- పిశాచగణాలను వెనకేసుకొచ్చిన సైకో నేత
- తలలు నరుకుతాం అనే వ్యాఖ్యల్లో తప్పు లేదంటూ బరితెగింపు
- ఫ్యాక్షన్ వారసత్వానికి కొనసాగింపు
- ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంలా జగన్ రెడ్డి తీరు
అమరావతి (చైతన్యరథం): ఉన్మాదంతో ఊగిపోయిన పిశాచగణాలను సైకో నేత నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. ప్రజలు ఎంత గట్టిగా బుద్ధి చెప్పినా తన తీరు మారదని మరోసారి స్పష్టం చేశారు. అంతు చూస్తాం.. రప్పా రప్పా నరుకుతాం’ అంటూ పల్నాడులో భీతావహ వాతావరణానికి కారణమైన తమ పార్టీ కార్యకర్తల్ని మందలించాల్సింది పోయి వారిని వైసీపీ అధినేత జగన్ రెడ్డి వెనకేసుకొచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. పైగా దానికో కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. ‘పుష్ప’ సినిమాలో డైలాగ్ కొట్టడం కూడా తప్పేనా? అంటూ మీడియా సమావేశంలో సమర్థించుకొచ్చారు.
గంగమ్మతల్లి జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరికేస్తాం..అని పోస్టర్లో ఉన్నది ‘పుష్ప’ సినిమా డైలాగ్.. అది పోస్టర్లో పెట్టినా తప్పేనా.. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. పుష్ప సినిమాలో ఫొటోలు పెట్టినా, గడ్డం చేతితో రుద్దుకున్నా తప్పేనా.. అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. సినిమా డైలాగులు వాడితే కూడా కేసులు పెడతారా అంటూ ఉన్మాదులను సమర్థిస్తూ జగన్ మాట్లాడటం అత్యంత బాధ్యతా రాహిత్యం.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. ఆయన మానసిక స్థిరత్వం కోల్పోయారా..లేక ఫ్యాక్షనిస్టు వారసత్వం కొనసాగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బహిరంగంగా హింసను, దౌర్జన్యాన్ని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. ఇలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రి నోట రావడం చూస్తుంటే ఆయన మానసిక స్థితిపైనే తీవ్రమైన అనుమానాలు కలుగుతున్నాయి. ఇది రాజకీయ పరిపక్వత లేమిని, బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంగా చాటిచెబుతోంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, తనను అభిమానించే వారిని హింసకు ప్రేరేపించడం, ప్రత్యర్థులను ‘‘నరుకుతామని’’ చెప్పిన వారిని సమర్థించడం ఎంత వరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా?
ఇది ఆయన ఫ్యాక్షనిస్టు నేపథ్యం నుంచి వచ్చిన దుష్ట వారసత్వానికి నిదర్శనమా? అహంకారంతో, అధికారాన్ని కోల్పోయిన ఆవేశంలో ఆయన ఇంత దిగజారి మాట్లాడుతున్నారా? గతంలో కూడా ఇలాంటి దౌర్జన్యపూరిత ఘటనలను, విద్వేషపూరిత వాతావరణాన్ని ప్రోత్సహించిన చరిత్ర ఆయనకు ఉంది. మొన్నటికి మొన్న తమ ఆస్థాన మీడియా సాక్షి ద్వారా రాజధాని ప్రాంత మహిళలను వేశ్యలంటూ మురికి వ్యాఖ్యలతో అగౌరవపరిచి, అలా మాట్లాడిన వారిని వెనకేసుకొని వచ్చారు. ఇవాళ ఉన్మాదమూకల హింసాత్మక వ్యాఖ్యలను సమర్థిస్తూ, పరోక్షంగా తన అనుచరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి విద్వేషపూరిత, హింసాత్మక వ్యాఖ్యలను ఒక మాజీ ముఖ్యమంత్రి సమర్థించడం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదనే విషయాన్ని సామాన్య ప్రజలు తెలుసుకోవాలి.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును నాయకులు శిరసావహించాలి. పరాజయం పాలయితే ఆత్మపరిశీలన చేసుకోవాలే తప్ప, ఇలాంటి రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే రాజకీయం చేయటం అత్యంత హేయం. ప్రజల మధ్య విద్వేషాలను పెంచి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను పౌర సమాజం ముక్తకంఠంతో ఖండిరచాలి. ఓ వైపు ఫ్యాక్షన్ మాటలను సమర్థిస్తూ, మరోవైపు నక్సలైట్లుగా మారతారంటూ రకరకాల బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం చూస్తుంటే.. జగన్ అనే వ్యక్తి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమనే విషయం తేటతెల్లమవుతోంది.
తాము అధికారంలోకి వస్తే తలకాయలు నరుకుతామని బెదిరిస్తూ వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించడాన్ని జగన్ వెనకేసుకు రావడం చూస్తే, తన మనసులో మాటనే వారి ద్వారా ఆ విధంగా చెప్పించారని అనుమానించక తప్పదు.