగారావు విజ్ఞప్తి చేస్తూ.. గత వైసీపీ ప్రభుత్వంలో కక్ష గట్టి తమ కుమారులపై అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. గ్రామంలో జరిగిన సంఘటనలపై గుంటూరులో నివాసం ఉంటున్న తన కుమారులకు ఎటువంటి సంబంధం లేకపోయినా అక్రమ కేసులు పెట్టారని, వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన బెజవాడ ప్రకాశ్ అనే వ్యక్తి తన కూతురిని లోబరుచుకొని తనను చంపాలని చూస్తున్నాడని.. కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన ఓ తండ్రి వాపోయాడు. అతనిపై వెంటనే చర్యలు తీసుకొని తనకు ప్రాణహాని లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
మన్యం జిల్లా కొమరాడ మండలం చంద్రపేట గ్రామానికి చెందిన గార గౌరీశంకరరావు విజ్ఞప్తి చేస్తూ.. అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై విక్రాంపురం, సీవివి గ్రామాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములకు రికార్డులు తారుమారు చేస్తూ భూ భకాసురులకు కట్టబెడుతున్నారని, దీనిపై ప్రత్యేక దరాప్తు చేపట్టి చర్యలుతీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన చిన్నమాబు విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వంలో తమ భూమి కబ్జాకు గురైందని, కబ్జాపై వైసీపీ పాలనలో అధికారుల చుట్టూతిరిగినా పట్టించుకోలేదని, దయ చేసి తమ భూమిని కబ్జా నుండి విడిపించి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.